నేత కార్మికులను ఆదుకోవటానికి ఇప్పటికే సమగ్ర చర్యలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘నేతన్న బీమా’కు నిధులు విడుదల చేయడం హర్షణీయం. దీంతో చేనేత, పవర్లూమ్, యాన్సిలరీ, ఇలా.. ఏ విభాగంలో పనిచేసే కార్మికుడికైనా రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు నేత కార్మికుడు మరణిస్తే అతని/ ఆమె కుటుంబం వీధిన పడకుండా ఈ పథకం భరోసా ఇస్తుంది. తెలంగాణను సాధించుకున్న తర్వాత ప్రణాళికాబద్ధంగా ఒక్కోరంగాన్ని గాడిన పెడుతూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనావస్థలో ఉన్న చేనేతరంగాన్ని చక్కదిద్దడానికి చేయని ప్రయత్న మంటూ లేదు.
తెలంగాణ చేనేత రంగం పునర్వైభవాన్ని సాధించడానికి ముఖ్య మంత్రి కేసీఆర్ పలు చర్యలు తీసుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు చీరలను కానుకగా ఇస్తున్న ప్రభుత్వం ఆ చీరల తయారీ పనులను నేత కార్మికులకే ఇస్తున్నది. రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా అవసరమయ్యే వస్త్ర ఉత్పత్తులు, స్కూలు యూనిఫాంల తయారీని కూడా కేటాయిస్తున్నది. దీనివల్ల వారి ఉపాధికి భరోసా లభిస్తున్నది. ‘నేతన్నకు చేయూత’ పేరుతో కార్మికులకు పొదుపు మొత్తం ఏర్పాటు చేసింది. కరోనా కష్టకాలంలో ఇది ఎంతో ఆసరాగా నిలిచింది. నూలు, రంగులపై సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్కు ప్రోత్సాహం, టెస్కో ఎక్స్గ్రేషియా, చేనేతమిత్ర, క్యాష్క్రెడిట్ రుణాలు, ఆసరా పింఛన్లు వంటి ఇతర పథకాలు నేతన్నలకు కొండంత అండనిస్తున్నాయి. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ‘వారంలో ఒకరోజు చేనేత వస్ర్తాలు ధరించాలం’టూ ఇచ్చిన పిలు పు సెలబ్రిటీలతోపాటు సాధారణ ప్రజలకు కూడా మార్గదర్శకమైంది. దీంతో చేనేత వస్ర్తాలకు డిమాండ్ కూడా పెరిగింది.
పక్కా సమాచారంతోనే పక్కా ప్రణాళికలు సాధ్యమవుతాయి. అందుకే రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాలన్నింటినీ ప్రభుత్వం ట్యాగింగ్ చేసింది. ఇది దేశంలోనే ప్రథమం. కచ్చితమైన లబ్ధిదారులను గుర్తించటంతోపాటు, మరమగ్గాల ఆధునికీకరణకు కూడా ఈ సమాచారం తోడ్పడింది. నేత కార్మికులనే యజమానులుగా మార్చే ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి ఎంతోమంది నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపింది. ఓవైపు ఈ విధంగా చేనేత, పవర్లూమ్ రంగాలను సమూలంగా మార్చటానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోవైపు దుస్తుల తయారీకి సంబంధించి దిగ్గజ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నది. కేరళ రాష్ర్టానికి చెందిన కిటెక్స్ వరంగల్లోని కాకతీయ మెగాటెక్స్టైల్ పార్కులో భారీ పెట్టుబడితో యూనిట్ను ప్రారంభించనున్నది. దీనివల్ల నాలుగు వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా. చేనేత, మరమగ్గాల రంగాన్ని బాగు చేయడానికి పెట్టుబడులూ కావాలి. నేతన్నల కష్టాలను తీర్చగల మానవీయ దృక్పథ మూ ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నది అదే!