మంచిర్యాల జిల్లా చెన్నూరులో ‘కృతజ్ఞత సభ’ పేరుతో ఇటీవల ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1658 కోట్ల వ్యయంతో చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడంతో పాటు ఇతర హామీలను నెరవేర్చిందన్న సంతోషంతో ఈ సభను నిర్వహించారు. దీంట్లో ప్రముఖ కవి మల్లావఝల సదాశివుడి కుమారుడు, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయానంద్ చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది. ఆయన ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు..
సాధారణంగా రాజకీయ నేతలు వాగ్దానాల సభలు పెడుతరు. ఓట్ల కోసం అది చేస్తం, ఇది చేస్తమని చెప్తూ సభలు పెడుతరు. కానీ ఈ సభ ప్రత్యేకమైనది. ఇది కృతజ్ఞతా సభ. మన ప్రాంతానికి చెందిన నేతలు చెప్పిన పనులన్నీ చేసిన సందర్భంగా మనమందరం కలిసి ఏర్పాటు చేసుకున్న కృతజ్ఞతా సభ ఇది. ఇలాంటి సభను గతంలో మనం ఎప్పుడూ చూసి ఎరుగం. ఇదొక కొత్త సంప్రదాయం. రాష్ట్రం వచ్చినంక తెలంగాణ సాధించిన ఘనత ఇది.
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ప్రసంగిస్తూ.. ఆ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అడుగుతున్నప్పుడు, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు అవునని చెబుతూ సంతోషంగా తలలూపటం చూస్తున్నా. ఇది ఏదో ఒక ప్రాంతానికి చెందిన విషయం కాదు. ఇవ్వాళ అన్ని ప్రాంతాల్లో కండ్లముందు కనిపిస్తున్నదే. మన ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం ఎలా జరిగిందో, గతంతో పోలిస్తే పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో అందరికీ అనుభవమే. ఇచ్చిన మాట ప్రకారం.. వాగ్దానాలన్నింటినీ నెరవేర్చటం ఎలా జరిగింది? అన్నది ముఖ్యమైనది. ఇది ఎలా సాధ్యమైందన్నది అందరం ఆలోచించాలె. ఇది ఇప్పటిదాకా ఎందుకు కాలేదన్నది చూడాలి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్న మాటలు యాదికొస్తున్నాయ్. సారు ఎప్పుడూ మనకు ఒక స్వీయ రాజకీయ శక్తి అవసరం అని చెప్పేవారు.
ఆ క్రమంలో ఆయన ఎలాంటి శషబిషలు లేకుండా జేఏసీ నుంచి దూరం జరిగి టీఆర్ఎస్కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.తెలంగాణ వికాస సమితిగా మేం కూడా ఎప్పుడూ స్వీయ రాజకీయ శక్తి ఆవశ్యకతను గుర్తెరిగి జయశంకర్ సార్ బాటలో నడుస్తున్నం. అనేక చర్చోప చర్చల తర్వాత.. మేం మా ప్రణాళికలోనే ప్రకటించుకున్నం. స్వీయ రాజకీయ శక్తికే మా మద్దతు ఉంటుందని రాసుకున్నం. రాష్ట్రసాధన ఉద్యమంలో పుట్టి, ఎదిగిన పార్టీయే స్వీయ రాజకీయ శక్తి. అందుకే మేం అనేక సందర్భాల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాం. ఎన్నికల సమయంలో కూడా బహిరంగంగా టీఆర్ఎస్కు మద్దతు తెలిపినం. ఇందులో దాపరికం లేదు. స్వీయ రాజకీయ శక్తి ఆవశ్యకతను గుర్తెరిగి సామాజిక బాధ్యతగా టీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నం.
మన స్వీయ రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఎదిగింది. మనందరి ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తున్నది. ఉద్యమ పార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ మాత్రమే ఇవ్వాళ తెలంగాణ స్వీయ రాజకీయ శక్తి. తెలంగాణ పట్ల కడుపునిండ ప్రేమతో టీఆర్ఎస్ ఉంటది. టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తప్ప మరేమీ ప్రాధాన్యాలు కావు. మరే రాజకీయ ప్రయోజనాలు ఉండవు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారమే ఏకైక ఎజెండాగా టీఆర్ఎస్ పనిచేసింది, చేస్తున్నది.
ఆ క్రమంలోనే అన్న మాట ప్రకారం.. ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చింది. ఆ అర్థంలో మనం నిర్వహించుకుంటున్న ఈ సభ అర్థవంతమైనది, సమ్మతమైనది. 2014లో రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లున్నదో చూస్తె తెల్వదా? సాగుకు నీళ్లొచ్చినై. కల్తీ విత్తనాల బాధ తప్పింది. ఎరువుల కోసం చెప్పులను లైన్లబెట్టిన రోజులు పోయినయ్. పండిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నది. ఇది గతంలో ఎన్నడైన ఉన్నదా? అందుకే మనమంతా కేసీఆర్ ఎన్క ఉండాలె.
