(కాళేశ్వరంపై కబోది విమర్శలు-2)
తుమ్మిడిహెట్టిని కాదని, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టును కట్టడంలో హేతుబద్ధత ఏమీ లేదని అనటమే కాదు, ఎత్తిపోతల పంపులతో విద్యుత్ చార్జీల కారణంగా అది మోయలేని బరువుగా తయారవుతుందని ఇంకా రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసేవే తప్ప వాటికి ఏ పునాదీ లేదన్నది వాస్తవం.
తుమ్మిడిహెట్టి పైన వాద్రా, వెయిన్గంగ కలిసి ‘ప్రాణహిత’గా ఏర్పడుతుంది. అక్కడి నుంచి 113 కిలోమీటర్ల మేర ప్రవహించి భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో కలుస్తుంది. అంటే.. ఒక నది దాని క్యాచ్మెంట్ ఏరియాలో వాగులు, వంకలు, పిల్ల కాలువలు ఏవీ కలవవా? ఆ వచ్చిన వరద నీరు ఎక్కడికి పోతది? ప్రాణహిత నదిలో కలవాల్సిందే కదా. అంతేకాదు ప్రాణహితలో కలిసే ఒక్క పెదవాగే 60 నుంచి 70 టీఎంసీల నీటిని మోసుకొస్తుంది. అలాంటప్పుడు పైన తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న నీటి లభ్యత, కింద మేడిగడ్డ దగ్గర ఉన్న నీటి లభ్యత.. ఒకటే ఎలా అవుతుంది? దానికి తోడు.. ఎల్లంపల్లి కింద గోదావరి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చిన వరద.. ఇటు లోయర్ మానేరు డ్యామ్ తర్వాత దాని క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చిన వరద ఎక్కడ పోతది? అది కూడా గోదావరిలో కలవాల్సిందే కదా. మేడిగడ్డకు రావాల్సిందే కదా. ఇవన్నీ కలిసి మేడిగడ్డ దగ్గర నికరంగా 75 శాతం విశ్వసనీయతతో 284 టీఎంసీల నీళ్లు లభ్యమైతాయని సీడబ్ల్యూసీ రిపోర్టు పేర్కొన్నది. మొత్తానికి మేడిగడ్డ దగ్గర 284 టీఎంసీల నీటి లభ్యత ఉంటదని స్పష్టత రావడంతో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఇప్పటికైనా అర్థమైందా?
ఇదే కాదు, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మారడానికి మరికొన్ని కారణాలున్నాయి. గోదావరి మీద మూడు బ్యారేజీలు నిర్మించారు. 1. మేడిగడ్డ (16.17 టీఎంసీలు),
2. అన్నారం (10.87టీఎంసీలు), 3. సుందిళ్ల (8.83 టీఎంసీ లు). ఈ మూడు బ్యారేజీల్లో మొత్తం సుమారు 30 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా కొందరు తలాతోక లేని ఆరోపణలే చేస్తున్నరు.
మేడిగడ్డ నుంచి మూడు బ్యారేజీలు ఎందుకు కట్టడం.. నేరుగా ఎల్లంపల్లిలో ఎత్తిపోసుకోవచ్చు కదా అని. అందుకే వీళ్లది మూర్ఖపు వాదన అనేది. మేడిగడ్డ, దాని కింద తుపాకులగూడెం నుంచి ఎల్లంపల్లి దాకా దాదాపు 150 కిలోమీటర్ల పొడవున గోదావరి నదిలో ఏడాది పొడవునా నీళ్లుంటే.. అది తెలంగాణకు ఎంత ప్రయోజనం. ఎంతగా భూగర్భ జలాలు పెరుగుతయో వీళ్లు ఆలోచించటం లేదు. ఎల్లంపల్లి రిజర్వాయర్ను వదిలేసినా, గోదావరి నది మీదనే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు ఉంటయ్ కదా. ఆ నీళ్లను ఎప్పుడైనా తెలంగాణ వాడుకోవచ్చు కదా. ఎందుకు ఈ అదనపు ‘స్టోరేజీ’ని మర్చిపోతున్నరు? ఇలా రీడిజైన్ చేసిన తర్వాత కాళేశ్వం ప్రాజెక్టు ప్రకారం మొత్తం ఆన్ లైన్ స్టోరేజీల సామర్థ్యం 141 టీఎంసీలు. అదే పాత ప్లాన్ ప్రాణహిత-చేవెళ్ల ప్రకారమైతే కేవలం 14.7 టీఎంసీలే అన్నది గుర్తుంచుకోవాలి.
