దాదాపు 200 ఏండ్ల వలస పాలన నుంచి 1947లో విముక్తమైన భారతదేశం.. తన ప్రజల అవసరాల మేరకు, ప్రగతి కోసం.. ప్రణాళికా బద్ధంగా వ్యవస్థల నిర్మాణం చేసుకోవాల్సి ఉండింది (తెలంగాణలో ఇదే జరిగింది). మన దగ్గరున్న వనరులను సమర్థంగా వినియోగించుకోవటానికి అవసరమైన కార్యాచరణ చేపట్టాల్సి ఉండింది. దురదృష్టవశాత్తూ ఆ దిశగా అడుగులు పడలేదు.
ప్రణాళికాబద్ధమైన ఆచరణ లోపించింది. పొరుగుదేశాలు కయ్యానికి కలబడ్డాయి.. పరిపాలన నిర్మాణాత్మకంగా సాగలేదు. నెహ్రూ పంచశీల దారుణంగా విఫలమైంది. చైనా, పాకిస్థాన్లతో వాస్తవాధీన రేఖలు ఏర్పడి శాశ్వత సమస్యలకు కారణమయ్యాయి. ఫలితంగా ఆసియాలో అతిపెద్ద సైనిక మోహరింపు ఉన్న ప్రాంతంగా కశ్మీర్ నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో రక్షణ కోసం ఇన్నేండ్లుగా పెట్టిన ఖర్చులో సగం సద్వినియోగమైనా జలవివాదాలు పరిష్కారమయ్యేవి. అన్ని మూలల్లోనూ విద్యుత్తు కాంతులు విరజిమ్మేవి. వ్యవసాయం సుసంపన్నమయ్యేది. వలస పాలన అనంతరం బ్రిటిష్ వాడి పాలక వ్యవస్థను యథాతథంగా కొనసాగించుకొన్నామే తప్ప స్వయంగా మన ప్రజలకు అనుకూలమైన వ్యవస్థలను నిర్మించుకోలేకపోయాం.
పటిష్ఠ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రణాళికాసంఘాన్ని ఏర్పాటుచేశారు. 70 ఏండ్ల పాటు పన్నెండు పంచవర్ష ప్రణాళికలు రచించారు. ఆ లక్ష్యాలను సాధించలేకపోయారు. ఆర్థికం కునారిల్లింది. అప్పులు చేస్తూ పోవడమే తప్ప వాటిని పెట్టుబడికి మూలధనంగా మార్చి సంపదను సృష్టించడంపై దృష్టి సారించలేకపోయారు. సహజ వనరులు, మానవ నైపుణ్యం ఉండీ మనం ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయాం. ఏడున్నర దశాబ్దాల తరువాతా మనది అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. ఏ రంగమూ నూటికి నూరుపాళ్లు సఫలమైంది లేదు. పంచవర్ష ప్రణాళికలు ఏం చేశాయో తెలియదు. ఉన్న పీఎస్యూలనూ ఇప్పటి మోదీ ప్రభుత్వం తెగనమ్మే పరిస్థితి. ఇందిర హయాంలో గరీబీ హఠావో నినాదం వచ్చింది. 20 సూత్రాల పథకం వచ్చింది. ఇవన్నీ రాజకీయ ప్రయోజనాలకు తప్ప ఎందుకూ కొరగాకుండా పోయాయి. రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలోనే నేతలు తలమునకలై పోయారు.
1975లో ఎమర్జెన్సీ పెట్టినప్పటి నుంచి దేశంలో పరిపాలన స్వరూపం మారిపోయింది. అధికారాన్ని నిలబెట్టుకోవడం పరమార్థంగా కొనసాగుతూ వచ్చింది. నీరు, విద్యుత్తు, వైద్యం, విద్య, వ్యవసాయం, పర్యాటకం మీద దృష్టి లేదు. మౌలిక వనరులు, ఉత్పాదక రంగాలను పట్టించుకొన్న పాపాన పోలేదు. ఒక రకంగా 1977 నుంచే సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైంది. ప్రభుత్వాలు దినదినగండం లాగా గడిపాయి. పాలనపై ఫోకస్ చేసే అవకాశాలు లేకుండా పోయాయి. చూస్తుండగానే 75 ఏండ్లు గడిచిపోయాయి.
దక్షిణాది దక్షత: 1991 నుంచి 1996 మధ్య మినహా దేశాన్ని పాలించిన నాయకులంతా ఉత్తర భారతానికి చెందినవారే. మధ్యలో ఏడాదిపాటు కర్ణాటక నుంచి దేవెగౌడ ఉన్నప్పటికీ చేసిందేమీ లేదు. 1991లో మొట్టమొదటిసారి దక్షిణాది నుంచి పీవీ నరసింహరావు పూర్తికాల పరిమితిలో ప్రధాని పదవిని నిర్వహించాడు. అదీ మైనారిటీ ప్రభుత్వం. తెలంగాణ నుంచి ఢిల్లీ పీఠం ఎక్కిన నేత. ఆయన అధికారంలోకి వచ్చేనాటికి దేశం భ్రష్టుపట్టిపోయింది. దారుణంగా ఉన్న పరిస్థితిలో పదవిలోకి వచ్చిన పీవీ.. ప్రధానంగా చేపట్టింది ఆర్థిక సంస్కరణలు. గ్లోబల్ ఎకానమీలో భారత్ను భాగస్వామిని చేశారు. లైసెన్స్రాజ్కు చరమగీతం పలికారు. పీవీ స్థానంలో ఎవరు ప్రధాని అయినా.. దేశాన్ని అమ్మేసి వెళ్లిపోయేవారు.
