భావ వ్యక్తీకరణలో భాష కీలకం. అట్లాగే భాషణలో కూడా భాష కీలకమే. భాష అంటేనే ఓ భావనా పటిమ. ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ వేదికపై, ముగింపు సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన భాషణలో భాష అత్యంత రమణీయమై, ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాటా, అద్భుత విషయ పరిజ్ఞానంతో బాటు, అందమైన తెలుగు తియ్యందనాల ధారగా సాగింది. ఏడేండ్ల పాలనను ప్రతిబింబించడం మాత్రమేకాదు, రాబోవు కాలానికి ఓ భరోసా నిచ్చింది ఆ ప్రసంగం.
ఉద్యమ నేతగా కేసీఆర్లో ఏటికి ఎదురీదే ధైర్యం, స్థైర్యం, పట్టుదల, నిక్కచ్చితనం, నిర్భీతి చూశాం. పాలనకు, ప్రజలకు సంబంధించిన ఏ విషయాన్నయినా కూలంకషంగా విషయ నిపుణులతో చర్చించి, ఆకళింపు చేసుకొని, ప్రజోపయోగ నిర్ణయాలను తీసుకునే మేధావిగా చూస్తున్నాం. కేసీఆర్ తన ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా మార్చడం వెనక, కరువుతో, వలసలతో తండ్లాడిన రాష్ర్టాన్ని సుభిక్షంగా మార్చాలనే తపన, ఆరాటం వెనుక మానవీయ దృక్కోణం కన్పిస్తుంది.కేసీఆర్ కేవలం కలలు కని ఊరకుండే వ్యక్తి కాదు. అహరహం శ్రమిస్తూ, అవిరళ కృషి గావిస్తూ, కలలను సాకా రం చేసుకునే నిరంతర శ్రామికుడు.
ఆద్యంతమూ, ఒక ప్రవాహంలా సాగిన కేసీఆర్ ప్రసంగంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తన కలల సాకారం దిశగా సాగే వ్యూహాన్ని అద్భుత పద సంపదతో, చిక్కని భావస్పోరక మాటలతో చెప్పారు. నీరు, విద్యుత్తు తదితర అంశాలపై సాధికారిక గణాంకాలతో కూడిన ఆయన మాటలు ఆలోచింపజేసేవి. ఆయన ప్రసంగం వింటూంటే… ఎక్కడో చదివిన మాటలు గుర్తొచ్చాయి. ‘What we say is important for in most cases the mouth speaks what the heart is full of’ ఇది కేసీఆర్ ప్లీనరీ ప్రసంగం విషయంలో నూటికి నూరు శాతం వాస్తవం. కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపూ ఒక బలమైన నాయకుడికి ఉండాల్సిన విషయ పరిజ్ఞానాన్నీ, భాషనీ, మేధో సంపత్తినీ, సంయమనాన్ని, సాధికారతనూ ప్రస్ఫుటించాయి.
నెర్రెలు బారిన నేలపై, నేడు ఎక్కడ చూసినా జలసిరులతో పచ్చదనం ప్రభవింపజేసిన భగీరథుడు కేసీఆర్. ఇదే అనుభవంతో దేశాన్ని గూడా ఏ విధంగా సుసంపన్నం చేయొచ్చు అనే దార్శనికతతో కేసీఆర్ ఇచ్చిన వివరణ అద్భుతమైంది. దేశంలోని నీటి లెక్కల గూర్చి మాట్లాడుతూ, 65 వేల టీఎంసీల నీరున్నప్పటికీ, కావేరీ జలాల కోసం, సింధు, సట్లేజ్ నదుల నీటి కోసం రాష్ర్టా లు ఏ విధంగా యుద్ధం చేస్తున్నాయో చెబుతూ, దేశంలోని వనరులను సరిగా ఉపయోగించుకోలేని అసమర్థ ప్రభుత్వాలపై ధ్వజమెత్తడం కేసీఆర్ భవిష్యత్ దర్శనానికి అద్దం పట్టింది.
ఇవ్వాళ తెలంగాణ దేశానికే దారి దీపమైంది. నిరంతర వెలుగులు పంచే అక్షయ దీపంలా వెలుగొందుతున్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబయి నుంచి కోల్కతా వరకు కోతల్లేని విద్యుత్తునివ్వడం సాధ్యమేనని కేసీఆర్ చెప్పిన తీరు పెద్ద భరోసా నింపింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సమావేశాల్లో ఎన్నోసార్లు ప్రతిపాదించానని కేసీఆర్ అన్నప్పుడు, ఇట్లాంటి నాయకులు కదా దేశానికిప్పుడు కావల్సిందని అన్పించింది. దేశ భవిష్యత్తు కోసం, ఇలాంటి భవిష్యత్ దర్శనం గల మానవీయ నాయకుడే మనకిప్పుడు కావల్సింది.
వ్యాసకర్త: డాక్టర్ వాణీ దేవులపల్లి , కవి, రచయిత