Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉండటమే అందుకు ప్రధాన కారణమనేది జగమెరిగిన సత్యం. కేంద్రపాలిత ప్రాంతమైనప్పటికీ ఢిల్లీలోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే పాలన కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు వంతులవారీగా కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తూ వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. ఢిల్లీలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, దేశ రాజధానిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తుంటాయి. 2013కు ముందువరకు ఆ పార్టీలు అనుకున్నట్టే జరిగింది. కానీ, ఆప్ రాకతో పరిస్థితి మారిపోయింది.
ఆ పార్టీ మూలంగా దేశ రాజధానిలో రెండు జాతీయ పార్టీల ప్రభావం తగ్గుతూ వచ్చింది.విజ్ఞులైన ఢిల్లీ ఓటర్లు ఆదరించడంతో వరుసగా గెలుస్తూ వచ్చిన ఆప్.. అనతికాలంలోనే పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్ తదితర రాష్ర్టాలకు విస్తరించింది. బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదుగుతూ వస్తున్నది.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మందీమార్బలాన్ని ఆ పార్టీ రంగంలోకి దించింది. 50కు పైగా స్థానాల్లో గెలుస్తామని ఊదరగొట్టింది. కానీ, ఆ ఎన్నికల్లో కమలం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆప్ ఏకంగా 62 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత పంజాబ్లోనూ ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. గోవా, గుజరాత్లలో ఓట్లు, సీట్లు సాధించి జాతీయ పార్టీగా అవతరించింది.
ఆప్ దినదినాభివృద్ధి చెందుతుండటం బీజేపీకి మింగుడుపడటం లేదనేది బహిరంగ రహస్యమే. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్ వల్ల నష్టం జరగకుండా రాజకీయంగా భారీ కుట్రలకు తెరలేపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఢిల్లీ పరిపాలనకు సంబంధించిన చట్టాలను మారుస్తూ ఆర్డినెన్సు జారీచేయడం, మత ఘర్షణలను ప్రేరేపించడం, కేజ్రీవాల్పై హిందూ ద్రోహి అనే ముద్ర వేయడం, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చాలని చూడటం లాంటివన్నీ అందుకు నిదర్శనాలు. ఈ కుట్రలకు 2020 ఎన్నికల తర్వాత తెరలేచింది. అందులో భాగంగానే కరోనా సమయంలో ఆప్ నేతలపై దర్యాప్తు సంస్థల దాడులు మొదలయ్యాయి. నయానో, భయానో ఆప్ శాసనసభ్యులను తమవైపు లాక్కోవాలని బీజేపీ ప్రయత్నించింది. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్వయానా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సైతం ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
గత కొన్నేండ్లుగా దర్యాప్తు సంస్థలు ఆప్ నేతలపై దాడులను తీవ్రతరం చేశాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు జైలులో ఉన్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకూడదనే ఉద్దేశంతోనే ఇదే అదనుగా భావించి ఆయనను అదుపులోకి తీసుకున్నారనేది అందరికీ తెలిసిందే.
ఢిల్లీలో భూమి, శాంతిభద్రతలు మినహాయించి మిగిలిన పాలనాపరమైన విధులన్నీ అక్కడి ప్రజాప్రభుత్వమే చూసుకుంటుంది. 2023లో ఈ అధికారాలను చేజిక్కించుకోవాలనే దురుద్దేశంతో కేంద్రం ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు తీసుకొచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్కు ఎక్కువ అధికారాలను కట్టబెడుతూ.. ఢిల్లీ ప్రభుత్వమంటే ఎల్జీ అన్నట్టుగా ఆర్డినెన్సును రూపొందించింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ ఆర్డినెన్స్ను పార్లమెంట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆప్ను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. ఇటీవల రిటర్నింగ్ అధికారిని అడ్డం పెట్టుకొని ఛండీగఢ్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకున్నది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి, ఆప్ అభ్యర్థినే విజేతగా ప్రకటించింది.
రాజకీయ కుట్రలో భాగంగానే సరైన ఆధారాలు లేనప్పటికీ దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి కేంద్రం ఉసిగొల్పుతున్నది. విపక్ష పార్టీల బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడం, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడమే అందుకు నిదర్శనం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఇటువంటి చర్యలను బీజేపీ మానుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆందోళనలు తలెత్తడం ఖాయం. రాష్ట్ర హోదా కోసం ఇప్పటికే లద్ధాఖ్లో నిరసనలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ప్రజా ప్రభుత్వాల ఏర్పాటు దిశగా కేంద్రం చర్యలు ఉండాలే తప్ప ఇలా పెత్తనం చెలాయించాలని చూడటం సరికాదు.
-కన్నోజు శ్రీహర్ష
89851 30032