Inflation | శక్తికాంతదాస్ నాయకత్వంలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ మధ్య ఒక కొత్త నివేదిక వెలువడింది. ఈ నివేదికను తయారుచేసిన బృందానికి దేబబ్రత పత్ర అనే రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ నాయకత్వం వహించారు. అయితే ఈ పత్రంలోని అభిప్రాయాలు, ఆ రచయితలవి మాత్రమేననీ, రిజర్వ్బ్యాంక్కు వాటితో సంబంధం లేదనీ ఆర్బీఐ వక్కాణించింది. బహుశా, ఆ నివేదికలోని అభిప్రాయాలతో దూరంగా ఉండక తప్పని స్థితి రిజర్వ్ బ్యాంకుది. ఎందుకంటే, ఆర్థికశాస్త్ర రచన, రంగంలో కూడా ప్రస్తుతం ఈ నివేదిక పేర్కొన్న అంశాలు సరికొత్తవి, అసాధారణమైనవి…! ఆర్థిక అంశాల గురించిన ఏ మాత్రం ఇంగితం ఉన్న వారికైనా ఈ పత్రం తాలూకు నిర్ధారణలు ఆశ్చర్యాన్ని, అయోమయాన్ని కలిగిస్తాయి. ఇంతకూ, ఈ నివేదిక తాలూకు ప్రధాన నిర్ధారణ లేదా సూత్రీకరణ ఏమిటి..! అది: దేశంలోని ప్రస్తుత ద్రవ్యోల్బణ స్థితి, వ్యక్తిగత వినియోగాన్ని దెబ్బతీస్తున్నది. దాని ఫలితంగా కార్పొరేట్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. దానివల్ల కొత్త పరిశ్రమల స్థాపన దిశగా ప్రైవేటు పెట్టుబడులు ముందుకురావడం లేదు. (అంటే ఇదొక రకమైన మాంద్య స్థితి)! సూత్రీకరణ బాగానే ఉంది. అయితే ఇక్కడ గుడ్డు ముందా? పిల్ల ముందా? అనేదానితో పాటుగా అసలు ద్రవ్యోల్బణం పెరుగుదల గురించిన సంప్రదాయక సిద్ధాంతం ఏం చెప్తున్నది? అనేవి ప్రధాన ప్రశ్నలు.
వాస్తవానికి ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల అనేది మార్కెట్లో డిమాండ్ పెరుగుదల తాలూకు లేదా డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటం తాలూకు స్థితికి ప్రతిబింబం. ఈ డిమాండ్ పెరుగుదల అనేది ఉదాహరణకు మన దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగిన సందర్భాల్లో గమనించవచ్చు. ఈ సందర్భంలో, వేతనాల పెరుగుదల అనేది మార్కెట్లో డబ్బు సరఫరాను అంటే మరో రకంగా కొనుగోలుశక్తిని లేదా డిమాండ్ను పెంచుతున్నది. ఫలితంగా, మార్కెట్లో ధరల పెరుగుదల కూడా దీన్ని అనుసరించి వస్తుంది. అలాగే, సరఫరాల కొరత ఉన్నప్పుడు కూడా ధరల పెరుగుదల ఉంటుంది. దీనికి కారణం సరఫరాల స్థాయి డిమాండ్ కంటే తక్కువ స్థాయికి దిగజారడం. కానీ నేడు దేశంలో గత అనేక దశాబ్దాలుగా సరఫరాల కొరత తాలూకు స్థితి లేదు. హరిత విప్లవం అనంతర కాలంలో దేశంలో దరిదాపు అన్ని ఆహార పంటలూ సమృద్ధిగా పండుతున్నాయి. వంట నూనెలు, పప్పు ధాన్యాలు వంటి కొన్నిరకాల ఆహార పదార్థాలను మాత్రమే మనం దిగుమతి చేసుకుంటున్నాం. నిజానికి, 1991లోని సంస్కరణలకు ముందుకాలంలో వంట నూనెలలో కూడా మనం చాలా మేరకు సమృద్ధిని సాధించిన స్థితిని చేరుకోగలిగాం. కాబట్టి, నేటి ధరల పెరుగుదల వెనుకన ఉన్నది సరఫరాల కొరత అనేది కాదు. అలాగే, ఆశ్చర్యకరంగా ఈ ధరల పెరుగుదల వెనుక డిమాండ్ పెరుగుదలా లేదు..! మరి వాస్తవ స్థితి ఏమిటి?
