ఓ దిక్కు ఎండలు మండిపోతుంటే.. మరో దిక్కు విద్యుత్ కోతలతో భారతదేశం అట్టుడుకిపోతున్నది. అధికారిక కోతలకు, అనధికార కోతలు కూడా తోడవ్వడంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్థాయిలో విద్యుత్ కోతలు విధించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు. రోజురోజుకూ విద్యుత్ ఉత్పత్తికి, వినియోగానికి మధ్య అంతరం భారీగా పెరిగిపోతున్నది. దేశంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు మినహాయిస్తే అన్ని రాష్ర్టాల్లోనూ విద్యుత్ కోతలు అమలవుతున్నాయి.
భారతదేశ విద్యుదుత్పత్తి సామర్థ్యం 399.497 గిగావాట్లు. కాగా, పీక్ డిమాండ్ ఇప్పటివరకు 207.11 గిగావాట్లుగా నమోదైంది. అంటే ఉత్పత్తి సామర్థ్యంలో ఇది సగానికి కొంచెం ఎక్కువ. ఉత్పత్తి సామర్థ్యంలో 204.08 గిగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ కేంద్రాలు అందుబాటులో ఉంటే, గ్యాస్ ఆధారిత 24.09 గిగావాట్లు, లిగ్నైట్ ఆధారిత 6.62 గిగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు 40.35 గిగావాట్ల పవన విద్యుత్, 53.99 గిగావాట్ల సౌరవిద్యుత్ కూడా అందుబాటులో ఉన్నది. మరింత ఎత్తున ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఈ అలవికాని విద్యుత్ కోతలు ఎందుకు అమలవుతున్నట్లు. ఎండాకాలం కాబట్టి 46.72 గిగావాట్ల జల విద్యుత్ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. సమస్యకు ప్రధాన కారణం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కోల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ రైల్వే మధ్యన అవగాహన లేకపోవడం. కరోనా అనంతరకాలంలో కోలుకుంటున్న పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ అవసరాల పెరుగుదలను అంచనా వేయడంలో విఫలం చెందడం మరో కారణం.
2020-21లో దేశం పీక్ డిమాండ్ 190.19 గిగావాట్లుగా నమోదైంది. 2121-22 వచ్చేసరికి 203.01 గిగావాట్ల డిమాండ్ రికార్డయింది. 2022 ఏప్రిల్లో 207.11 గిగావాట్ల డిమాండ్కు చేరుకున్నది. గతంతో పోల్చుకుంటే ఇది అనూహ్యమైన పెరుగుదల ఏమీ కాదు. 2020-21లో 12,75,534 మిలియన్ యూనిట్ల వినియోగం కాస్తా 2021-22 వచ్చేసరికి 13,75,663 మిలియన్ యూనిట్లకు చేరుకున్నది. సంస్థలు సరఫరా చేసిన విద్యుత్ 5.84 శాతం తక్కువగా ఉండి, ఆ మేరకు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తున్నది.
రాష్ర్టాల వారీగా విద్యుత్ సరఫరా పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలకు 15 గంటల 7 నిమిషాలు, పట్టణ ప్రాంతాలకు 19 గంటల 3 నిమిషాలు విద్యుత్ సరఫరా చేస్తూ మిగతా సమయం కోతలు విధిస్తున్నారు. యూపీలో 3,000 మెగావాట్ల విద్యుత్ లోటున్నది. ఉత్తరాఖండ్లోని కాశీపూర్ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం మూతపడటంతో అక్కడి ప్రజలకు కోతల తిప్పలు తప్పడం లేదు. పంజాబ్లోని పాటియాల, లూథియానా, మొహాలి లాంటి పట్టణాల్లో సైతం గంటల తరబడి కరెంటు కోతలు విధిస్తున్నారు. పంజాబ్ డిమాండ్ 8,000 మెగావాట్లకు చేరుకోవడంతో కోతలు ఎడాపెడా విధించడంతో హోషియార్పూర్ రైతులు రోడ్లను దిగ్బంధనం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. అక్కడ రోజూ 5 నుంచి 8 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. పంజాబ్, బీహార్, జార్ఖండ్, కేరళ, ఢిల్లీ, ఈశాన్య రాష్ర్టాలు మహారాష్ట్ర.. ఇలా ఎక్కడికెళ్లినా విద్యుత్ కోతలకు 42 డిగ్రీలకు పైబడిన ఎండలు తోడవ్వడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రోజూ 50 మిలియన్ యూనిట్ల కొరతను ఎదుర్కొంటున్నది. తీర ప్రాంత ఉక్కపోత వాతావరణాన్ని విద్యుత్లేమితో ఎదుర్కోలేక అక్కడి ప్రజలు హైదరాబాద్ బాట పడుతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రైవేట్ సెక్టార్లోని 32, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 42, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 12, ఇతర విద్యుత్ కేంద్రాలు 12 తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి తీవ్రతను ఆలస్యంగా గుర్తించిన ఇండియన్ రైల్వే, కోల్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా 670కు పైగా రైళ్ల రాకపోకలను రద్దుచేసి బొగ్గు రవాణాకు మార్గం సుగమం చేశాయి. రద్దయిన రైళ్లలో 500కు పైగా దూరప్రయాణం చేయాల్సిన ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉండటం శోచనీయం.
దేశీయంగా ఏర్పడిన బొగ్గు కొరత, పరిస్థితులను అంచనా వేయడంలో వైఫల్యం తదితర కారణాల రీత్యా విదేశీ బొగ్గును 10 శాతం మేర వాడుకోవాలని థర్మల్ కేంద్రాలకు ఆదేశాలున్నాయి. దేశీయ బొగ్గు టన్నుకు రూ.4 వేలు ఉండగా, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా విదేశీ బొగ్గు ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్నది. ఈ పరిస్థితులు ఇండోనేషియాకు చెందిన అదారో ఎనర్జీ, ఆస్ట్రేలియాకు చెందిన వైట్హావెన్ కోల్, అదానీ ఎంటర్ప్రైజెస్కు లాభాల పంటలు పండించేవిగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఇంత దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే దేశ ముఖచిత్రంలో దేదీప్యమానంగా వెలిగిపోతోన్నది. కొత్త రాష్ట్రమైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశక త్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విద్యుత్ రంగాన శిఖరాగ్రానికి చేరుకున్నది. జై తెలంగాణ!
(వ్యాసకర్త: తుల్జారాంసింగ్ ఠాకూర్ 78930 05313, అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)