గవర్నర్ తమిళిసై తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. గవర్నర్ వెళ్లి కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం ముమ్మాటికీ రాజ్యాంగాన్ని కాలదన్నటమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదని గవర్నర్ చెప్తున్నారని, మరి.. గవర్నర్ మాటలకు ప్రొటోకాల్ వర్తించదా? అని ప్రశ్నించారు. గవర్నర్ ఓపెన్గా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయొచ్చా? తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పతనమయ్యేదని అనొచ్చా? అని ప్రశ్నలు సంధిస్తూ వీడియో విడుదల చేశారు. గవర్నర్ తీరుపై అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
గవర్నర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రోజూ ఘర్షణ జరుగుతున్నది. రాజ్యాంగం ఇచ్చిన అధికారం ప్రకారమే పనిచేస్తున్నానని గవర్నర్ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తున్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించినప్పటి నుంచి ఈ పంచాయితీ జరుగుతున్నది. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ ప్రతిపాదించింది. కానీ గవర్నర్ దాన్ని అడ్డుకొన్నారు. ఎందుకు ఆపారని అడిగితే, సేవా కార్యక్రమాల కోటాలో కౌశిక్ రెడ్డి పేరు ప్రతిపాదించారని, కానీ ఆయన సేవా కార్యక్రమాలు చేసినట్టు తనకు కనిపించలేదని చెప్తున్నారు. కానీ, హుజూరాబాద్లో టీఆర్ఎస్ ప్రత్యర్థి అయిన బీజేపీ ప్రయోజనాలకు గవర్నర్ ఉపయోగపడ్డారనే విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఎన్నిక తర్వాత ప్రతిపాదించిన మధుసూదనాచారి పేరును మాత్రం ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. అంటే కౌశిక్ రెడ్డి పేరును కావాలని ఆపినట్టే కదా? ఎన్నికలను బట్టి గవర్నర్ వైఖరి మారుతుందా?
కేటీఆర్ ప్రశ్నకు సమాధానమేది?
కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నేత. అతన్ని సేవా కోటాలో ఎమ్మెల్సీగా ఎలా నియమిస్తారని గవర్నర్ ప్రశ్నిస్తున్నారు? మరి బీజేపీ నాయకురాలిని గవర్నర్గా ఎలా నియమిస్తారు? కేటీఆర్ కూడా ఇదే ప్రశ్న అడిగారు. మౌలికమైన ప్రశ్నే కదా? సమాధానం చెప్పాల్సిన ప్రశ్నే కదా? అంటే గవర్నర్కు రాజకీయ నేపథ్యం ఉండొచ్చు కానీ గవర్నర్ కోటాలో నామినేట్ చేసే వ్యక్తికి మాత్రం రాజకీయ నేపథ్యం ఉండొద్దా? గవర్నర్గా ఎంపిక కావడానికి తమిళిసై ఏమైనా రాజ్యాంగబద్ధమైన అంశాలపై పరిశోధనలు చేశారా? రాజ్యాంగ నిపుణురాలా? న్యాయశాస్త్ర కోవిదురాలా? కాదు కదా. ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా రాజకీయ నేపథ్యం ఉండి.. గవర్నర్ కాగలినప్పుడు, టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కాలేడా?
గవర్నర్ తీరుపై ప్రశ్నలెన్నో?
ఎమ్మెల్సీ ప్రతిపాదనను ఆపే అధికారం నాకు ఉంది కదా! అని గవర్నర్ అంటున్నారు. అయితే, ఆమె తన అధికారాలను ఉపయోగించిన తీరు.. కొన్ని ప్రశ్నలను లేవనెత్తేలా ఉన్నది. సమస్యంతా అక్కడే. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కావాలి. కానీ రాజ్యాంగం ప్రకారం ఏడాదిలో జరిగే తొలి సమావేశాన్ని గవర్నర్తో ప్రారంభించాలి. కొత్తగా సభ ఎన్నికైనప్పుడు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించాలి. కానీ గతంలో జరిగిన సభను వాయిదా వేశారు. అంటే సాంకేతికంగా గవర్నర్ను పిలవాల్సిన అవసరం లేదు. సాంకేతిక అంశాలను ఉపయోగించుకొనే హక్కు గవర్నర్కు ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ అంశాలను ఉపయోగించుకొంటుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేది రాజకీయ పార్టీ. అలాంటప్పుడు తన రాజకీయ అవసరాల కోసం సాంకేతిక అంశాలను ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తుంది.
గవర్నర్కు ప్రొటోకాల్ ఉండదా?
రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని, ప్రొటోకాల్ పాటించలేదని గవర్నర్ అంటున్నారు. మరి.. గవర్నర్ కూడా ప్రొటోకాల్ పాటించాలి కదా. ఓపెన్గా రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడొచ్చా? ప్రొటోకాల్ కేవలం రావడం, రిసీవ్ చేసుకోవడం, సెండాఫ్ వరకే పరిమితం కాదు కదా? ప్రొటోకాల్ మాటలకు కూడా ఉంటుంది. సుప్రీం కోర్టు జడ్జీలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూడదనేది ప్రొటోకాల్. వాళ్లు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ వివాదంలోకి ఎక్కువ దూరం వెళ్తే గవర్నర్ ఇన్స్టిట్యూషన్ మారి పొలిటికల్ అయ్యే ప్రమాదం ఉన్నది.
వందశాతం రాజ్యాంగ విరుద్ధమే
గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే రాష్ట్రపతికే నివేదించాలి. అంతేకానీ, కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడమేమిటి? అసలు హోంమంత్రి ఎవరు? రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి హోంమంత్రితో ఏం పని? గవర్నర్ హోంమంత్రికి ఫిర్యాదు చేయడం వంద శాతం రాజ్యాంగ విరుద్ధమే. వాదనలు పెట్టుకోవడానికి రాజ్భవన్.. వేదికేం కాదు.
–ప్రొ. కే నాగేశ్వర్