నేటి వాస్తవ స్థితి 2018 చివరినాటికే 45 ఏండ్ల గరిష్ఠ స్థాయిలో నిరుద్యోగం 7.1 శాతంగా ఉండటం… 2018 ఆరంభం నుంచీ మొదలుకొని దేశీయ స్థూల జాతీయోత్పత్తి కొవిడ్ ముందరి త్రైమాసిక కాలం వరకూ నిరవధికంగా పడిపోతూనే ఉండటం… నేడు దేశంలో 22 కోట్ల మంది, చదువుకు తగిన ఉద్యోగం లేక, ఎదురుచూపులు చూస్తూ ఉండటం.
మరోపక్కన ఐటీరంగం వంటి మంచి వేతనాల రంగంలో కూడా నేడు ఉద్యోగాలపై వేటు పడుతూ ఉండటం… అంతర్జాతీయ మాంద్య స్థితి వల్ల దేశీయ ఎగుమతులు రోజురోజుకూ దిగజారుతూ ఉండటం… ఇలా, ఏరకంగా చూసినా దేశంలో నేడు కొవిడ్ ముందరా, అనంతర కాలంలో కూడా ప్రజల ఆర్థిక స్థితిగతులు ఏ మాత్రం బాగాలేవు. అంటే దీనర్థం ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోయి ఉంది. ఫలితంగా మార్కెట్లో డిమాండ్ లేదు.
మరి ఇటువంటి డిమాండ్ దిగజారిన, మరోరకంగా చెప్పాలంటే ఎంతో కొంత మాంద్య ఆర్థికస్థితిలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? నిజానికి, ఈ డిమాండ్ దిగజారిన స్థితిలో ప్రతి ద్రవ్యోల్బణం లేదా ధరల పతనం జరుగుతాయి. అదీ విషయం! మరి, వాస్తవం ఇది. అంటే, నేడు దేశంలో డిమాండ్ దిగజారిపోయి, దానివల్ల మాంద్య స్థితి ఏర్పడింది. అయితే, మన రిజర్వ్బ్యాంక్ వారు మాత్రం ఈ మంద గమనానికి… ఫలితంగా ప్రైవేట్ పెట్టుబడులు లేకపోవడానికి కారణంగా ద్రవ్యోల్బణ భూతాన్ని చూపిస్తున్నారు. ఇదెలా సాధ్యం? ఆర్థికవ్యవస్థలో కొరతలు లేనప్పుడు ద్రవ్యోల్బణం అనేది వాస్తవానికి ఎంతో కొంత ప్రజల స్థితి బాగుండటాన్ని, డిమాండ్ బాగుండటాన్నే సూచిస్తుంది. 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల ఏర్పడిన విషయం నిజమే. అయితే, ఈ ధరల పెరుగుదల ప్రధానంగా గోధుమలు, ముడిచమురు, ఎరువులు వంటి ఉత్పత్తుల విషయంలో కేంద్రీకృతమై ఉంది. కాగా, మన దేశంలో మనం గోధుమల విషయంలో స్వయం సమృద్ధిని కలిగి ఉన్నాం. అదేకాదు, నిజానికి ఈ యుద్ధకాలంలో ప్రపంచంలోని పలు దేశాల్లో గోధుమల కొరతకు పరిష్కారంగా మన దేశం గోధుమలను ఆయా దేశాలకు సరఫరా చేసింది. కాబట్టి, గత ఏడాది కాలంలో దేశీయంగా గోధుమల ధర సుమారు 22 శాతంపైన పెరిగిన కారణం కొరతలు కాదు. కేంద్ర ప్రభుత్వం దేశీయ అవసరాలను కూడా చూసుకోకుండా శృతిమించిన స్థాయిలో విదేశాలకు గోధుమల ఎగుమతిని అనుమతించడం దీనివెనుక ఒక ప్రధాన కారణం. అలాగే, ఇక ముడిచమురు విషయంలో యుద్ధం ఆరంభమైన తొలి దశలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినా, మన దేశం మాత్రం రష్యా నుంచి సుమారు 30 శాతం డిస్కౌంట్తో చమురును పొందగలిగింది. ఇప్పటికీ, మనకు రష్యా నుంచి అంతర్జాతీయ ధర కంటే తక్కువ స్థాయికే ముడిచమురు లభిస్తున్నది. అంటే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండి, దాని ప్రభావం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనేదానికి ఆస్కారం లేదు. రష్యా నుంచి చౌకధరకే ముడిచమురు దొరికినా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న ఎక్సయిజ్ సుంకం, సెస్లు, సర్చార్జీల భారం ఇప్పటికీ భారీగానే ఉండటం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి కారణంగా ఉన్నది. దీని ఫలితంగా రవాణా చార్జీలు, వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయాలు తదితరాలు పెరిగిపోయి అది ధరల పెరుగుదలకు కారణమవుతున్నది.
