‘ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ’ ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో రాష్ట్రంలోని జర్నలిస్టుల గురించి చెప్పే ముచ్చట. జర్నలిస్టుల స్థితిగతులు తనకు తెలుసునని చెప్తూ, వారి బతుకులు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి ఆయన. రాష్ట్ర సాధన ఉద్యమం మొదలు ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యాక కూడా ఆయనలో జర్నలిస్టు సమాజంపై ఉన్న మమకారం ఏ మాత్రం తగ్గలేదు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తి కేసీఆర్.
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల కేటాయింపు సమస్య సుదీర్ఘమైనది. గురువారం సుప్రీంకోర్టు తెలంగాణ జర్నలిస్టుల ఇంటి సమస్యను తీర్చేలా సానుకూల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆషామాషీగా రాలేదు. దీనివెనుక పదిహేనేండ్ల చరిత్ర ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం నేతి బీరకాయలో నెయ్యిలా ఉండేది. 2007-2008లలో నాటి పాలకులు ఆర్భాటంగా జర్నలిస్టులకు ఇండ్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ, అంతా మొక్కుబడి తంతు చేశారు. ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించలేదు. జర్నలిస్టుల మధ్యనే పంచాయతీ పెట్టి జారుకున్నారు. వీటన్నింటికి తోడు అనేక న్యాయ సమస్యలు, చిక్కుముడులు పడేలా వ్యవహరించారు. దీంతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలన్నవి ఎండమావులే అన్నట్టుగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం కోసం జర్నలిస్టులు తొక్కని గడప లేదు.. మొక్కని నాయకుడు లేడు. కానీ, సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. జర్నలిస్టుల ఇంటి సమస్యను ఐఏఎస్, ఐపీఎస్లు తదితర వర్గాలతో కలిపి కేటాయించడంతో అది జఠిలమైపోయింది. అసలు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు దుస్సాధ్యమే అన్నట్టుగా మారింది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కారు న్యాయమార్గంలోనే జర్నలిస్టులు విజయం సాధించేలా చేసింది. జర్నలిస్టుల ఇంటి జాగలపై కొనసాగిన న్యాయపోరాటం ఇక ఒక కొలిక్కి వచ్చినట్టే.
ఆది నుంచి జర్నలిస్టుల పక్షపాతి: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో నాటి ఉద్యమ సారథి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఎక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటుచేసినా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసిన తర్వాత తెలంగాణ మీడియా అకాడమీని ఏర్పాటుచేశారు. ప్రముఖ జర్నలిస్టు, ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్గా పనిచేస్తున్న అల్లం నారాయణను చైర్మన్గా నియామకం చేశారు. తానే స్వయంగా మీడియా అకాడమీకి వచ్చి సీనియర్ జర్నలిస్టులతో రోజంతా సమావేశమయ్యారు. అన్ని సమస్యలు సావధానంగా విని.. పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. మీడియా అకాడమీ ఒక శిక్షణ కేంద్రంగానే కాదు, జర్నలిస్టుల సంక్షేమానికి వారధిగా ఉండాలన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.వంద కోట్లు అకాడమీకి ఇస్తామని చెప్పి ఏటా బడ్జెట్లో నిధులను కేటాయిస్తూ వస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులే ఉండేవి కావు. ఉచిత వైద్యం కూడా లేదు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి అర్హులైనవారందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా చేశారు. బస్ పాసులు, హెల్త్కార్డులు ఇచ్చారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా చికిత్సలు అందించారు. జర్నలిస్టులు ఏదైనా కారణంతో మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునే మానవీయ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే రూపకల్పన చేశారు.
జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే కాదు, వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు. జర్నలిస్టు మరణిస్తే రూ.లక్ష ఇవ్వడంతోపాటు వారి కుటుంబానికి నెలకు మూడువేల పింఛన్, పిల్లల విద్య కోసం ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున అదనంగా ఇచ్చే ఏర్పాటు చేశారు. దేశంలో ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ. ప్రజా కోణంలో ఆలోచించి, వారి సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మించినవారు లేరు. ప్రజల శ్రేయస్సు కోసం ఆయనలో ఆర్తి ఉంటుంది. పరిపాలనలో మానవీయ కోణాన్ని జోడించడం ఒక్క కేసీఆర్కే చెల్లింది.
కరోనా విలయ తాండవం: కంటికి కనపడని మహమ్మారి విలయతాండవం చేస్తున్నపుడు 64 మంది జర్నలిస్టులు మృతి చెందారు. పత్రికల యాజమాన్యాలు కనికరించకపోయినా మీడియా అకాడమీ ద్వారా ఒక్కో కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందేలా ఏర్పాటు చేశారు. కరోనా బారినపడ్డ 4 వేల మంది జర్నలిస్టులకు ఆర్థికంగా ఆసరా అందించారు. దీనికోసం మీడియా అకాడమీ రూ.6 కోట్లు ఖర్చు చేసింది. ఇలా చెప్పుకొంటూ వెళ్తే ఉదాహరణలు కొల్లలు.
ఇండ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకొని: 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక సందర్భంలో జర్నలిస్టుల ఇండ్ల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద చర్చ జరిగింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇంటి జాగ ఇప్పించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి చెప్పారు. న్యాయస్థానంలో ఉన్న కేసును పరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు. హౌజింగ్ సొసైటీ కేసు గురించి స్వయంగా ఫాలోఅప్ చేశారు. స్వయంగా అడ్వొకేట్ జనరల్, లా సెక్రటరీలతోపాటు ఢిల్లీలోని న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ ముఖ్యులను అనేక పర్యాయాలు సుప్రీంకోర్టుకు, న్యాయ నిపుణుల వద్దకు పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, మార్గదర్శనం వల్లే ఈ వివాదం ఎట్టకేలకు కొలిక్కివచ్చి కథ సుఖాంతమైంది. ఆయన తరచూ ఒక మాట చెప్తుంటారు.. ‘అల్లాహ్ కే నజర్ మే దేర్ హై మఘర్ అందేర్ నహీ హై’ అని. సమస్య పరిష్కారంలో జాప్యం జరిగి ఉండవచ్చు కానీ, సమస్య పరిష్కరించాలన్న దృఢసంకల్పం కేసీఆర్ మదిలో ఉన్నది కాబట్టే పరిష్కారం లభించింది.