ఆయన సువిశాల భారతావనికి, 140 కోట్ల ప్రజానీకానికి ప్రధానమంత్రి. ఆయన తల్చుకుంటే దేశంలో ఏ ప్రాంతాన్నైనా, ఏ రాష్ర్టాన్నైనా, మొత్తంగా యావత్ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించవచ్చు. అందుకు గల అధికారాలు రాజ్యాంగబద్ధంగా ఆయనకు ఉన్నాయి. కానీ, తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా.. మోదీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతానని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడే ప్రాజెక్టులను, సంస్థలను జారీ చేయకుండా మరోవైపు ఇలా మాట్లాడటం విడ్డూరం అని అంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కే. నాగేశ్వర్. యూట్యూబ్లో ఆయన తన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలోని వివరాలు..
‘తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ పోరాటం చేస్తుందని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పోరాటం ఎవరు చేస్తారు? ఎవరి చేతిలో అధికారం ఉండదో, ఎవరు ప్రభుత్వం చేత పనులు చేయించుకోవాలో వాళ్లు పోరాటం చేస్తారు. కానీ అధికారం అంతా మోదీ చేతిలో ఉన్నప్పుడు, తెలంగాణ అభివృద్ధికి అద్భుతంగా చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు, పోరాటం చేస్తా అని ప్రధానే అంటే, ఇగ మరి ఎవరిపైన ఆయన పోరాటం చేస్తారు? తెలంగాణ అభివృద్ధి కొరకు మోదీ ఎవరిపైన పోరాటం చేస్తారు? బైడెన్ మీదనా? పుతిన్ మీదనా? జిన్పింగ్ మీదనా? తెలంగాణ రాష్ట్రప్రభుత్వంపైన పోరాటానికి బండి సంజయ్ ఉన్నాడు, కాకపోతే ఇంకో పార్టీ నాయకులుంటారు. పోనీయండి మీరు తెలంగాణలో అభివృద్ధి కొరకు కేసీఆర్ ప్రభుత్వంపై ఎంతైనా పోరాడండి. కానీ అదే సమయంలో తెలంగాణ అభివృద్ధికి చేయగలిగిన అవకాశం మోదీ చేతుల్లో చాలా ఉంది. అది ఎందుకు చేయటం లేదు? నేను ఉదాహరణలు కొన్ని చెప్తాను. గతంలో కూడా చెప్పాను.
యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇచ్చింది. మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. మీరొక్క సంతకం పెట్టండి. హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తుంది. మీ కిషన్రెడ్డి నియోజకవర్గంలో లక్షలాది మందికి ఉపాధి దొరుకుతది. రెండు లక్షల కోట్ల పెట్టుబడులొస్తయి. హైదరాబాద్ బెంగళూరును కూడా తలదన్నే నగరంగా అభివృద్ధి చెందుతది.
మీరు సంతకం పెడితే హైదరాబాద్కు ఐఐఎం వస్తది, మీరు ఇటీవల గుజరాత్కు తీసుకువెళ్లిన ఆయుష్ సెంటర్ మా కిషన్రెడ్డి నియోజకవర్గంలో వస్తుందని మేమనుకున్నాం. ఆయన కూడా చెప్పారు వస్తోందని. లాస్ట్ మినిట్లో అది గుజరాత్కు వెళ్లిపోయింది. మీరు కావాలనుకుంటే ఆయుష్ను మళ్లీ హైదరాబాద్కు పంపియ్యవచ్చు. మా బండి సంజయ్ నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ పెట్టచ్చు. మా ధర్మపురి అరవింద్ నియోజకర్గంలో పసుపు బోర్డు ఏర్పాటుచేయవచ్చు.
మా సోయమ్ బాపూరావు నియోజకవర్గంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయవచ్చు. ఇవన్నీ మీరు సంతకాలు పెడితే అయ్యే పనులు కదా? బుందేల్ఖండ్కు ఇచ్చినటువంటి డిఫెన్స్ కారిడార్ తెలంగాణకు ఇవ్వరాదా? మా హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. మీరు సహాయం చేస్తే అది మరింతగా అభివృద్ధి చెందుతుంది. మీరు పోటీగా దాన్ని మళ్లీ గుజరాత్లో ఏర్పాటుచేశారు.
