ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయడం దిగ్భ్రాంతికరం. జైన్పై బనాయించిన కేసు బూటకమైనదనీ, రాజకీయ కారణాలతో ఆయనను ఇరికించారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన జైన్ ఆరోపణలకు అతీతుడని కాదు. కానీ, రాజకీయ ప్రత్యర్థులను మోదీ ప్రభుత్వం వేధిస్తూ, వెంటాడుతున్న నేపథ్యంలో తాజా ఉదంతం ఆందోళన కలిగిస్తున్నది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్కు ఇంచార్జీగా జైన్ను ఆమ్ ఆద్మీ పార్టీ నియమించింది. ఇటీవలే పంజాబ్లో విజయ దుందుభి మోగించినందున, ఢిల్లీకి ఎంతో దూరంలో లేని హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ పార్టీ ప్రభావం ఉండవచ్చుననే అభిప్రాయం ఉన్నది. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభ కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలో జైన్ అరెస్టు వేధింపు చర్యగానే కనబడుతున్నది.
ఎన్నికలు సమీపించే రాష్ర్టాల్లో బీజేపీ ప్రత్యర్థి పార్టీల నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధించటం మోదీ హయాంలో పరిపాటిగా మారింది. బీజేపీకి పెద్దగా పట్టు లేని తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా డీఎంకే నాయకులు వేధింపులను ఎదుర్కొన్నారు. స్టాలిన్ కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై దర్యాప్తు సంస్థల దాడులు సాగడం కేంద్రప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి అద్దం పట్టింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులు మొదలుకొని సాధారణ ప్రజల వరకు భిన్నరంగాలవారు మోదీ ప్రభుత్వ వేధింపులకు గురవుతున్నారు. మరోవైపు, బీజేపీ నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బిల్లులు చెల్లించాలంటే 40 శాతం కమీషన్ ఇవ్వాలంటున్న మంత్రి ఒత్తిడి తట్టుకోలేక కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, సీబీఐని అధికార పక్షం పంజరంలోని చిలుకగా బీజేపీ అభివర్ణించింది. కానీ, మోదీ అధికారం చేపట్టిన తరువాత కూడా ఆ చిలుక ఇంకా పంజరంలోనే ఎందుకు ఉన్నట్టు?
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికార పక్షమే కాదు, ప్రతిపక్షాలు కూడా ఉంటాయి. పరస్పరం గౌరవించుకోవాలే తప్ప శత్రువులుగా పరిగణించుకోకూడదు. ప్రజల ఆకాంక్షలను ప్రతిపక్షాలు వ్యక్తం చేసినప్పుడు వాటిని ప్రభుత్వం గుర్తించగలగాలి. పార్లమెంటులో సంఖ్యాబలం ఉంది కదా అని చర్చ లేకుండానే వ్యవసాయ బిల్లులను ఆమోదింప చేసుకున్నది మోదీ ప్రభుత్వం. కానీ రైతుల ఆగ్రహం వల్ల ఆ చట్టాలను ఉపసంహరించుకోక తప్పలేదు. ప్రజాస్వామ్య పరిధిలోనే పరిష్కారాలు సాధించకపోతే
ఫలితాలు దారుణంగా ఉంటాయి. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించకపోతే ప్రజలే స్వయంగా రంగంలోకి దిగి చక్కదిద్దవలసి వస్తుంది.