ఉద్యమ సమయంలో వెకిలి నవ్వులు నవ్వుతూ, సాటుంగా తెలంగాణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపినోడు కూడా ఇయ్యాల తెలంగాణ పట్ల ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడుతుండు. నమ్ముతమా? పానాన్ని పణంగా పెట్టి చావునోట్లె తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ వెంట ఉంటమా? లేదా? కేసీఆర్ వెంటే ఉంటం.
ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలున్నాయి. వాటికి తెలంగాణ ప్రాంతం అనేది ఒక రాజకీయ క్షేత్రం మాత్రమే. రాజకీయ ప్రయోజనాలు మినహా వారికేమీ తెలంగాణ పట్ల ప్రత్యేక బాధ్యత, నిబద్ధత ఉండదు. అందుకనే.. ఆ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోంచే ఆలోచిస్తయి, పనిచేస్తయి. అందుకే ఇన్నాళ్లుగా, ఇప్పుడు కూడా ఆ పార్టీలకు తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు అంతగా పట్టవు, అర్థం కావు.
రాజకీయ పార్టీలు చాలా చెప్తయి. ఏవేవో తామే పొడిచేసినట్లు చెప్పుకొస్తయ్. కానీ మనకు ఏం కావాలె. మన బతుకులు బాగు చేసే పార్టీ కావాలె. మన ప్రాంతాన్ని సస్యశ్యామలం ఎవరు చేస్తరో వారు కావాలె. మన భూములకు ధరలు పెరిగేట్లు చేసిన పార్టీ కావాలె. మనందరికీ తెలుసు. ఎక్కడిడెక్కడి నుంచో వచ్చినోళ్లు చెన్నూరు, కోటపల్లి ప్రాంతాల్లో 50, 60 వేలకు ఎకరం చొప్పున భూములు కొన్నరు. ఊరూరా మనందరం చూసిందే. కానీ ఇప్పుడు అంతకు ఎకరం భూమి దొర్కుతదా. లేదు. ఎకరం పదిలక్షలు పలుకుతున్నది. ఆ లెక్కన మనందరికి ఎంత లాభమైంది? ఇది కేసీఆర్ తెలంగాణ తెచ్చినంక, ప్రాజెక్టులు కట్టినంక సాధ్యమైంది. మనందరి భూముల ధరలు పెరిగినయ్.
అంతట పెరిగినయ్, మన దగ్గర కూడా పెరిగినయ్ అని ఎవరన్న అంటే… దానికి జవాబున్నది. పక్కనే ఉన్న సిరొంచలో చూడండి. అక్కడ భూముల ధరలు పెరుగలే. ఎందుకంటే.. అక్కడ కేసీఆర్ లాంటి పాలకుడు లేడు. అక్కడ ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరానికి నీరు అందివ్వలే. అందుకని అక్కడ భూముల ధరలు పెరుగలే. కాబట్టి తెలంగాణ ప్రజలుగా మనమంతా మనకోసం, మన అభివృద్ధి కోసం పనిచేస్తున్న కేసీఆర్కు మద్దతు ఇవ్వాలె. టీఆర్ఎస్కు అండగా నిలువాలె.
ఈ మధ్య అన్నింటికీ అడ్డంగా మాట్లాడే ఒకడు కొత్తగ మోపైండు. ఎదురుంగ ఉన్నోళ్లను ఇవ్వాళ ఏవారం, రేపు ఏవారం, ఎల్లుండి ఏం పండుగ అని అడిగి, వాటన్నింటికి జవాబులు వచ్చినంక.. ఇగ మీకంతా తెలుసు. సోమారం, మంగళారం తెలిసినంక, పండుగెన్నడో తెల్సినంక ఇంకేం కావాలె. ఇక పండుగలు చేసుకొని పూజలు చేస్తూ బతకండి అంటున్నడు. ప్రాజెక్టులు వద్దట. పొలం పారుడు వద్దట. పంటలు పండుడు వద్దట. ఇదేం రాజకీయం. ప్రజల ఆకలి గురించి, సాగు నీరు గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడుమంటే.. పండుగలు చేసుకొని బతుకుమనేటోళ్లు ఈ మధ్య బాగా మోపైండ్లు.
