కొత్త ఉత్సాహం.. కొంగొత్త ఉత్తేజం. ఈ ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన ఘన విజయాలను చూస్తుంటే ఒళ్లు పులకరిస్తున్నది. ఆర్థికవృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతి… ఇలా అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. స్వల్పకాలంలో తెలంగాణ ఈ అనితర సాధ్యమైన పురోగతిని సాధించడంలో మంత్రి కేటీఆర్ నాయకత్వ పటిమ అత్యంత ముఖ్యమైనది.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. అంతకుమించి తెలంగాణ ఆత్మ పూనాలి. మన గడ్డను మనం బాగు చేసుకోవాలనే తపన ఉండాలి. భవిష్యత్తును ఊహించగల దార్శనికత కావాలి. ఇక్కడి ప్రజల అవసరాలను అర్థం చేసుకోగలిగే మనసుండాలి. అంతకుమించి తెలంగాణను అమితంగా ప్రేమించగలగాలి. మొత్తంగా తన ఉనికే తెలంగాణకు ఒక పర్యాయపదం కావాలి. ఆ పర్యాయపదమే కేటీఆర్. తెలంగాణ యువతకు భరోసానిస్తూ.. దేశం కాదు, యావత్ ప్రపంచమే గర్వించేలా ఎదిగారు యువ నాయకుడు కేటీఆర్. నిత్య కృషీవలుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు.
ఉద్యమ యోధుడి నుంచి రాష్ట్ర మంత్రి వరకూ.. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా ఒక్కో దశలో, ఒక్కో స్థాయిలో తానేంటో నిరూపించుకుంటున్నారు కేటీఆర్. తరాలుగా పడుతున్న తెలంగాణ ప్రజల గోస తీర్చాలంటే.. అకుంఠిత దీక్షతో పనిచేయాల్సి ఉంటుందని అర్థం చేసుకున్నారు. అందుకే అనేక రంగాల పురోభివృద్ధికి కార్యదీక్షతో ముందుకు కదిలారు. ‘లీడర్.. ప్రజల ఆశలకు ప్రతినిధి’ అన్న నినాదాన్ని నిజం చేస్తూ అడుగులు వేస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయడం కాదు, మన దేశాన్ని చూసి ఇతర దేశాలు ఆశ్చర్యపోవాలన్నదే కేటీఆర్ తపన. ఆయన నిరంతర కృషి, పట్టుదలకు నిదర్శనం ఈ ఎనిమిదేండ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపవ్వడమే. ఐటీ రంగంతో తెలంగాణ యువతకు, స్థానికులకు ఉపాధి లభిస్తుందనే ముందుచూపుతోనే పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ సమాఖ్యలతో అనేక సమావేశాలు నిర్వహించారు. ఐటీరంగ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనుకూలతలను వివరించారు. కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు చేసేలా, అప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు మరిం త విస్తరించేలా ప్రోత్సహించారు. దేశ విదేశాల్లో పర్యటించారు. సాంకేతికరంగంలో పెట్టుబడుల కోసం పోటీ కేవలం మన దేశంలోని రాష్ర్టాల మధ్యనే ఉండదని, తెలంగాణ ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలతో, మహా నగరాలతో పోటీ పడవలసి ఉంటుందన్న కేటీఆర్ నిర్దిష్టమైన అవగాహనే ఐటీ శాఖ గమనానికి దిక్సూచి. ఈ దృక్పథం, ఆచరణ వల్ల అనేక ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థలు గతేడాది తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి.
ఆయన పనితీరు వల్లే ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐ.బీ.ఎం., ఒరాకిల్ వంటి అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాలను నడుపుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్., టెక్ మహేంద్రా వంటి కంపెనీలెన్నో ఇక్కడికి వచ్చాయి. యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, సేల్స్ఫోర్స్ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటుచేశాయి. ఐటీ పురోభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగదని కేటీఆర్ ముందుగానే పసిగట్టారు. కాబట్టే తెలంగాణలోని మిగతా నగరాలకు, పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే పలు జిల్లా కేంద్రాలకు ఐటీరంగం విస్తరించింది. అస్తిత్వం కోసం అరవై ఏండ్లు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలిచింది. తెలంగాణలో ఐటీ, పారిశ్రామికరంగం అభివృద్ధి చెందిన వైనాన్ని బిజినెస్ స్కూళ్లలో పాఠాలుగా చెప్తున్నారంటే దీనివెనుక కేటీఆర్ అవిరళ కృషి ఉన్నది. ‘గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్’ అయితే.. తెలంగాణ పురోభివృద్ధి బాధ్యతను తన భుజానికెత్తుకున్న కేటీఆర్ ‘ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ’.
20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారత ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంత స్పష్టత, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేనెప్పుడూ చూడలేదు.
– అశా జడేజా మోత్వాని ఎంట్రప్రెన్యూర్, వెంచర్ క్యాపిటలిస్ట్, సిలికాన్వ్యాలీ, అమెరికా
(వ్యాసకర్త: -గోసుల శ్రీనివాస్ యాదవ్ , 98498 16817, గొల్ల, కురుమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు)