దేశంలో ప్రజాస్వామ్యం పరిహాసమవుతూ, రాజ్యాంగ విలువలకు విఘాతం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా పునర్నిర్వచించడానికి, ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి తెలంగాణ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలని సంకల్పించింది. తన నేలపైనే తాను పరాయిగా చిత్రవధకు లోనైన తెలంగాణ తల్లి తన సిగలో తంగేళ్లు తురిమిన బిడ్డ కేసీఆరే భరతమాత సిరుల కురులను సవరించాలని తలపోస్తున్నది.
పాశవికమైన పద్ధతులతో పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్న కేంద్ర పాలకవర్గంపై, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో సైతం విఫలమై వెలవెలబోతూ.. వెనకడుగు వేస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయాన్ని తెలంగాణ రచిస్తున్నది. మేధావుల మౌనం వల్ల సమాజానికి జరగబోయే కీడును గుర్తెరిగిన తెలంగాణ మరోసారి బీఆర్ఎస్ రూపంలో పొలికేక పెడుతున్నది. తెలంగాణ తెలివిని, కేసీఆర్ తెగువను తెలిసినవారంతా దేశవ్యాప్తంగా ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షుభిత సంధికాలాన్ని తన శక్తియుక్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో కేసీఆర్ మాత్రమే ఎదుర్కొనగలడని బలంగా విశ్వస్తున్నారు. బలమైన రాజకీయ, మేధోపరమైన సమీకరణలు జరుగుతున్న తీరే అందుకు నిదర్శనం. భవిష్యత్తులో ఈ దేశ సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో ఆవిష్కారం కానున్న ప్రకంపనలను అంచనా వేసే పనిలో ప్రపంచం ఉన్నది. ఈ తరుణంలో తరతరాలుగా ఒక రాజకీయ పాఠశాలగా తెలంగాణ ఈ దేశానికి దిశానిర్దేశం చేస్తున్న తీరును అవలోకించుకోవాలి.
కాకతీయుల కళాప్రభను దేదీప్యం చేసిన తెలంగాణ అదే రీతిలో కులీ కుతుబ్షాహీలను సమున్నతంగా నిలిపింది. బుద్ధం.. శరణం.. గచ్ఛామి.. అంటూ వచ్చిన బౌద్ధ ధర్మాన్ని అక్కున చేర్చుకున్న తెలంగాణ కార్మిక, కర్షక, శ్రామికుల అరుణ పతాకాన్నీ తన భుజాలపై మోసింది. భూమి కోసం, భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం బక్కపలుచని తెలంగాణ సమాజం సలిపిన సాయుధ పోరుకు, అర్పించుకున్న రక్తానికి, కార్చిన కన్నీళ్లకు యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచ ప్రజా పోరాటాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోజ్వల ఘట్టాన్ని నిర్మించింది తెలంగాణే. వంశపారంపర్యంగా వేలాది ఎకరాల భూమి కలిగిన జమీందార్లు, జాగీర్దార్లు ఉదారంగా పేద ప్రజలకు వితరణ చేయడానికి వచ్చిన భూదానోద్యమానికి వినోభాబావే ఆలోచనలకు పురుడుపోసి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం విస్తరించడానికి కారణభూతమైంది ఈ తెలంగాణ గడ్డనే.
‘నీళ్లు, నిధులు, నియామకాల’ కోసం జరిగిన తొలి, మలి తెలంగాణ ఉద్యమాల రూపశిల్పి తెలంగాణ పాఠశాల. చుక్క నెత్తురు పారకుండా తెలంగాణ బీడు భూముల్లోకి గోదావరి, కృష్ణా జలాలను మళ్లించి మహోజ్వల ప్రజా ఉద్యమం మలిదశ తెలంగాణ పోరాట నాయకత్వాన్ని నెరిపిన ధీరోదాత్త గడ్డ తెలంగాణే. సాయుధ పోరాట అనుభవాలు, ధ్వంసరచన నినాదాలతో తెలంగా ణ రాదని శాంతియుత, రాజకీయ మార్గాన్నే తెలంగాణ సాధించగలమనే విశ్వాసాన్ని ప్రజల్లో నింపారు ఉద్యమ సారథి కేసీఆర్. ఆత్మవిశ్వాసం తో అడుగులు వేస్తూ తన వెంట మూడున్నర కోట్ల గొంతులను తన గొంతుకగా మలచి.. తను నిలిచి తెలంగాణను గెలిపించిన సమర్థ నాయకత్వాన్ని అందించిన ప్రయోగాల పాఠశాల తెలంగాణ.
ఇప్పుడు దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నది. ప్రపంచ దేశాల మధ్యన అన్నిరంగాలు బిక్కుబిక్కుమంటూ బెంగటిల్లుతున్నాయి. అడుగడుగూ సజీవ ధారలు నెలవైన భారతావని తనను తాను సముద్రం పాలుచేసుకుంటున్నది. మతమే హితమై ప్రవచించాల్సిన చోట కుట్రలు కత్తుల కోలాటమాడుతున్నాయి. సకలజనుల సర్వహితాన్ని కాంక్షించే ప్రజాస్వామిక విలువలు వలువలుగా ఊడుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు స్వార్థపరశక్తులు, కార్పొరేట్ల వశమవుతున్నాయి. నైతిక విలువలపై భౌతికదాడులు.. భౌతికరూపాలపై వికృతచేష్టలు వెరసి భారతావని బయటికి కనిపించినంత నిర్మలంగా లేదు, నిమ్మలంగానూ లేదు. ఈ స్థితిని మార్చి.. ఈ దుస్థితిని కడతేర్చేందుకు తెలంగాణ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలంగాణను వెలిగించిన ఆర్తితో దేశాన్ని గెలిపి స్తా… దేశ్ర పజలూ గెలిచేలా చేస్తా అనే ఆత్మవిశ్వాసంతో బయల్దేరాడు కేసీఆర్. విజయోస్తు…
ఎస్.కె.అబ్దుల్ నబీ
98495 05517