అలాగే, గత కొన్నేండ్లుగా మన ప్రభుత్వం పెద్ద స్థాయిలో బియ్యాన్ని కూడా విదేశాల కు ఎగుమతి చేస్తున్నది. ఫలితంగా ఇది దేశీ య ధరల పెరుగుదలకు కారణమైంది. ఇక, తిండి గింజలతో పాటుగా, పాలు, పెరుగు, మజ్జిగ, మాంసం, చేపలు ఇత్యాది ఆహార పదార్థాలపై కూడా ప్రభుత్వం జీఎస్టీ విధించడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా ఉన్నది. అలాగే, దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ధ్వంసం చేసేయడం వల్ల కూడా మార్కెట్లో ప్రైవేటు వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతూ, ధరలు పెరిగిపోతున్నాయి.
కొన్నేండ్ల కిందట అమల్లో ఉన్న కనీస నిల్వల చట్టం వంటి దాన్ని రద్దు చేయడం వల్ల కూడా నేడు దేశంలో ధరలు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో, ఒక స్థాయికి మించి నిత్యావసరాలను నిల్వ ఉంచరాదంటూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కొద్దిమేర ఈ ధరలు తగ్గాయి. కానీ, వాస్తవ ధరల పెరుగుదల విషయంలో పెద్దగా తేడా లేదు.
అంటే, నేడు దేశీయంగా నిత్యావసరాల ధరల పెరుగుదల స్థితి ఉన్నది. కానీ ఆ స్థితికి కారణం డిమాండ్ అధికంగా ఉండటం కాదు. అలాగే, నిత్యావసరాల ఉత్పత్తుల కొరత కూడా దానికి కారణం కాదు. కాబట్టి డిమాండ్ సరఫరాలకు సంబంధించిన ఏ లోటుపాట్లూ ఈ ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణానికి అసలు కారణాలు కాదు. అసలు కారణాలు, సంస్కరణల పేరుతో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు. ఈ విధంగా నేటి డిమాండ్ లేనికాలంలో ధరల పెరుగుదల అనేది మూలిగే నక్కపై తాటికాయలా.. మరింతగా డిమాండ్ పతనానికి కారణమవుతున్నది. రిజర్వ్ బ్యాంక్ వారి నివేదిక ఈ తర్కంలోని ధరల పెరుగుదల దగ్గర నుంచే అసలు సమస్య మొదలైనట్టుగా చిత్రీకరిస్తున్నది. నిజానికి, ధరల పెరుగుదల తాలూకు ఒక యాదృచ్ఛిక ఫలితంగా మాత్రమే డిమాండ్ పతనమవుతుందనే అంశాన్ని ఈ నివేదిక దాచిపెడుతున్నది. మాంద్య స్థితికి నూటికి నూరు శాతం కారణం డిమాండ్ పతనమే. ఈ డిమాండ్ పతనం వెనుక అనేక కారణాలున్నాయి. డీమానిటైజేషన్ మొదలుకొని, జీఎస్టీ అమలు తీరుతెన్నులూ, సంక్షేమ పథకాలపై కోతలూ ఇత్యాదివన్నీ కలిసి నేడు నిరుద్యోగాన్ని, పేదరికాన్నీ, ప్రజల ఆర్థిక కడగండ్లనూ పెంచేశాయి. ఫలితంగానే మాంద్య స్థితి ఏర్పడింది. ఇలాంటి మాంద్యస్థితిలో కూడా, ధరల పెరుగుదలకు దారితీస్తున్న ప్రభుత్వ విధానాలు ఈ స్థితిని మరింతగా దిగజారుస్తున్నాయనే సంపూర్ణ వాస్తవాన్ని ఈ నివేదిక పూర్వపక్షం చేస్తున్నది.