ఒకే ఒక్కడు కేసీఆర్: ఈ నేపథ్యంలో దేశంలో గుణాత్మక మార్పు గురించి ఒకే ఒక్క నాయకుడు మాట్లాడుతున్నాడు. దేశంలో గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థల సమతుల్యత అవసరాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. నీరు.. విద్యుత్తు, వ్యవసాయం, ఆహార భద్రత, విద్య, వైద్యం, పరిశ్రమలు సమాంతరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాడు. అధికారంలోకి వచ్చిన వాళ్లు చేయాల్సిన కార్యాచరణను కాలికి బలపం కట్టుకొని తిరిగి అవగాహన కల్పిస్తున్నాడు. ఈ పని తాను ఊరకే చేయడం లేదు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి.. విద్యార్థి దశలోనే ఉద్యమాలను వీక్షించి తన జాతి విముక్తం కోసం 14 ఏండ్లు పల్లేర్ల మీద నడిచి.. తన ప్రజల పాదాల కింద మల్లెలు పరిచిన నాయకుడు.. తాను పాలకుడై.. చేతల్లో చేసి చూపించిన తరువాతే దేశం కోసం కదిలాడు. మేడిగడ్డ మీద నుంచి గోదారమ్మను వెనక్కు ఉరికించిన నేత మాట్లాడుతున్నాడు. దేశమంతా చీకట్లు అలుముకొన్న వేళ వెలుగుల తెలంగాణను ఆవిష్కరించిన నాయకుడు మాట్లాడుతున్నాడు.
రైతు వాకిళ్లలో సిరుల వాన కురిపించిన నేత మాట్లాడుతున్నాడు. ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని అందించిన నేత మాట్లాడుతున్నాడు. హరితహారంతో ప్రకృతికే ఆదెరువుగా మారిన నేత ఆయన.. కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. తెలంగాణ ముఖ్యమంత్రి. దేశంలో అన్ని అంశాలపైనా లోతైన మేధోమథనం చేసి ప్రత్యామ్నాయంపై సంపూర్ణమైన అవగాహనతో ముందుకు కదిలాడు. ఆయన దార్శనికత ఇవాళ దేశానికి కావాలి. ఆయన కార్యాచరణ ఇవాళ దేశంలో అమలుకావాలి. పట్టుబడితే.. జట్టుకడితే.. పిడికిలి బిగిస్తే.. ప్రగతికోసం పురోగమిస్తే.. ఇవాళ ఏ తెలంగాణ కనపడుతున్నదో.. అట్లా మొత్తం భారతదేశం కూడా తయారు కావాలంటే.. అందుకు ప్రత్యేకమైన ఎజెండాతో, దక్షత కలిగిన కేసీఆర్ నాయకత్వం వహించాలి.
కష్టమంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసు. కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే విజయాలను అందుకోవడం ఆయనకు తెలుసు! అపనమ్మకాల రొదల్లోనే అడుగు ముందుకేసి అడ్డంకులను అధిగమించి స్వప్నాన్ని సాకారం చేసుకోవడం ఆయనకు తెలుసు.
నిరంతర వసంతకాల అన్వేషి కేసీఆర్ ఇవాళ దేశం కోసం ముందుకు కదిలాడు ఉత్తర దక్షిణాల ఊసులన్నీ విడిచిపెట్టి..యావత్ దేశం దక్షత గల నాయకత్వం కోసం
ఆత్రంగా ఎదురుచూస్తున్నది.
మత‘మోఢ్యం’: ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న మోదీ సర్కారు పునాదులే మతంపై ఆధారపడి ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం, అంతర్జాతీయంగా దేశం పరువు, ప్రతిష్ఠలు.. ఇవేవీ ప్రస్తుత సర్కారుకు ప్రాధాన్యాంశాలుగా మిగలలేదు. కేవలం మతం పేరుమీదనే రాజకీయాలు నడుస్తున్నాయి. దేశమంతా అసహనం, తీవ్రమైన మతమౌఢ్యం పెచ్చరిల్లిపోయింది. అంతర్జాతీయంగా పరువుపోతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. అభివృద్ధి అనే అంశమే వినపడే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా కునారిల్లిపోయింది. అధిపతులు డెమోక్రాట్లనుంచి ఆటోక్రాట్లుగా మారిపోయారు. నియంతృత్వ పరిపాలన సాగుతున్నది. రాష్ర్టాలను శత్రువులుగా చూస్తున్నారు.
-కోవెల సంతోష్ కుమార్, 90521 16463