బౌద్ధ దార్శనికుడు, రెండో బుద్ధుడిగా పేరొందిన ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల విజయపురి. ఇప్పుడున్న నాగార్జునసాగర్ ప్రాంతం. ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ మార్మోగుతూ, ఆగ్నేయాసియా దేశాలకు బౌద్ధమతాన్ని విస్తరింపజేసిన ముఖద్వారం ఇది. ఆ ప్రాంతంలో కృష్ణమ్మ సమీపంలో, ఎత్తయిన కొండల పక్కన, చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటైన బుద్ధవనం ప్రాజెక్టు పలువురిని
ఆకట్టుకుంటున్నది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని హిల్కాలనీలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు కనువిందు చేస్తున్నది.
బుద్ధవనం ప్రాజెక్టు 274.28 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటైంది. ఇక్కడి బుద్ధుడి శిల్పాలు, బౌద్ధ
చిహ్నాలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఒకవైపు బుద్ధుని జీవిత ఘట్టాల శిల్పాలతో అలంకరించిన
బుద్ధచరితవనం, మరోవైపు సిద్ధార్థుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు పరిపూర్ణతను సాధించడానికి ఆచరించిన 10 పారమితులను ప్రతిబింబించే జాతకవనం.. ఇంకొంచెం ముందుకువెళ్తే ధ్యానవనం, అందులో శ్రీలంక
ప్రభుత్వం బహూకరించిన 36 అడుగుల బుద్ధుని శిల్పం, దమ్మభూషణ వినిపించే గంట సందర్శకులను మైమరపింపజేస్తాయి. బుద్ధుడు బోధించిన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపుతిప్పుకోనివ్వవంటే అతిశయోక్తి కాదు. బుద్ధవనంలోని మహాస్తూపం, మన దేశంలోనే అరుదైన బౌద్ధ వారసత్వ కట్టడంగా ఇప్పటికే కీర్తి గడించింది. కింది అంతస్తులో ప్రాచీన బౌద్ధ శిల్ప కళాఖండాలున్న ప్రదర్శనశాల, సమావేశమందిరం,
ఆచార్య నాగార్జునుడి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో అష్టమంగళ
చిహ్నాలు, సిద్ధార్థ గౌతముని ఐదు ప్రధాన జీవిత ఘట్టాలను సూచించే ఆయక స్తంభాలు. వేదిక,
అండం చుట్టూ అలంకరించిన అద్వితీయ బౌద్ధ శిల్ప కళాఖండాలు, వాటిలో ఆచార్య నాగార్జునుడు,
ధర్మచక్ర పరివర్తన ముద్రలో బుద్ధుడు, తార, మైత్రేయనాథ, భవచక్ర శిల్పాల ఉన్నాయి. మొత్తం
13 రకాల స్తూపాలను ఏర్పాటు చేశారు. బుద్ధవనం ఆధ్యాత్మికంగానే కాదు, ప్రకృతి పర్యాటకులనూ
విశేషంగా ఆకర్షిస్తున్నది.
బుద్ధవనం ప్రధాన ద్వారం వద్ద గజరాజుల శిల్పాలు ఘన స్వాగతం పలుకుతాయి. ఆ వెనుకే రెండువైపులా స్తంభాలపై మృగరాజులుంటాయి.తలెత్తి చూస్తే ఆకాశానికి అతుక్కుపోయినట్టు కనిపించే అశోకచక్రం, లోపలికి వెళ్లగానే బుద్ధుడు సేదదీరుతున్నట్టు కన్పించే కృష్ణశిల, ఆ పక్కనే పాదుకలు, బుద్ధుడికి సంబంధించిన జీవిత ఘట్టాలు, దలైలామా నాటిన బోధివృక్షం కనపడుతాయి. అన్నింటికీమించి బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలను ప్రతిబింబించే దారులు, మహాస్తూపం నాగార్జున సాగర్ తీరాన కొలువుదీరిన బుద్ధవనానికే హైలైట్. ఇది బుద్ధుడు నడిచిన నేల అన్నట్టు బుద్ధవనం రూపుదిద్దుకున్నది.
2001లో అప్పటి పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిపోవడంతో
రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిచేయాలని ఆరేండ్ల కిందటనే సంకల్పించింది. మల్లేపల్లి లక్ష్మయ్యకు
బాధ్యతలు అప్పగించింది. నిధులు విడుదల చేసింది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను
ఆకట్టుకునేలా ‘బుద్ధవనం’ ప్రాజెక్టును ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈ ప్రాజెక్టు తెలంగాణను అంతర్జాతీయ
పర్యాటక చిత్రపటంలోకి తీసుకువెళ్తుందనడంలో సందేహం లేదు. 300కు పైగా ప్రాచీన బౌద్ధ
స్థావరాలతో కూడిన ఈ నేలపై అప్పటి వైభవాన్ని, బౌద్ధ నైతిక విలువలను ఈ తరానికి అందించడానికి
చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టు తెలంగాణకే గర్వకారణం.భవిష్యత్తులో బౌద్ధ విజ్ఞాన సముపార్జన కేంద్రంగా బుద్ధవనం విరాజిల్లుతుందనడం అతిశయోక్తి కాదు.
(వ్యాసకర్త: జటావత్ హనుము, 85198 36308 గెస్ట్ లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్)