చమురు రంగంలో రాష్ర్టాల ఆదాయానికి కేంద్రం గండికొడుతున్న వైనం.. సమాఖ్య వ్యవస్థను నరేంద్ర మోదీ సర్కారు ఎంతమాత్రమూ ఖాతరు చేయటం లేదనటానికి తాజా నిదర్శనం. రాష్ర్టాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కూడా కేంద్రం ఇవ్వకపోవటం దారుణం. పెట్రోల్, డీజిల్పై దొడ్డిదారిన సెస్సులు, సర్ఛార్జీల పేరుతో వసూళ్లు చేస్తున్న కేంద్రం వచ్చిన ఆదాయాన్నంతా తన గుప్పిటే పెట్టుకొంటున్నది. ఫలితంగా కేవలం 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ర్టాలకు రూ.1.15 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. స్వయంగా పెట్రోలియం మంత్రిత్వశాఖ వెల్లడించిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 271 ప్రకారం కేంద్రం వసూలు చేసే ఏ రకమైన పన్నులు, సుంకాల్లోనైనా 41 శాతం వాటాను రాష్ర్టాలకు పంచాలి. ప్రత్యేక సందర్భాల్లో విధించే సెస్సులు, సర్ఛార్జీలలో మాత్రం వాటాను పంచాల్సిన అవసరం లేదు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని మోదీ సర్కారు రాష్ర్టాల పొట్ట కొడుతున్నది. గత ఎనిమిదేండ్లలో పెట్రోల్, డీజిల్పై సెస్సులు, సర్ఛార్జీలను ఎడాపెడా విధిస్తూ ఆ మొత్తాన్ని తన ఖజానాకే తరలించుకుంటున్నది. 2014-15లో పెట్రో రంగం నుంచి కేంద్రానికి రూ.1.72 లక్షల కోట్ల రాబడి రాగా, 2021-22కి ఆ మొత్తం రూ.4.92 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 186 శాతం వృద్ధి. ఇదే కాలవ్యవధిలో రాష్ర్టాలకు లభించిన ఆదాయం రూ.1.62 లక్షల కోట్ల నుంచి రూ.2.82 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 75 శాతం వృద్ధి మాత్రమే. కేంద్రం ఏటా భారీ ఎత్తున రాష్ర్టాలకు మొండిచెయ్యి చూపుతున్నది. మిగిలిన రంగాల్లోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా, కేంద్ర పన్నుల్లో 41 శాతం వాటా రాష్ర్టాలకు దక్కాల్సి ఉన్నప్పటికీ నికరంగా అది 29-32 శాతానికి కూడా మించటం లేదు.
భారతదేశం అంటేనే రాష్ర్టాల సమాఖ్య అని రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించింది. కేంద్రంలో కొలువైన ప్రభుత్వాలు దీనిని పూర్తి చిత్తశుద్ధితో ఎన్నడూ అమలు చేయకున్నా.. సమాఖ్య స్వరూపానికే విఘాతం కలిగించే పనులు చేపట్టటం మాత్రం అరుదే. కానీ, మోదీ హయాంలో ఈ తరహా నిర్ణయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా, రాష్ర్టాల ఆర్థిక వనరులను దెబ్బకొట్టేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. ‘ఒకే దేశం-ఒకే పన్ను’ అనే ఆర్భాటపు ప్రకటనలతో జీఎస్టీని తీసుకొచ్చి రాష్ర్టాల ఆదాయాన్ని తీవ్రంగా నష్టపరిచింది. కేంద్ర సర్వీసుల అధికారుల నిబంధనలను మార్చటం, విద్యుత్ రంగంలో బోరుబావులకు మీటర్లు పెట్టేలా రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి తేవటం, రైతులు పండించే పంట ఉత్పత్తుల కొనుగోలు విషయంలో రాష్ర్టాలతో అనవసర వివాదాలకు దిగటం వంటివన్నీ మోదీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలకు ఉదాహరణలు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా చెప్పినట్లుగా ఈ దేశంలో తాము తప్ప మరో పార్టీ మిగిలి ఉండకూడదన్న లక్ష్యంతో బీజేపీ సర్కారు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. సమాఖ్య వ్యవస్థ స్థానంలో కేంద్రీకృత నిరంకుశ వ్యవస్థ తీసుకురావటమే వారి ఉద్దేశం కావచ్చు. దీనిని విపక్షాలు, ప్రజాస్వామికవాదులు ముక్తకంఠంతో ఖండించాలి.