ఇక ప్రాజెక్టు వ్యయం గురించి- ప్రాణహిత చేవెళ్ల పాత డిజైన్ ప్రకారమైతే రూ.40,300 కోట్లతో పూర్తయ్యేది. అదే కాళేశ్వరం అయితే రూ.80,190 కోట్లు అయినయ్ కదా అని వాదించే వారున్నారు. నిజమే. కానీ… రూ.40,300 కోట్లు 2010 నాటి అంచనా. అప్పుడు అంత ఉంటే, పెరిగిన రేట్ల ప్రకారం అది 2016 నాటికి ఎంతై ఉండేది. ఏటా 10 శాతం పెంపు వేసుకున్నా పాత ప్రాజెక్టును పాత ప్లాన్ ప్రకారమే కట్టినా అది రూ.65 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లకు చేరేది. పైగా అంత ఖర్చు పెట్టినా దాంట్లో నీటి నిల్వ సామర్థ్యం 14.7 టీఎంసీలు మాత్రమే. సాగు విస్తీర్ణం కూడా 16 లక్షల 40 వేల ఎకరాలే. అదే రీడిజైనింగ్లో 141 టీఎంసీలను మనం నిల్వ చేసుకోవచ్చు. సాగు విస్తీర్ణం కూడా కొత్తగా 18.25 లక్షల ఎకరాల ఆయకట్టు, మరో 18.85 లక్షల ఎకరాలను స్థిరీకరించడం జరుగుతుంది. అందుకని ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ఈ లెక్కన రీడిజైనింగ్లో మనం అధికంగా ఖర్చు చేసింది కేవలం 10 నుంచి 11 వేల కోట్లే అన్నది గమనార్హం. కాళేశ్వరం మీద జరుగుతున్న విషప్రచారానికి అంతులేదు. ‘వరదలో లక్ష కోట్లు కొట్టుకపోయినయ్. బాహుబలి పంపులు నీట మునిగినయ్. కాళేశ్వరం మనకు దేనికి పనికిరాదు..’ అని తెగ ప్రచారం చేస్తున్నరు.
అసలు మునిగిన రెండు పంప్హౌజుల్లో బాహుబలి పంపులే లేవు. గోదావరిలో మునిగినవి కన్నెపల్లి, అన్నారం పంపులు. అవి బాహుబలి పంపులు కాదు. అవి ఉన్నది.. లక్ష్మీపూర్ దగ్గర. ఈ మాత్రం తెలియకుండా కాళేశ్వరం మీద తీర్పులు ఇస్తూ, రెండు పంపులను చూపించి కాళేశ్వరం మొత్తం కొట్టుకు పోయిందనడం మూర్ఖపు వాదన మాత్రమే కాదు, కపటపూరితం కూడా.
చివరగా… కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటి వెనకున్న పంపులే అని చాలామంది అనుకుంటున్నరు. అవి మునిగితేనో, అవి పనిచేయకపోతేనో ప్రాజెక్టు మొత్తం ఆగిపోయినట్లు అనుకుంటున్నరు. కానీ.. అది అవగాహన రాహిత్యం. కాళేశ్వరాన్ని మనం మూడు భాగాలుగా చూడొచ్చు. ఒకవేళ.. గత రెండేండ్ల నుంచి పడుతున్నట్టు జోరుగా వానలు పడి, గోదావరిలో పుష్కలంగా నీళ్లొస్తే.. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేరు నుంచే కాళేశ్వరం మొత్తానికి నీళ్లివ్వొచ్చు. కాస్త వర్షాలు తక్కువ పడితే.. కడెం ప్రాజెక్టు, దాని క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన వరద నీళ్లు, గోదావరి జలాలతో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకుని.. మిడ్ మానేరు నుంచి కాళేశ్వరం కిందున్న మొత్తానికి నీళ్లివ్వొచ్చు. పూర్తి గా వర్షాలు పడనప్పుడు.. కరువుకాలం వచ్చినప్పుడు మొదటున్న మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు. ప్రాణహితలో ఎప్పుడూ నీళ్లు ఉంటయ్ కాబట్టి వరుసగా పదేండ్ల పాటు పెద్దగా వర్షాలు పడక పోయినా మనం మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని పైకి ఎత్తిపోసుకోవచ్చు. ఇలా, మొత్తం మూడు విధాలుగా కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవచ్చు. అంతేకానీ.. ఏదో రెండు పంపు హౌజులు మునిగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా మునిగినట్టు కాదు. ఎవ్వరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా కాళేశ్వరం తెలంగాణ కల్పతరువు.
మేధావుల ముసుగులో కొందరు, జర్నలిజం ముసుగులో మరికొందరు గుజరాతీ బానిసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నరు. అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల దాన్ని నిజం చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏదో నాలుగు లిఫ్టులు, మూడు బ్యారేజీలు కాదు. కాళేశ్వరం అంటే తెలంగాణ జీవనాడి. దాని మీద తప్పుడు ప్రచారం చేసి, బురద చల్లే ప్రయత్నం చేయడమంటే జాతి ద్రోహానికి తలపడినట్లే.
(ఈ వ్యాసం ఇంతటితో సమాప్తం)
కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర వివరాలున్న ఈ వ్యాసం పూర్తి పాఠం కోసం ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి లేదా www.ntnews.comను సందర్శించండి
-శంకర్ చలమల , 99661 07880