కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చట్టంలో సవరణలు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆ సవరణల్లోని ప్రధానాంశాలు.. 1. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వవద్దు. 2. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలి. 3. రాష్ర్టాలు సబ్సిడీలు ఇచ్చినాకూడా, రైతులు ముందు బిల్లులు చెల్లించాలి. ఆ తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో సబ్సిడీ జమచేయాలి (ప్రస్తుత గ్యాస్ సబ్సిడీ మాదిరిగా). రాష్ర్టాలు వీటిని అమలు చేయకపోతే అప్పులు తెచ్చుకోనివ్వమనే ఆంక్షలను కేంద్రం విధిస్తున్నది.
రైతులు వ్యవసాయానికి 3, 5 హార్స్ పవర్ (హెచ్పీ) మోటార్లు వాడుతుంటారు. ఒక 5 హెచ్పీ మోటారును ఒక గంట పొలానికి నీళ్లు పెట్టడానికి వాడితే 3.7 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. రోజుకు సగటున 6 గంటలపాటు ఒక రైతు తన మోటారును నడిపిస్తే నెలకు 180 గంటలు. అంటే 180X 3.7=666 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఒక యూనిట్ ధర సుమారు రూ.6.90, అంటే ఒక రైతు నెలకు కట్టాల్సిన విద్యుత్ బిల్లు 666X6.90=4,595. దీనికి అదనపు ఛార్జీలు ఇంకో 500 వేసుకుంటే సుమా రు రూ.5,100 రైతు ముందుగా విద్యుత్ బిల్లు చెల్లించాలి. సబ్సిడీ ముచ్చట తర్వాతే…
ఇది మొదట బాగానే ఉంటుంది. రానురాను సబ్సిడీ తగ్గితే ఆ భారం రైతు భరించాలి. ఉదాహరణకు మొదట్లో గ్యాస్ సబ్సిడీ రూ.350-400 ఇచ్చారు. ఇప్పుడు రూ.40 ఇస్తున్నారు. రేపు ఇది కూడా అంతే కాదని గ్యారెంటీ ఏమిటి? అంత మొత్తం కరెంటు బిల్లు కట్టి రైతు పంట పండిస్తాడా? ఇదిలా ఉంటే చాలామంది రైతులకు భూమి ఒకేచోట ఉండదు. రెండు మూడు చోట్ల ఉంటుంది. అప్పుడు రెండు, మూడు మీటర్లు ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ఒక రైతుకు, ఒక మోటరుకే సబ్సిడీ ఇస్తామంటే ఆ రైతు పరిస్థితి ఏమిటి? ఇంకో సమస్య.. తక్కువ విద్యుత్ వాడే రైతుకు ఎక్కువ సబ్సిడీ, ఎక్కువ వాడే రైతులకు తక్కువ సబ్సిడీ ఇస్తామంటే రైతులు ఊరుకుంటారా? విద్యుత్ వాడకం అనేది వేసే పంట మీద ఆధారపడి ఉంటుంది. వరి, మక్కజొన్న, మిర్చి వేసే రైతులకు ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. పత్తి, కంది, పెసర లాంటి పంటలకు తక్కువ ఖర్చవుతుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఇన్ని యూనిట్లకే సబ్సిడీ ఇస్తామంటారు. అప్పుడు మిగతా యూనిట్ల ఖర్చు రైతు భరించాలి. అప్పుడు రైతులకు కరెంటు బిల్లు తలకు మించిన భారమవుతుంది.
మన రాష్ట్రంలో రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రైతుబంధు’ పేర ఏటా రెండు దఫాలుగా పెట్టుబడి అందిస్తున్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల సాగునీటి గోస కూడా తీరింది. నెర్రెలు బారిన భూములు నేడు పచ్చని పొలాలతో కళకళలాడుతున్నా యి. పంజాబ్కు పోటీగా తెలంగాణ రాష్ట్రం వడ్లు పండి స్తున్నది. మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం వల్ల తెలంగాణ రైతుల పరిస్థితి బాగున్నది. కానీ దేశవ్యాప్తంగా ఇప్పటికే చుక్కలనంటిన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ కూలీలు, యంత్రాల కిరాయి, డీజిల్ ధరల పెంపుతో వ్యవసాయం అగమ్యగోచరంగా తయారైంది.
దేశ వ్యవసాయరంగం సంక్షోభంలో ఉన్నది. ఇప్పుడు రైతు నెత్తిన కరెంటు బిల్లు కూడా వేస్తే రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారుతుంది. మున్ముందు ఇలాంటి రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం చేసేవాళ్లు లేక ఆహార భద్రతే ప్రశ్నార్థకమవుతుంది. విద్యుత్ బిల్లులు కట్టకపోతే పంట ఎదిగే దశలోనే కరెంటు కనెక్షన్లు కట్ చేయడం, కేసులు పెట్టడం లాంటివన్ని తెలంగాణ రాకముందు చూశాం. తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతుకు మళ్లీ గడ్డురోజులు రాబోతున్నాయా అనిపిస్తున్నది! పెట్టుబడి పైసల్లేకనే పొలాలను బీడు ఉంచే రైతులకు రూ.5 వేల కరెంటు బిల్లు కట్టే స్థోమత ఉన్నదా అనే విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడే విధానాలను ఉపసంహరించుకోవాలి.
– ఆర్.నాగేశ్వరరావు