కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టడం వెనుక గల ఉద్దేశం ఇప్పుడు పూర్తిగా ప్రజల అనుభవంలోకి వస్తున్నది. బియ్యం, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగు, రొట్టె పిండి వంటి సామాన్యులు ప్రతిరోజూ వాడే ఆహార పదార్థాలపై కూడా పన్ను భారం పడుతున్నది. కొన్నింటిపై జీఎస్టీ పెంచడం వల్ల ఆయా వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. చెంచాలు, గంటెలను కూడా వదలకుండా పన్నులు వడ్డించడం మోదీ ప్రభుత్వ స్వభావాన్ని వెల్లడిచేస్తున్నది. జీఎస్టీ ప్రవేశపెట్టి ఐదేండ్లవుతున్నది. ఈ ఐదేండ్లలో కార్పొరేట్ సంస్థల పన్నులు తగ్గాయి. ప్రజలపై మాత్రం పన్నుల భారం పెరిగింది. ఇప్పటి వరకు జీఎస్టీ పరిధిలో లేని వాటికీ క్రమంగా ఈ పన్నును వర్తింపచేయడం, తక్కువ పన్ను ఉన్న వస్తువులను మరింత ఎక్కువ భారం పడే తరగతిలోకి మార్చడం ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుందనీ, ఈ క్రమంలో ప్రజలపై భారం పెరుగుతూనే ఉంటుందని మోదీ ప్రభుత్వ పోకడను చూస్తే అర్థమవుతుంది.
జీఎస్టీ ద్వారా కేంద్రం చేపట్టిన మరో తిరోగమన చర్య.. రాష్ర్టాల హక్కులను హరించడం. జీఎస్టీ మండలి వ్యవస్థనే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది. దీనివల్ల రాష్ర్టాలు ఆదాయం కోసం కేంద్రం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడినందున సమాఖ్య స్వభావం కూడా దెబ్బతింటున్నది. పైకి ఒకే దేశం, ఒకే పన్ను అంటూ చెబుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం చేతిలో ప్రజల, రాష్ర్టాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అస్త్రంగా జీఎస్టీ మారిపోయింది. జీఎస్టీ వల్ల తగ్గే ఆదాయాన్ని భర్తీ చేస్తామని మొదట్లో రాష్ర్టాలకు హామీ ఇచ్చిన కేంద్రం ఆ తరువాత మొండి చేయి చూపించింది. కరోనా కారణంగా సంభవించిన నష్టాన్ని భర్తీచేయాల్సింది పోయి, ఆ మహమ్మారిని దైవకార్యంగా పేర్కొంటూ తప్పించుకుంది. ఈ విధంగా కేంద్రం మాయమాటలతో రాష్ర్టాలకు జరిగిన మోసానికి జీఎస్టీ ఒక సంకేతంగా మారింది. పన్నుల వ్యవస్థను, మొత్తంగా ఆర్థిక నిర్ణయాధికారాలను గుప్పెట పెట్టుకొని కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ విధానం దీర్ఘకాలికంగా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది.
ఆర్థిక నిపుణులతో, రాజకీయ పక్షాలతో, రాష్ర్టాలతో చర్చించి కేం ద్రం నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామిక విధానం. కానీ, మోదీ ఏకపక్ష ధోరణి వల్ల తప్పుడు నిర్ణయాలు జరిగి దేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమవుతున్నది. పేదల జీవనం దుర్భరంగా మారుతున్నది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడి, నిత్యావసర ధరలు పెరిగి, పట్టణ, గ్రామీణ ప్రజల బతుకు భారంగా మారింది. మున్నెన్నడూ లేనివిధంగా ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకున్నది. దేశ స్థూలజాతీయోత్పత్తి దారుణంగా పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు, పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్యం మొదలు ఏ సూచీ చూసినా ప్రపంచంలో కడగొట్టు దేశంగా భారత్ మిగిలింది. ప్రధాని మోదీ ఇప్పటికైనా కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని వర్గాలతో చర్చిస్తే ప్రజాస్వామికంగా ఉంటుంది. ప్రజలకు శ్రేయోదాయకంగా మారుతుంది.