పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై వారం కూడా కాకముందే విపక్ష ఎంపీల గొంతు నొక్కే పనిని అధికారపక్షం ప్రారంభించింది. సోమవారం నలుగురు లోక్సభ సభ్యులను సమావేశాలు ముగిసే ఆగస్టు 12 వరకూ బహిష్కరించగా.. మరుసటి రోజే 19 మంది రాజ్యసభ సభ్యులను వారం పాటు సస్పెండ్ చేశారు. వీరు చేసిన తప్పు ఏమిటంటే.. ‘గ్యాస్ సిలిండర్ ధరను వెయ్యి దాటించడమేమిటి? పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపైనా జీఎస్టీ విధించటమేమిటి?’ అని ప్రశ్నించటమే. చర్చ కోసం డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించటం మరో నేరమట. దీనికే వీరికి ఈ బహిష్కరణ శిక్షలు. తమ సస్పెన్షన్పై పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం వద్ద విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ఆ నేరాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని కొత్త శిక్షలు ఏమైనా విధిస్తారేమో తెలియదు. ఏమైనా జరుగొచ్చు. దేశంలో నడుస్తున్నది మోదీ రాజ్ కదా!
వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అన్పార్లమెంటరీ పదాల పేరుతో ఓ జాబితాను లోక్సభ సెక్రటేరియట్ విడుదల చేసింది. ‘అవినీతి, అసమర్థత, వేధింపులు’ వంటి పదాలనూ ఉచ్చరించటానికి వీల్లేదని చెప్పారు. ఉభయసభల్లో ఎంపీలు ఇక మీదట.. ‘నరేంద్రమోదీ జిందాబాద్’ అని తప్ప మరో మాట మాట్లాడలేని స్థితిని కల్పించారు. అధికారపక్షం ఈ విధంగా యుక్తాయుక్త విచక్షణ కోల్పోయినా, విపక్షాలు కోల్పోలేదు. కాబట్టే బీజేపీ సర్కార్ అసమర్థ, అప్రజాస్వామిక విధానాల్ని నిలదీశారు. ఈ దేశ ప్రజానీకం తమ మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చారు. పార్లమెంటరీ విలువలు, ప్రజాస్వామిక సంప్రదాయాల పట్ల కనీస అవగాహన, గౌరవం ఉన్నా కూడా అధికారపక్షం తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకునేది. కానీ, అలా జరగలేదు. నాలుగైదు గంటల చర్చకు అనుమతిస్తే సరిపోయేదానికి, నాలుగైదు రోజుల సభా సమయాన్ని వృథా చేసిన ఘనత ఈ సర్కారు సొంతం. చర్చంటూ జరిగితే కేంద్రప్రభుత్వ వైఫల్యం బట్టబయలు అవుతుందన్నది అసలు భయం.
మోదీ ప్రధాని అయిన ఈ ఎనిమిదేండ్లలో పార్లమెంటు పనితీరు క్రమంగా క్షీణిస్తున్నది. చర్చకు అవకాశం ఇవ్వకుండా బిల్లులను తమకున్న మెజారిటీతో నెగ్గించుకోవటం, పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు బిల్లులను పంపించి వాటిపై సమీక్ష నిర్వహించే సంప్రదాయాన్ని దాదాపుగా పక్కనపెట్టటం, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకురావటం, ఎంపీలపై ఎడాపెడా సస్పెన్షన్ విధించటం- ఇవన్నీ పెరిగిపోయాయి. భిన్నాభిప్రాయాన్ని సహించలేని బీజేపీ తాత్వికతకు అనుగుణంగానే ఇది జరుగుతున్నది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని పైకి చెప్పినప్పటికీ.. ఈ పార్టీ విపక్ష ముక్త్ భారత్ ఎజెండాను అమలు చేస్తున్నది. రాజ్యసభ నుంచి సస్పెండైన ఎంపీలను గమనిస్తే కూడా ఇది తెలుస్తుంది. వారందరూ టీఆర్ఎస్, డీఎంకే, సీపీఎం, తృణమూల్ పార్టీలకు చెందినవారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, బెంగాల్లలో అధికారంలో ఉన్న పార్టీలే లక్ష్యంగా బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో ఇదొక భాగం. బీజేపీ ముక్త్ భారత్ కోసం యావద్దేశం ఒకటైతే తప్ప దేశాన్ని రక్షించుకోలేం.