కాబట్టి, మరి ఈ నివేదిక దానివెనుక ఉన్న ఉద్దేశాలు ఏమై ఉండవచ్చు. బహుశా మనం ఊహించగలిగిన కారణమొక్కటే. అది, రిజర్వ్బ్యాంక్ ఇంకా ముందుముందు కూడా కొంతకాలం పాటు వడ్డీ రేట్లను పెంచదలచుకున్నది. దానివల్ల దేశీయంగా ప్రజల కొనుగోలుశక్తి లేదా డిమాండ్ మరింత పతనమవుతాయి. కాబట్టి, ఆ వడ్డీ రేట్ల పెంపుదల నిర్ణయాలు కచ్చితంగా ప్రజలకు రుచించవు. అదే కాదు, ప్రజల క్షేమం కోరే ఆర్థిక నిపుణులూ, అనేక కార్పొరేట్లకు కూడా ఇది రుచించేది కాదు. కానీ, ఈ వడ్డీరేట్ల పెంపుదల ఆలోచనకు ప్రస్తుతం ఏదో ఒక సమర్థన కావాలి. కాబట్టి, వడ్డీ రేట్లను పెంచకుంటే ద్రవ్యోల్బణం అధికంగానే ఉండి దానిఫలితంగా మాంద్యం వచ్చేస్తుందంటూ, ఒక అపభ్రంశపు, అబద్ధాల సిద్ధాంతాన్ని ఈ పెద్దమనుషులు వండివార్చారు. ఈ సిద్ధాంతం కేవలం షేర్ మార్కెట్లకు మాత్రమే అనుకూలం. ఎందుకంటే, ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం దేశీయ ప్రజానీకంలోని అత్యధికుల కంటే.. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారులకే అత్యవసరం.
అందుకే, ఈ ద్రవ్యోల్బణం తక్కువగా ఒక నిర్దిష్ట పరిమితిలోనే ఉండాలనే దాన్ని ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులన్నీ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ పేరిట గత కొద్ది దశాబ్దాలుగా అనుసరిస్తున్నాయి. దీని లక్ష్యం, అంతర్జాతీయంగా దేశీయ సరిహద్దులను దాటుకొని వివిధ దేశాల షేర్ మార్కెట్లలోకి వెడుతోన్న విదేశీ సంస్థాగత మదుపుదారుల లాభాలను (కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా) కాపాడటం. అంటే, వారు ఒక దేశంలో పెట్టిన పెట్టుబడి విలువ కాపాడబడాలంటే ఆ దేశం తాలూకు కరెన్సీ విలువ తగ్గకూడదు. మరోరకంగా చెప్పాలంటే ఈ కరెన్సీ విలువ తగ్గుదలే దేశీయంగా ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణంగా ఉంటుంది. అదీ కథ.
ఈ కథలోని ద్రవ్యోల్బణం అదుపులో ఉండవలసిన అగత్యం ఉన్న అసలు కథానాయకుడు అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారుడు. మిగతా ప్రజాహితం ముసుగులు… ద్రవ్యోల్బణం వల్ల డిమాండ్ దిగజారుతుందంటూ మొసలి కన్నీళ్లు… ఇత్యాది మొత్తం మన లాంటి జనం కోసం… మన కండ్లను మన వేళ్లతోనే పొడిచేసుకునేందుకు కావలసిన సాధన సంపత్తి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఇలా సరఫరా అవుతూనే ఉంది. ‘ఉచితాలు’ వద్దంటూ, కార్పొరేట్ల అనుకూల ప్రచార బాధ్యతను, మన మధ్యతరగతి వర్గానికి టాక్స్పేయర్ మనీ పేరిట భుజానికెత్తినప్పుడు… ఉపాధి హామీ పథకం వల్ల కూలీలు దొరకటం లేదంటూ మధ్య తరగతి రైతాంగం చేత (పెరిగిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు కార్పొరేట్ దోపిడీ మర్చిపోయి) ఒకటిన్నర రాగం తీయించినపుడు నడుస్తున్నది ఇదే కథ. మన గొయ్యి మన చేతే తీయించే సృజనాత్మక సిద్ధాంతాల సృష్టికథ ఇది.
-డి.పాపారావు
98661 79615