‘పాలకులకు చదివే తీరికుండదు, కానీ అధ్యయనం చేయనివారు ఉత్తమ పాలకులు కాలేరు!’ అన్నాడు ప్లేటో. అది సరే.. మా మోదీ గొప్ప, మా రాహుల్ గొప్ప, మా కేసీఆర్ గొప్ప.. అంటూ హోరెత్తిస్తున్నారు కదా, వీళ్లలో దేశాధినేతగా ఎవరిని ఎన్నుకోవాలి తాతయ్యా?- చూడు బాబూ స్వయం ప్రకాశంతో సూర్యుడూ, సూర్యకాంతిని తనలో నింపుకొని చంద్రుడు లోకానికి వెలుగునిస్తుంటారు. అలాగే దేశాన్ని ప్రగతిపథాన నడిపేందుకు జ్ఞానియైన సూర్యుని వంటి నేత, లేక అధ్యయనం ద్వారా జ్ఞానకాంతిని నింపుకొన్న చంద్రునివంటి నేతైనా కావాలి.
దేశాన్ని ఉద్ధరించాలన్నా, ప్రజలకు మేలు చేయాలన్నా, నేతకు కేవలం దేశభక్తి, ప్రజల పట్ల ప్రేమ ఉంటే చాలవు! అందుకు తగిన జ్ఞానం కూడా కావాలి మరి. ‘జ్ఞానమే విముక్తి మార్గం’ అని ఆదిశంకరులు ఎలుగెత్తి చాటారు గదా. స్వతంత్ర భారతంలో సూర్యుని వంటి మహర్షులు లేరు గాని నాడు జైలు జీవితంలోనూ, అధ్యయనం ద్వారా జ్ఞానకాంతిని నింపుకొన్న గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వగైరాలు నేడు నిరంతర అధ్యయనం ద్వారా కేసీఆర్ మొదలైన చంద్రుని వంటి నేతలు గూడ అరుదుగా ఉన్నమాట వాస్తవం.
మరి మోదీని, రాహుల్ను వదిలేసారేంటి తాతా?- బాబూ ప్రచార మాధ్యమాల లేజర్ కాంతులతో జిగేల్మంటున్న నరేంద్ర మోదీ, తన పూర్వుల హైవోల్టేజీ బల్బుల కాంతిలో వెలుగుతున్న రాహుల్ గాంధీలకు అధ్యయనం పట్ల బొత్తిగా ఆసక్తి లేదన్నది వాస్తవం. ఉదాహరణకు తన విధానాల ద్వారా ఎన్నడూ లేనంతగా దేశ ప్రగతి పతనమార్గం పట్టినందుకు పునరాలోచన గానీ, నల్లధనం వెలికితీత, కోట్ల ఉద్యోగాల కల్పన, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం, వగైరా వాగ్దానాలలో ఒక్కటి గూడ అమలు చేయనందుకు పశ్చాత్తాపం గానీ, ఆకాశమార్గం పట్టించకున్నా, కనీసం పాతాళానికి పడకుండా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటానికి నిపుణులతో చర్చించటంగానీ బొత్తిగా కన్పించటం లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా 1.విద్వేష భావజాలపు రక్షణ కవచాన్ని, 2.దేశభక్తి- జాతీయత అనే కత్తిని, డాలును- ఎన్నికల నదిని అవలీలగా దాటించే ‘మత’ నావను సంసిద్ధం చేసుకున్నాడు. ఆ ధీమాతోనే తగ్గేదే లేదంటున్నారు మోదీజీ.
మోదీ విధానాల వల్ల పతనమౌతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటమెలా? అందుకు ప్రత్యామ్నాయ విధానాలేంటి? ఆ దిశగా అధ్యయనం గానీ, నిపుణులతో చర్చించటం గానీ చేయరు. ట్విటర్లో
సెటైర్లేస్తుంటారంతే! బీజేపీ పట్ల విసుగెత్తిన జనాలకు గత్యంతరం మా కాంగ్రెస్సే గదా అన్న ధీమాతో ఉన్నారు రాహుల్ జీ.
