ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టింది మొదలు ప్రతిపక్షాలు ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయి ఫలితాలు అనుభవంలోకి వస్తున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. ఓ పక్క పొరుగు రాష్ర్టాలు అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాడుతూ,తమ డిమాండ్లను నెరవేర్చుకుంటున్నాయి. దీనికి ఇటీవల ‘జాతీయ హోదా’ పొందిన అప్పర్భద్ర, కెన్ బెత్వా ప్రాజెక్టులే నిదర్శనం. కానీ, మన రాష్ట్రంలోని విపక్షాలు ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తుండటం గర్హనీయం. ప్రాజెక్టుల నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమకోర్చిన ఇంజినీరింగ్ నిపుణులపైనా ఇప్పుడు మాటల దాడికి దిగడం విపక్ష నేతల కురుచబుద్ధికి నిదర్శనం. ఇది అత్యంత ఖండనీయం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద మండలం చిట్యాల. ఓ పక్క మానేరు. మరోపక్క రాఘవరెడ్డిపేట పెద్దవాగు, ఇంకో పక్క చలివాగు. అయినా వాన కోసం మొగులు మొఖాన చూడాల్సిన పరిస్థితే. ఫలితంగా ఈ మండలం నుంచి ఎంతోమంది ప్రజలు వలసబాట పట్టారు. సాగునీరు ఇవ్వాలని ఏండ్లుగా మొర పెట్టుకున్నా చిట్యాలతోపాటు, రేగొండ, చల్లగరిగ తదితర ప్రాంతాలకు నీరందలేదు. ఉద్యమనేత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేసిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగమేఘాల మీద కాలువలకు నీళ్లు వదులుతున్నామంటూ రేగొండ మండల కేంద్రం వద్ద ట్రయల్ రన్ను నిర్వహించిండు తప్ప మళ్లీ కొన్నేండ్ల పాటు ఆ కాలువల్లో నీళ్లు పారిన దాఖలాల్లేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి శిలాఫలకం శిథిలమైంది. కాలువలు ఎక్కడిక్కడ పూడుకుపోయినయ్. తెలంగాణ సర్కార్ చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంతో కానీ ఆ కాలువలకు మోక్షం లభించలేదు.
గత రెండేండ్లుగా డీబీఎం 38 కెనాల్ ద్వారా చిట్యాల మండలంతో పాటు మిగతా రేగొండ, చల్లగరిగ, టేకుమట్ల మండలాలకు సాగునీరు అందుతున్నది. బీడుగా మారిన వేల ఎకరాల భూములు తిరిగి సాగులోకి వస్తున్నయి. ఇది నాతరం కళ్లముందున్న వాస్తవం. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు నిష్ప్రయోజనమంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎంత అసత్యమో వివరించడానికే. చిట్యాల ఒక్కటే కాదు నాడు కరువుతో, కల్లోలిత ప్రాంతాలుగా ముద్రపడి నేడు ప్రగతి సాధిస్తున్న పల్లెలెన్నో. అయినా ఈ సత్యాలను ప్రతిపక్షాలు అంగీకరించయి. కండ్ల ముందున్న సాక్షాలను సైతం ఒప్పుకోరు. సరే అదీ వదిలేద్దాం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాకపోతే గతంలో మీరెందుకు నీరివ్వలేదు? ఏండ్లుగా రాని నీళ్లు ఇప్పుడు ఎక్కడినుంచి వస్తున్నయి? ఇత్యాది ప్రశ్నలకు జవాబులు ఇస్తారా అంటే ఇవ్వరు. అయినా పదే పదే అటు కాళేశ్వరం, ఇటు కేసీఆర్పై విమర్శలు. అసత్య ప్రచారాలు.
ఇటీవలే తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ఈఆర్సీపీ)కు జాతీయహోదా సాధించేందుకు అన్నిపక్షాలు కలిసిరావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. ఇక్కడ విశేషమేమంటే ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది, ప్రతిపాదించింది గతంలో అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్. ఇటు ఏపీలోనూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్సార్సీపీ, టీడీపీ ఆది నుంచీ ఒకే తాటిపైనే నిలిచాయి, నిలుస్తున్నాయి. ఇటీవలనే జాతీయహోదా ప్రకటించిన అప్పర్భద్ర ప్రాజెక్టు కోసం కూడా కర్ణాటకలో స్వపక్షం, విపక్షమంటూ తేడా లేకుండా పట్టుబట్టాయి. రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ఉమ్మడిగా కృషి చేస్తున్నారు. పైన ఉదహరించిన రాష్ర్టాలే కాదు దేశంలో మరే రాష్ట్రంలోనూ పార్టీలు ఇతరత్రా విషయాల్లో రాజకీయాలు చేసినా తాగు, సాగునీరు ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడిగా కలిసి అడుగులు వేస్తున్నాయి. కానీ ఒక్క తెలంగాణలోనే అందుకు భిన్న పరిస్థితులున్నాయి.
ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్ను తప్పన్నారు. కరెంటు బిల్లుల మోత తప్పదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఆ తర్వాత మల్లన్నసాగర్ నిర్వాసితులను ఎగదోసి కేసులు వేసి పనులను అడ్డుకునే కుట్రలు పన్నారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన ఈ మూడేండ్ల కాలపరీక్షలో ప్రతిపక్షాల ఆరోపణలన్నీ కొట్టుకుపోయాయి. కేసీఆర్ విజన్ ఎంతటి మహోన్నతమైనదనే విషయం ప్రత్యక్ష అనుభవంలోకి వస్తున్నది. పండిన పంటలు, భూగర్భ జలాల ఊటలే అందుకు తార్కాణం. ఊహించనిరీతిలో, వందేండ్లకోసారి వచ్చే వరద వచ్చిందని సీడబ్ల్యూసీ చెప్తున్నా, దాని ఫలితంగానే పంప్హౌజ్లు మునిగాయని, వాటిల్లిన నష్టమూ స్వల్పమేనని ఇంజినీర్లు స్పష్టంగా ప్రకటిస్తున్నా వరద పేరుతో, మునక సాకుతో మరోసారి విపక్షాలు రాజకీయాలు మొదలుపెట్టాయి. కాళేశ్వరంపై తమ అక్కసును వెళ్లగక్కుతున్నాయి.
దీనంతటి వెనుక ఉన్న ప్రతిపక్షాల కుట్రలేమంటే.. ఈ ఎనిమిదేండ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పటికీ ఒక్క భారీ సాగునీటి ప్రాజెక్టును చేపట్టిందీ లేదు, పూర్తిచేసిందీ లేదు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాళేశ్వరంపై బీజేపీ దాడికి పూనుకొంటుండగా, 60 ఏండ్ల తన పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఎక్కుపెడుతున్నది.
ప్రతిపక్షాలకు చివరగా ఒక విషయం గుర్తుచేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఆ ఫలాలను అందుకుంటున్న రైతులకు తెలుసు. తరతరాలుగా బీటలువారి ఇప్పుడు దూప తీర్చుకుంటున్న బీడు భూములకూ తెలుసు. తడారిపోయి ఇప్పుడు తడలు గొడుతున్న తటాకాలకూ తెలుసు. పచ్చదనాన్ని నింపుకొంటున్న పల్లెకూ తెలుసు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కాళేశ్వరం తెలంగాణ ప్రగతి రథం. ఇదే సత్యం.
-మ్యాకం రవికుమార్ 91827 77621