బీజేపీయేతర ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల పట్ల కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి పరాకాష్ఠకు చేరుతున్నది. యూనియన్ గవర్నమెంట్ ఆలోచనా ధోరణులకు భిన్నంగా స్వతంత్ర దృక్పథంతో ఎదుగుతున్న రాష్ర్టాల పట్ల, సొంత ఆలోచనలతో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ వంటి రాష్ర్టాల విషయంలో అలవికాని, కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు తేటతెల్లమవుతున్నది. నిధుల విషయంలో కేంద్రం ఇబ్బందులు సృష్టిస్తూ తమ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా గత నాలుగేండ్ల నుంచి వారికి ఉచితంగా 24 గంటల విద్యుత్తును అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. ఉమ్మడి ఏపీలో నమోదైన డిమాండ్ కంటే ఎక్కువగా జూన్ 29న 14,200 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. అంతేకాకుండా రాష్ట్ర దినసరి వినియోగం కూడా 280 మిలియన్ యూనిట్లుగా నమోదవుతున్నది. జూలై 29, 30, 31 తేదీలలో వరుసగా 12,000 మెగావాట్లకు పైగా రికార్డు వినియోగం నమోదైంది.
రాబోయే రోజుల్లో తలెత్తనున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద 800 మెగావాట్ల చొప్పున ఐదు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణం చేపట్టారు. వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ఆల్ట్రా మెగా పవర్ప్లాంటు నిర్మాణ పనుల నిమిత్తం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి సుమారు రూ.40 వేల కోట్ల రుణం కూడా మంజూరైంది. అందుకవసరమైన రెగ్యులేటరీ కమిషన్ , పర్యావరణ, అటవీ అనుమతుల అనంతరమే రుణం మంజూరై పనులు ప్రారంభించబడ్డాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు పనుల కోసం ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ముందుకు వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కు పనులు కట్టబెట్టారు. ఎలాంటి అవినీతికి తావివ్వరాదనే ఉద్దేశం ఒకటి కాగా, ఆరిపోతున్న ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కు, ఆ సంస్థ చరిత్రలోనే దక్కిన అతిపెద్ద కాంట్రాక్టుగా ఈ ప్రాజెక్టును పేర్కొనవచ్చు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును అప్పగించడం కేంద్రానికి నచ్చకపోయి ఉండవచ్చు.
అందుకేనేమో, ఈ ఏడాది మార్చి నుంచి కేంద్రం వేధింపులు మొదలయ్యాయి. పకడ్బందీ సెక్యూరిటీ మెకానిజంతో ఎస్క్రో అకౌంట్ ద్వారానే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం మంజూరు చేయగా, రాష్ట్ర జెన్కో నెలనెలా చెల్లించాల్సిన వడ్డీలు, ప్రీమియం కచ్చితంగా చెల్లిస్తున్నది. కానీ, ఇటీవల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మున్ముందు విడుదల చేయాల్సిన రుణ వాయిదాలను ఆపివేసి కేంద్రంతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలనే నిబంధనను ముందుకు తీసుకువచ్చింది.
రుణ మంజూరుకు ముందున్న నిబంధనలకు ఇది పూర్తి వ్యతిరేకం.అన్ని యూనిట్ల ప్రాజెక్టు పనులు మొదలై శరవేగంగా కొనసాగుతుండగా మొదటి రెండు యూనిట్లు డిసెంబర్ 2023కు ప్రారంభం కానుండగా, మిగతా మూడు యూనిట్లు 2024 చివరి నాటికి పూర్తికానున్నాయి.ఈ నేపథ్యంలో రుణ వాయిదాల విడుదలను నిలిపివేయడం కేంద్ర ప్రభుత్వ వేధింపు చర్య కాకుండా మరేమవుతుంది?
రుణాలను సమయానుకూలంగా విడుదల చేయని పక్షంలో ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోవడమే కాకుండా నిర్దేశిత సమయానికి పనులు పూర్తికావు. ప్రాజెక్టును నిర్మిస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ సకాలంలో చెల్లింపులు లభించక ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఐటీరంగంలో అనూహ్యంగా ప్రగతిని సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ బకాయిలు సుమారు 8 వేల కోట్లు. అదేవిధంగా ట్రాన్స్కోకు విడుదల చేయాల్సిన రూ.2 వేల కోట్ల రుణాలను తక్షణమే విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
గత ఐదేండ్లలో బ్యాంకులు రూ.9,91,640 కోట్ల రుణాలను కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు మాఫీ చేశాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. 2020-21లో 2,02,781 కోట్ల రుణాలు, 2021-22లో రూ.1,57,096 కోట్ల రుణాలు మాఫీ చేశామని, 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 మధ్యకాలంలో మొత్తం రూ.9,71,640 కోట్ల రుణా లు మాఫీ చేసినట్లుగా ఆయన తెలిపారు. మరి అలాంటప్పుడు దేశ జీడీపీలో ప్రధానపాత్ర పోషిస్తున్న ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలు బకాయిపడ్డ రెండు లక్షల కోట్ల రుణాలు మాఫీ లేదా సర్దుబాటు చేసి ఆదుకోవడానికి కేంద్రానికి ఉన్న అభ్యంతరాలేమిటో వారికే తెలియాలి. దేశంలోనే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ, కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్న తెలంగాణ విద్యుత్ సంస్థల బకాయిలు 17 వేల కోట్లు మాత్రమే. రుణాల చెల్లింపులు, ఆర్థిక క్రమశిక్షణలో ఉన్న మన సంస్థలకు మంచి ట్రాక్ రికార్డు ఉన్నదన్న విషయం కేంద్రానికి మరోసారి గుర్తుచేస్తున్నా.
-తుల్జారాంసింగ్ ఠాకూర్ , 78930 05313