భారత ప్రధాని కెప్టెనైతే.. రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్లేయర్లు. ‘తాను విఫలమైనా, ప్రేయర్లను ప్రోత్సహించి తన టీమ్కు విజయాన్ని చేకూర్చగలిగిన కెప్టెన్ ఆ టీమ్కే అదృష్టం’. ‘అభివృద్ధి-సంక్షేమ సాధనలో’ తాను విఫలమైనా, ఆ దిశగా దూసుకుపోతున్న ముఖ్యమంత్రులను ప్రోత్సహించక పోగా, వ్యవస్థలనే స్పీడు బ్రేకర్లతో వాళ్లను అడ్డుకునే ప్రధాని ఆ దేశానికే దురదృష్టం!’- ఎందుకంటే? రాష్ర్టాల అభివృద్ధే దేశాభివృద్ధి. ఉదాహరణకు కొత్తగా రూపొందిన చిన్న రాష్ట్రమైన తెలంగాణ అధ్యయనశీలి కేసీఆర్ నాయకత్వాన దేశానికి అధిక ఆదాయాన్నందించే నాల్గవ రాష్ట్రంగా ఎదిగింది. భారత ధాన్యాగారాలుగా రాణిస్తున్న పంజాబ్, హర్యానాలకు దీటుగా ధాన్యాన్ని పండిస్తూ భారత ఆహారభద్రతకు మరింత భరోసా కలిగించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కాగా, తెలంగాణ ధాన్యాన్ని కొనం గాక కొనబోమనీ- తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదానివ్వబోమనీ, సింగరేణి బొగ్గు వనరులను అమ్మేస్తామని అంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఇది కేసీఆర్కు కాదు, దేశానికే నష్టమన్న వాస్తవాన్ని మోదీ గుర్తించటం లేదెందుకని బీజేపీ మేధావులే వాపోతున్నారు!
డీజిల్ ధరను భారీగా పెంచిన మోదీనొదిలేసి, ఆర్టీసీ రేట్లెందుకు పెంచారని కేసీఆర్ను గద్దించటమేంటి? ధాన్యం కొనాల్సిన కేంద్రాన్నొదిలేసి రాష్ర్టాల మీద దండెత్తటమేంటి? జనం నవ్వుకుంటారన్న సోయి గూడ లేదు. మా నేతలకంటూ తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ అభిమానులు! నీ తండ్రెవరంటూ రాహుల్ గాంధీని అవమానించిన బీజేపీ నేతను, నిలదీసిన కేసీఆర్ను, ‘బడా చోర్!’ అన్న రాహుల్గాంధీ, మానసిక స్థితేంటో అర్థం గాక ముఖముఖాలు చూసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.మోదీ, రాహుల్ గురించి తెలిసింది. మరి కేసీఆర్ జ్ఞాని అనటానికి రుజువేంటి తాతా? బాబూ.. ‘స్పష్టమైన జ్ఞానం కల నేతలే సవాళ్ళనెదుర్కోగల్గుతారు! సమస్యల నుంచి దేశాన్ని, రాష్ర్టాన్ని గట్టెక్కించగలుగుతారు!’ ఆ జ్ఞానశక్తి వల్లనే సోషలిస్టు రష్యాను స్టాలిన్, కొత్తగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ గట్టెక్కించటమే కాదు, ప్రగతిపథాన నడిపించగలిగారు. ఇది చారిత్రక వాస్తవం.