తెలంగాణలో కాజీపేట్లో రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కు తీసుకెళ్లారు. మీరు సంతకం పెడితే కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీ వస్తది. భువనగిరిలో ఎయిమ్స్ను కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసింది. దానికి నిధుల్లేవు, డాక్టర్లు లేరు, నర్సుల్లేరు, భవనాల్లేవు, ల్యాబుల్లేవు. సెమినార్హాళ్లు లేవు.
మీరు చేస్తే ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కావాలనుకుంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇవ్వవచ్చు. మోదీ సంతకం పెడితే అభ్యంతరం చెప్పేవాళ్లు ఎవరైనా ఉన్నారా? మీరు తలచుకుంటే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా రద్దు చేయొచ్చు. అప్పర్ భద్ర ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపటి నుంచి గొడవ చేస్తున్నాం. ఆ ప్రాజెక్టు ఆపితే మా మహబూబ్నగర్ జిల్లాకు నీళ్లొస్తాయి. ఈ పని చేయవచ్చు కదా? తెలంగాణ అభివృద్ధికి మీరు అద్భుతాలు చేయవచ్చు. ఎందుకంటే ఇవ్వాళ గుజరాత్కు మీరు ట్రంప్ను, జిన్పింగ్ను, బోరిస్ జాన్సన్ను తీసుకెళ్లారు.
ఇది నాకు గుర్తున్నంతవరకు. ఇంకెంతమందిని తీసుకువెళ్లారో గుర్తులేదు. మీరు తలచుకుంటే మీ సొంత రాష్ర్టానికి ఇంతమంది పెద్దపెద్ద నాయకులను తీసుకెళ్లారు. ఢిల్లీకి వెళ్లకముందే వీరు గుజరాత్కు వెళ్లారు. మరి మన తెలంగాణకు తీసుకురావచ్చు కదా డొనాల్డ్ ట్రంప్ను. హైదరాబాద్లో నమస్తే ట్రంప్ సభను పెట్టవచ్చు కదా? హైదరాబాద్కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ను తీసుకురావచ్చు కదా. దానివల్ల హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది. గుజరాత్కు డొనాల్డ్ ట్రంప్ను మీరు తీసుకెళ్తే, మేం ఇవాంకా ట్రంప్ను తీసుకొచ్చుకొని ఆనందపడాల్సి వచ్చింది. మరి తెలంగాణకు ఇవాంకా ఎందుకు? మీకు ట్రంప్ ఎందుకు? ఆ ట్రంపును మాకిచ్చి, ఈ ఇవాంకను మీరు తీసుకెళ్లండి. మాకు అభ్యంతరం లేదు. మీరు తలచుకుంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పెట్రో కెమికల్ కాంపెక్ల్స్, కడపలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టు.. ఇవన్నీ కూడా వస్తయి కదా మీరు తలచుకుంటే.
సో మీరు తలచుకుంటే ఇన్ని రావటానికి అవకాశం ఉన్నప్పుడు మీరు పోరాటం చేస్తానంటే ఎట్లా..? వడ్డించేవాడు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. వడ్డించుకుంటా వెళ్లవచ్చు. మీరు వడ్డిస్తే మా విస్తరి నిండుతది. మీరెందుకు పోరాటం చేయాలి. మీరెందుకు అడగాలి? వడ్డించేవాళ్లే మీరైనప్పుడు మీరు అడగాల్సిన అవసరమేం లేదు కదా? అందువల్ల ప్రధానమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి తెలంగాణ అభివృద్ధికి పోరాటం చేస్తానంటే ఎలా?.. మోదీజీ మీరు పోరాటం కాదు, తెలంగాణ పట్ల ఆరాటం చూపితే చాలు.’
-ప్రొఫెసర్ కె.నాగేశ్వర్