‘స్మార్ట్గా ఉన్నాడు.. తుపాకీ తూటాలకు, ఖాకీ బూట్ల చప్పుళ్లకు భయపడి పారిపోతాడు. గీయనేం ఉద్యమం చేస్తాడన్నారు…’ కానీ ఆ తూటాలకే గుండెల్ని చూపించి, తనపై.. తెలంగాణ ఉద్యమకారులపై ఖాకీల లాటీలు పడితే కన్నెర్ర చేశాడు. జైలుపాలైన ఉద్యమకారులకు బెయిల్ ఇప్పించి విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు.
‘ఫారన్లో ఉద్యోగం చేస్తూ పాష్గా ఉన్నాడు. పెద్దలను, గురువులను, ఉద్యమ నాయకులను గౌరవిస్తాడా అన్నారు. తెలంగాణ ఉద్యమ గురువు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్నుమూసినప్పుడు వరంగల్ ఏకశిల కమిటీ హాల్లో సార్ పార్థివదేహం పక్కనే కూర్చున్నాడు. సార్ చితి ఆరేంతవరకు అక్కడే ఉన్నాడు. ఆ విధంగా తెలంగాణే శ్వాసగా జీవించి జీవితాన్ని అర్పించిన జయశంకర్ సార్కు తనదైన నివాళి అర్పించారు కేటీఆర్.
అమెరికా నుంచి వచ్చాడు. అర్థం కాని తెలుగు మాట్లాడుతాడనుకున్నారంతా. వాళ్లకు తర్వాత తెలిసింది అతడు మాట్లాడటం మొదలుపెడితే నత్తిలేని, సుత్తిలేని అచ్చమైన తెలంగాణ యాసలో పొల్లుపోని మాటల్ని తూటాల్లా పేలుస్తాడని. ఆ మాటలు తెలంగాణ విరోధుల గుండెల్లో గునపాలవుతాయని. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పటి నుంచే చేనేత కార్మికుల ఆకలి ఆర్తనాదాలను ప్రత్యక్షంగా చూశారు. చేతనైనంత సేవ చేసి వారి ఆకలిచావులను ఆపాలని కంకణం కట్టుకున్నారు. అందుకే సిరిసిల్ల ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంతం నుంచి 2009లో ఎమ్మెల్యే అయి సిరి లేని ప్రాంతాన్ని సిరిమంతుల పట్టణంగా చేసి చూపించారు. తనను ఎన్నుకున్న ప్రజల కన్నీళ్లను, ఉపాధి లేమితో బాధపడుతున్న పరిస్థితిని చూసి చలించిపోయిన కేటీఆర్ రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చే బతుకమ్మ చీరలను ఉపాధిలో భాగంగా నేయించి ఆ చీరతో నేతన్నల కన్నీళ్లను తుడిచారు. వారి ఆరోగ్య, ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఎములాడ రాజన్న గుడి, అక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాలను పెంచడంతో పాటు ఆలయ విశిష్టతను కాపాడటం కోసం నిధులను కేటాయించారు. భక్తుల ఆదరాభిమానం, ప్రజ ల దీవెనలు పెరిగాయి. ఈ విధంగా కేటీఆర్ చొరవ, సేవాతత్పరతతో ఆ ప్రాంతం ప్రగతిపథంలో దూసుకపోయింది. 2018లో అక్కడ ఆయన మెజారిటీ అనేక రెట్లు పెరిగింది.
కేటీఆర్ ఐటీ శాఖామాత్యులుగా నియమితులైన తర్వాత ఆ శాఖకే వన్నె వచ్చింది. ఈ ఎనిమిదేండ్లలో ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన టీఎస్ఐపాస్ ద్వారా ఐటీ, అనుబంధ రంగాలు కూడా వేగంగా అభివృద్ధి చెందాయి. ఆ రంగంలో రోజుకు దాదాపు సగటున 480 మందికి ఐటీ, ఐటీ ఆధారిత రంగాలలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఆయా కంపెనీలు తమను ఉద్యోగులుగా నియమించడంతో తెలంగాణ యువత ఆనందంలో మునిగి తేలుతున్నది. 2014 కంటే ముందు దేశంలో ఐటీ రంగ వృద్ధిలో బెంగళూరు తర్వాత చెన్నై, పుణె నగరాలు ముందంజలో ఉండేవి. వాటిని హైదరాబాద్ వెనక్కి నెట్టింది. నాస్కామ్ లెక్కల ప్రకారం 2022 నాటికి రూ.1,83,569 కోట్లతో సిలికాన్ నగరం బెంగుళూరు తర్వాత హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉన్నది. దీనికి కారణం హైదరాబాద్కు 1500 ఐటీ ఆధారిత కంపెనీలు రావడం. 2016తో పోల్చుకుంటే 2022 నాటికి హైదరాబాద్లో స్టార్టప్ల సంఖ్య ఐదింతలు పెరిగింది. ఇలా తెలంగాణ ఆర్థికాభివృద్ధి జోడు గుర్రాల వలె పరుగులు పెట్టడంలో మంత్రి కేటీఆర్ పాత్ర కీలకమైనది.
ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ టీవీ 18 ‘ఇన్స్పిరేషనల్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో పాటు అనేక అవార్డులు కేటీఆర్కు లభించటం ఆయన శక్తిసామర్థ్యాలకు, మేధస్సుకు నిదర్శనం.
ఇంగ్లీష్ భాషలో తనకున్న ప్రావీణ్యంతో దావోస్లో జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ అంతర్జాతీయ
సదస్సులో అనేక దేశాల రాజ్యాధినేతలను కూడా మెప్పించి, ఒప్పించారు కేటీఆర్. తన ప్రసంగంతో అందరి మన్ననలను పొంది, అంతర్జాతీయ వ్యాపారస్థులను సైతం మంత్రముగ్ధులను చేశారు.
రాష్ర్టానికి పెట్టుబడులు రావడంలో, మన ఖ్యాతి ప్రపంచానికి చాటడంలో కేటీఆర్ కృషి ఎనలేనిది.. ఒక యువ నాయకుడు యువ మేధావిగా మారితే, అతడు ఒక రాజకీయ నాయకుడైతే ప్రజలకు ఏ విధమైన లాభం జరుగుతుందో కేటీఆర్ చేసి చూపించారు. ‘నేను రాజకీయ కుటుంబం నుంచి రావచ్చు, కానీ నేను అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మాత్రమే వారసున్ని’ అని చెబుతున్న కేటీఆర్ నేటి యువతకు ఆదర్శం.
-డాక్టర్ బైరి నిరంజన్ , 93901 15644