సోషలిస్టు రష్యా అవతరించిన కొద్ది కాలానికే లెనిన్ కన్నుమూశారు! అప్పుడు బాధ్యతలు చేపట్టిన స్టాలిన్కు పెనుసవాళ్లు ఎదురైనయి. అంతర, బాహ్య యుద్ధాలకు కరువు, కాటకాలు తోడైనయి. తిండిగింజల కోసం, పరిశ్రమల స్థాపన కోసం పాశ్చాత్య దేశాలను అభ్యర్థించాడు స్టాలిన్. ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించిన పాశ్చాత్య దేశాలు, పురుటి దశలోనే సోషలిస్టు శిశువును మాడ్చేయాలన్న వాళ్ల దుష్ట సంకల్పాన్ని గ్రహించాడు స్టాలిన్. ‘ఎవరి చేయూతతో పనిలేకుండానే తమ కాళ్ల మీద తాము నిలబడటమే కాదు, పరుగెత్తగల సత్తా మా రష్యన్లకున్నది’ అంటూ పాశ్చాత్య దేశాలకు కౌంటరివ్వటం ద్వారా రష్యన్లలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాడు స్టాలిన్. వ్యవసాయ పారిశ్రామికాభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలు రూపొందించాడు. ‘సాధించి, ముందుకుపొండి’ అంటూ ప్రజలను పరుగెత్తించాడు. ఐదేండ్ల లక్ష్యాన్ని రెండు, మూడేండ్లకే సాధిస్తూ ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపాడు. విదేశీయులు బహూకరించిన ట్రాక్టరును ఉపయోగించుకోవటం చేతగాక పొలాల్లో వదిలేసిన అనాగరిక రష్యాను, అనతికాలంలోనే అంతరిక్షంలోకి రాకెట్ను పంపి అమెరికానే ఉలిక్కిపడేంతగా అభివృద్ధి చేశాడు. దటీజ్ స్టాలిన్.
విద్యుత్ కొరతతో, ఎత్తిపోతల పథకాలు, పరిశ్రమలు మూతపడుతయి. వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభాలతో తెలంగాణ చిన్నాభిన్నమవుతుందని నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో సహా అగ్రనేతలంతా శాపనార్థాలు పెట్టారు. అట్టి దుస్థితి రావాలనీ, తెలంగాణ విభజన విఫల ప్రయో గం కావాలనీ ప్రజల చేత కేసీఆర్ను ఛీ కొట్టించాలనీ, టీఆరెస్సేతర పార్టీలు, నేతలంతా వేయి కండ్లతో ఎదురుచూసిన మాట వాస్తవం.
గతంలో తెలంగాణలో ప్రజలు లిఫ్టెక్కాలంటే వణికిపోయేంతగా విద్యుత్ కొరత, వ్యవసాయం దెబ్బతిని రైతులు, పరిశ్రమలు మూతబడి, ఉత్పత్తి కుంటుబడి కార్మికులు, వలసలు పోవటం, ఆత్మహత్యలు పెరగటంతో గగ్గోలెత్తింది తెలంగాణ. అంతటి క్లిష్ట పరిస్థితిలో గూడ నిబ్బరాన్ని కోల్పోలేదు కేసీఆర్. ఆయనకున్న జ్ఞానశక్తే ఆయన్నలా నిబ్బరంగా ముందుకు నడిపించింది. కేంద్రం తో, ఇరుగుపొరుగు రాష్ర్టాలతో చర్చించారు. భారీ ఖర్చుకైనా వెనుకాడకుండా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనటం, నిపుణుల సహకారాలతో స్వీయ విద్యుదుత్పత్తిని పెంచటం ద్వారా కొరతను అధిగమించగలిగారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్నందించగలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను ఎక్కదీశారు. మిషన్ కాకతీయ, భగీరథ ద్వారా కాలువలు- చెరువులు- రిజర్వాయర్లు పునర్నిర్మించి రాష్ట్రంలో సాగు, తాగునీటి కొరతను అధిగమించారు. పంజాబ్, హర్యానాలకు దీటైన వ్యవసాయాభివృద్ధిని సాధించారు.