నెత్తి మీద జుట్టు పెంచుకొని అడ్డం పొడుగు బొట్లు పెట్టుకొని డీజేల ముందు దుంకులాడుతూ అదే దేశభక్తి అంటున్నరు. ఇక్కడున్న కొమురం భీం గురించి వద్దట, ఎక్కడో శివాజీ కావాలట. అదే దేశభక్తి అట. ఇదేంది? మన ప్రాంతం పట్టని, ప్రజల కష్టాలు కన్నీళ్లు పట్టనిది దేశభక్తి ఎట్లయితది? ఇలాంటోళ్లు దేశమంత మోపైండ్రు. ప్రజలే ఆలోచించాలె. ఇలాంటోళ్లు తెలంగాణ ఊర్లల్ల తిరుగుతుంటే ఒంటి మీద జెర్లు పారినట్లు ఉంటున్నది. మనం అలాంటి వారికి మన ఊర్లల్ల తావులేదని చెప్పాలె. మనం, మన పిల్లలు అందరూ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలంటే… ఇలాంటి రాజకీయ శక్తులను ఓడించాలె.
ఎప్పుడో మధ్యయుగాలల్ల ముస్లిం రాజులు మన దేశం మీద దాడి చేసి మన గుడులను కూల్చారని, దాన్ని తప్పు అంటున్నం. అప్పుడు బలం ఉన్నోందే రాజ్యం. ఆ కాలం పోయింది. రాజుల కాలం పోయి రాజ్యాంగబద్ధంగా నడుచుకునే ప్రజాస్వామ్యం వచ్చింది. మనుషులంతా కలిసి మెలిసి బతికే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నం. పాత కతలు చెప్పి ఇప్పుడు కూడా అదే రీతిన ప్రవర్తిస్తామంటే.. వానికి మనకు తేడా ఏంది? మనం కూడా వాని లెక్క తప్పు చేస్తమా! చేయం, చేయకూడదు.
మతమేదైనా మనుషులంతా కలిసిమెలిసి ఉండాలని, సర్వమత సమానత్వమే మా మతమని, ప్రపంచ జనులంతా సహోదరులని చెప్పిన స్వామి వివేకానందుని మార్గం మనది. అమెరికా నగరం షికాగోలో వివేకానందుని ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో స్ఫూర్తి పొంది.. మన దేశం వచ్చి సాధువులుగా మారి న ఘనకీర్తి మనది. అలాంటి వారసత్వాన్ని మంట గలిపే చర్యలు నేడు జరుగుతున్నయి. దేశవ్యాప్తంగా, మన దగ్గరా మతాల మధ్య మంటలు రేపేందుకు ప్రయత్నిస్తున్నరు. అలాంటి శక్తులు ఎవరో అందరికీ తెలుసు. ఈ మధ్యన కేసీఆర్ చాలా బాధతో ఒక విషయం చెప్తున్నరు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను తెర్లు చేసే కుట్రలు సాగుతున్నయని, వాటిని ఓడించాలని అంటున్నరు. అలాంటి వారిని ఓడించాలంటే… ఇక్కడ ఓడిస్తే సరిపోదు. దేశవ్యాప్తంగా ఓడించాలె. దానికి ప్రతి ఒక్కళ్లం సైనికుల లెక్క కదలాలె. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది.
చివరగా.. మనం ఈ కృతజ్ఞత సభ ఎందుకు పెట్టుకున్నమో చెప్త. 2014కు ముందు నాలుగైదేండ్ల కింద తెలంగాణ ఊరు గోస ఇట్ల ఉండె…
‘పిట్ట బుర్రు మెట్టపొలం-గట్టు ఉలికి పడుతాంది అలికిడైతె నీ అడుగుల-సప్పుడే ఇనవడ్తాంది దుక్కుల నోచని చెల్క-పట్టన పగిలింది కొడుకా…ఇల్లు చిన్నబోయింది కొడుకా… పల్లె మూగబోయింది బిడ్డా…. కన్నీటి ఊటలూరి- మోట మూగబాయె కొడుకా’…
అంటూ పల్లెల గోస చెప్పుకొన్నం. ఇప్పుడు పల్లె ఎట్లుందో చూస్తున్నం. పల్లె పచ్చగైంది. పంట రాసులు పెరుగుతున్నయ్. ఇది గుర్తెరిగి నడుచుకోవాలి. మన వరకు మనం మంచిగనే ఉన్నం కదా అని చేతులు ఒళ్లె బెట్టుకొని కాళ్లుజాపుకొని కూసుంటే కుదరదు. మనం మన చుట్టూ ఉన్న వారందరినీ చైతన్యం చేయాలె. మతవాద శక్తులకు మన ప్రాంతంలోనే కాదు, దేశంలోనే తావులేదని చాటిచెప్పాలె’.