దేశంలోని ఏ రాష్ట్రమైనా సర్వతో ముఖాభివృద్ధి దిశగా దూసుకువెళ్లాలంటే ఆ రాష్ర్టానికి సమర్థ నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వం కేసీఆర్ రూపంలో లభించడం తెలంగాణ ప్రజల అదృష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతమైన ఉద్యమ రూపకర్త, ప్రజల హృదయాలను చూరగొన్న మహా నాయకుడే కాదు, గొప్ప పరిపాలనాదక్షుడు కూడా.
‘నీళ్లు, నిధులు, నియామకాలే’ లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో ఆ దిశగా అనేక సంస్కరణలను అమలుచేస్తున్నారు. మొదట నిధులు, ఆ తర్వాత కాళేశ్వరం ద్వారా నీళ్లు.. ఇప్పుడు నియామకాలు.. ఇలా.. పోలీసు వ్యవస్థ నుంచి గ్రామ పంచాయతీల దాకా… అన్ని రంగాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు పట్టిన చెదను దులుపుతున్నారు. అందుకే నేడు తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నది.
దేశంలోని అగ్రగామి రాష్ర్టాలలో తెలంగాణ ఒకటిగా విలసిల్లుతున్నదంటే దానికి కారణం కేసీఆర్ పాలనాదక్షత. రాష్ట్ర పాలనా రంగంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు. కాకతీయుల కాలం నాటి వైభవం నేడు రాష్ర్టానికి కలిగిందంటే అందుకు కేసీఆర్ సమర్థతతే కారణం. తెలంగాణ రాష్ట్రం తన 9వ అవతరణ దినోత్సవాన్ని త్వరలో జరుపుకోబోతున్న సందర్భంగా, పరిపాలనారంగంలో కేసీఆర్ చేపట్టిన సంస్కరణల గురించిన కొన్ని వివరాలను ఒకసారి నెమరువేసుకుందాం.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ మొదటి అధికారిక సమావేశం రాష్ట్ర డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతోనే జరిగింది. పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని కేసీఆర్ విశ్వాసం. అందుకే పోలీసు శాఖలో లోపాలను సవరించిన కేసీఆర్ ఆ విభాగంలో అత్యాధునికతకు పెద్దపీట వేశారు. నేరం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలా కొత్త వాహనాలను, సాంకేతికతను సమకూర్చారు. పాత తుపాకుల స్థానంలో ఆధునిక ఆయుధాలను సమకూర్చారు. రాష్ట్రమంతటా పెద్ద మొత్తంలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ఒక్కో పోలీస్స్టేషన్కు నగరంలో నెలకు రూ.75 వేలను, జిల్లా కేంద్రాలల్లో రూ.50 వేలను, మండలాల్లో రూ.25 వేలను ఖర్చుల కింద మంజూరు చేస్తున్నారు. ఈ విధానం దేశంలోని మరే రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదు.
‘షీ-టీమ్స్’: మహిళల రక్షణ కోసం ‘షీ-టీమ్స్’ను ఏర్పాటుచేశారు. వాటి వల్లే ఆకతాయిల నుంచి యువతులు, స్త్రీలకు వేధింపులు తగ్గాయి. మహిళలకు భద్రత ఏర్పడింది.ఫ్రెండ్లీ పోలీసింగ్: పోలీస్ స్టేషన్లు, పోలీసులంటే ప్రజలకున్న భయాలను పోగొట్టి, పోలీసులను ప్రజలకు స్నేహితులుగా పనిచేసేవిధంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటుచేశారు.
ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్: ట్రాఫిక్ పోలీసులకు పొల్యూషన్ అలవెన్స్ కింద వేతనంపై 30 శాతం అదనపు జీతం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్న పోలీసులకు వారాంతపు సెలవునూ మంజూరు చేశారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్: రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నగరంలో అత్యాధునిక హంగులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. త్వరలో ప్రారంభం కానున్నది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శాంతిభద్రతల పర్యవేక్షణ ఇక్కడినుంచే జరగనున్నది.
కమిషనరేట్ల ఏర్పాటు: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు పోలీస్ కమిషనరేట్లకు అదనంగా కొత్తగా మరో ఏడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ భవనాలు అత్యాధునిక సౌకర్యాలతో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమవుతున్నాయి.
ధరణి పోర్టల్: తెలంగాణ ప్రజల స్థిరాస్తుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబర్లో ‘ధరణి పోర్టల్’ను ప్రవేశపెట్టింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల మొత్తం విధానాన్ని ఆన్లైన్లోకి తీసుకురావడమే కాకుండా ల్యాండ్ మ్యుటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలను ఈ ధరణి పోర్టల్ సులభతరం చేసింది.
మున్సిపాలిటీల పునర్వ్యవస్థీకరణ: ఉమ్మడి రాష్ట్రంలో 68గా ఉన్న మున్సిపాలిటీలను 129కి పెంచారు. 6 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే వాటిని 13కు పెంచారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే తండాలను గ్రామ పంచాయితీలుగా అప్గ్రేడ్ చేశారు. గ్రామ పంచాయితీలను 8,690 నుంచి 12,769కు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.
దళితబంధు: దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ ఊహకందని పథకం దళితబంధు. ఈ పథకంతో దళితులు సాధికారతను, స్వావలంబనను పొందుతున్నారు. అర్హులైన దళిత కుటుంబానికి ప్రభుత్వం నేరుగా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం. ఈ సొమ్ముతో వ్యవసాయ యంత్రాలను, ఆటో ట్రాలీలను, క్యాబ్లను, ట్రాక్టర్లను కొనుగోలు చేసి వాటితో ఎంతో మంది దళితులు ఉపాధి పొందుతున్నారు.
గత ఏప్రిల్ 27న జరిగిన టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశంలో మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బెంగాల్ ఈ రోజు ఆలోచించే దానిని భారతదేశం రేపు ఆలోచిస్తుంద’ని ఒక నానుడి ఉండేది. అది నేడు తెలంగాణ రాష్ర్టానికి వర్తిస్తున్నది’అన్నారు. అది అక్షరాలా సత్యం.
(వ్యాసకర్త: రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్)