రాజనీతిజ్ఞులైన నెహ్రూ, డెంగ్ సియావోపింగ్ల మార్గంలో పయనిస్తూ, అభివృద్ధి- సంక్షేమ పథకాలతో, వ్యవసాయ పారిశ్రామిక రంగాలను జోడు గుర్రాల్లా పరుగెత్తిస్తున్నారు. ‘జ్ఞానకాంతితో నిండిన పున్నమి చంద్రుని వంటి నేత కేసీఆర్’ అనటానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? ఇరుగు, పొరుగు రాష్ర్టాలే కాదు, అలాంటి నేత కావాలని దేశ ప్రజలే ఆకాంక్షిస్తున్నారంటే ఆయన జ్ఞానశక్తే అందుకు కారణం!
నాడు స్టాలిన్ను, నేడు కేసీఆర్నూ నియంత అంటున్నారుగా తాతయ్యా?- నిజమే బాబూ.. పాశ్చాత్య దేశాలవారు నాడు స్టాలిన్నూ- ప్రతిపక్షాలవారు నేడు కేసీఆర్నూ దుమ్మెత్తి పోస్తున్న మాటా నిజం. ప్రజల గుండెల్లో ఆ నేతలు పదిలంగా ఉన్నదీ నిజం.
పాశ్చాత్య మీడియా వాళ్ళు రష్యా అంతటా పర్యటిస్తూ- రష్యన్ల చేతనే స్టాలిన్ను ‘నియంత’ అనిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ కార్మికులు- రైతులు- ఉద్యోగులు అన్నివర్గాల ప్రజల నుంచీ వాళ్ళకు ఎదురైన ప్రశ్నలివీ.
1. సార్ కమ్మని చేపల కూరతో భోజనం పెట్టారు! దాన్ని మీరు లొట్టలేసుకుంటూ తిన్నారు! కొన్నాళ్ళ తర్వాత మీకు ఆ చేపల కూర కమ్మదనం గుర్తొస్తుందా, లేక అందలి ముళ్ళు గుర్తుకొస్తాయా?
2. ఒక విద్యార్థిని 90 మార్కులు తెచ్చుకున్నందుకు అభినందిస్తారా? పది తప్పులు రాసినందుకు నిందిస్తారా?
3. తండ్రి కష్టపడి చదివించి తన బిడ్డల్ని గొప్ప డాక్టరుగా, ఇంజినీరుగా ఎక్కదీసాడనుకోండి, అప్పుడు వాళ్లకు ఆ తండ్రి త్యాగం గుర్తొస్తుందా? తండ్రి తమను కొట్టిన దెబ్బలు, తిట్లు గుర్తుకొస్తాయా?
4. సార్ మీరు పున్నమి రాత్రిలో ఆరుబయట కూర్చుని వెన్నెల్ని ఆస్వాదిస్తారా? చందమామలో మచ్చల్ని లెక్కిస్తారా?
నాడు ‘స్టాలిన్’ను నియంతగా చిత్రించాలనుకున్న పాశ్చాత్య మీడియాకు రష్యన్ల నుంచి ఎదురైన ఈ ప్రశ్నలే నేడు ‘కేసీఆర్’ను నియంతగా ప్రచారం చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల వారికీ, వ్యతిరేక మీడియాకు తెలంగాణ ప్రజల నుంచి ఎదురౌతాయన్నది ముమ్మాటికీ నిజం.
కొందరు వామపక్ష పార్టీల అగ్రనేతలు తప్ప, తెలంగాణ రాష్ట్ర ప్రగతి సాధనకే కాదు, భారతదేశ ప్రగతి సాధన పట్ల కూడా స్పష్టమైన అవగాహన, రాజకీయ పరిజ్ఞానం కలిగిన కేసీఆర్కు దీటైన నేత, వర్తమాన భారతంలో మరొకరు లేరన్నది కూడా నిజం.
-పాతూరి వేంకటేశ్వరరావు ,98490 81889