Deeksha Divas | చరిత్రకు కాలం భూమిక. కాలంతోపాటు జరిగేవన్నీ గుర్తుండాల్సిన పనిలేదు. కలకాలం నిలిచిపోయే విషయాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. అరుదైన త్యాగాలను, విలువైన జ్ఞాపకాలను సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది. అలా తరగని చరిత్రలో చెరగని పుటలతో మరపురాని అధ్యాయంగా నిలిచిపోయింది మన తెలంగాణ. ఈ మరువలేని అధ్యాయాల్లో ఒకటి మలిదశ ఉద్యమమైతే, మరొకటి దీక్షా దివస్, ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం. మలి దశ ఉద్యమంతో అవతరించిన తెలంగాణ రాష్ట్రం ఇటీవలే దశాబ్ది వేడుకలు జరుపుకొన్నది. పదేండ్లలోనే ప్రగతి పర్వాన్ని ఆవిష్కరించింది. రంగమేదైనా తెలంగాణ మాడల్ ఇప్పుడు దేశానికి ఆదర్శం. సంక్షేమంలో మనకు సాటిగా నిలిచే మేటి రాష్ట్రం మరొకటి లేదు. పురోగతిలో మనతో పోటీకి దిగేపాటి ధైర్యం మరెవరికీ లేదు.
నేటి విజయానికి నాంది 22 ఏండ్ల కిందట మొదలైంది. ప్రత్యేక రాష్ట్ర సాధనే తల్లి తెలంగాణను ప్రత్యేకంగా నిలబెడుతుందని నిండుగా నమ్మిన వ్యక్తి కేసీఆర్. ఏ వికల్పాలకూ తావివ్వని ఈ ఉద్యమనేత సత్సంకల్పానికి కాలం కూడా సలాం చేసింది. ఊరూవాడను కదిలించింది. పల్లెనూ, పట్నాన్నీ కలిపింది. పిడికిలి బిగించిన ఉద్యమ యోధుడి వెంట యావత్ తెలంగాణ కదిలింది. మన సంపదపై విశృంఖల దోపిడీని, మన అవకాశాలను తన్నుకుపోతున్న విధానాలను, మన నీళ్లను తరలించుకుపోతున్న విపరీతాలను, మన భాష యాసలపై ఎక్కుపెట్టిన వికృత వైఖరులను ప్రశ్నించింది. ఎదురుతిరిగింది. పుష్కర కాలం ఉద్యమ తపస్సు ఫలితం పదేండ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.
పుట్టకముందే తెలంగాణపై కత్తికట్టారు. పొత్తిళ్లనాడూ చిత్తుచేసే ఎత్తులు వేశారు. ముక్కుపచ్చలారని బిడ్డను పురిట్లోనే నులిమేసే ప్రయత్నాలు చేశారు.
పాలుగారే పసికందు రాష్ట్రంపై ఢిల్లీ పెద్దలకూ శీతకన్నే! పోరాటాల తెలంగాణ ఆరాటం ఆర్చేదెవరు? మళ్లీ కేసీఆరే! సిద్ధించిన రాష్ర్టాన్ని ఉద్ధరించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు.. తెలంగాణ ఎలా ఉండేది? నిండుకున్న చెరువు, వట్టిపోయిన వాగు, పూడుకుపోయిన కాల్వ, బీడువారిన పొలం.. తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే కదా దృశ్యం! నిండా బాలారిష్టాలతో పుట్టిన బిడ్డను తండ్రిలా కాపాడుకొచ్చాడు కేసీఆర్. పదేండ్ల ప్రయాణంలో అనేక అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. తరాలుగా ఇక్కడ జీవనదులు పారుతున్నా గొంతు తడుపుకోలేని దుస్థితి నుంచి.. జలభాండంగా మారింది తెలంగాణ. పంటకోసం తెచ్చిన పురుగు మందును పాయసంగా తాగిన అన్నదాతల గాథలు ఆనాటి సంగతి. సాలుకు పదివేలు అందుకుంటూ పండించిన పంటతో పరమాన్నం చేసుకుంటున్న తీరు ఈనాటి అనుభవం. నేసిన నూలు పోగులనే ఉరితాళ్లుగా గొంతుకు బిగించుకున్న నేతన్నల బలవన్మరణాలు ఆగిపోయాయి. ఒకటేమిటి.. నేటి తెలంగాణ అనేక రంగాల్లో అనంత వేగంతో దూసుకుపోతున్నది.
పద్నాలుగు ఏండ్ల క్రితం మన తెలంగాణ తేజం కేసీఆర్… దీక్షబూని ఉండకపోతే..? దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర స్వప్నం సాకారమయ్యేదా! ఈ రోజు మన ఆత్మగౌరవం విశ్వ యవనికపై రెపరెపలాడేదా! ఇంతటి అభివృద్ధి సాధ్యమయ్యేదా? ముందే చెప్పినట్టు మన తెలంగాణను చరిత్ర నిశితంగా పరిశీలిస్తున్నది. దశాబ్దిగా ఇక్కడ సాగుతున్న పాలనను నిక్కచ్చిగా గమనిస్తున్నది. అసత్యాన్ని ఆమడదూరం పెట్టే చరిత్ర.. సత్యాన్ని ఆత్మీయంగా స్వీకరిస్తుంది. ఇక్కడ సంక్షేమం సత్యం. ప్రజల సౌభాగ్యం సత్యం. అన్నివర్గాల ప్రజలూ సంతోషంగా ఉన్నారన్నది సత్యం. ఆసరా సత్యం, భరోసా సత్యం. అభివృద్ధి సిసలైన సత్యం. సంక్షేమం సాటిలేని సత్యం. అందుకే, చరిత్ర ఈ దశాబ్దిని తెలంగాణకు అంకితమిచ్చింది. అయితే యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.
60 ఏండ్లపాటు స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను వాడుకొని, ఈ ప్రాంతాన్ని అశాంతిలో ముంచి, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసి, వందలమంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన శక్తులు ఇప్పుడు మళ్లీ ఉమ్మడి ఎజెండాతో మూకుమ్మడి దాడికి దిగాయి. ఈ కుట్రలను ఛేదించాల్సిన అవసరం ప్రతి తెలంగాణ బిడ్డపైనా ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, రాజ్యాంగబద్ధంగా, సామాజికంగా ప్రపంచ పటంలో తెలంగాణను ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ కేసీఆర్. ఆయన ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29ని అంటే ఈ రోజుని తెలంగాణ ప్రజానీకం దీక్షా దివస్గా జరుపుకుంటున్నది. దీంతో పాటే మనముందు మరో కర్తవ్యం కూడా నిలిచిఉంది. నవంబర్ 30న తెలంగాణకు ఒక పరీక్షా సమయం… అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఎదురుపడుతున్నది. రేపు మనం ఎవరికి వాళ్లమే దాన్ని తెలంగాణ దీక్షా దివస్గా భావించి రాష్ట్ర ప్రగతికి సంకల్పం పూనాలి. నేటి మన ఓటును మనకోసం, రేపటి మన భవిష్యత్తు కోసం తెలంగాణ ఉజ్వల భవితవ్యం కోసం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. మనకై దీక్షబూనిన మన నాయకుడి కోసం, తెలంగాణ దీక్ష చేపట్టడానికి మించిన కృతజ్ఞత ఏముంటుంది.!
Editor Sir