ప్రభుత్వరంగ సంస్థల అవసరం లేదంటూ, వేల కోట్ల ఆస్తులు కలిగి లాభాల్లో ఉన్నవాటిని, అప్పుల నెపంతో తమకు కావాల్సిన కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగించింది కేంద్రంలోని మోదీ సర్కార్. కేంద్రప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే, తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ మాత్రం తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలంగాణకే మణిహారమైన అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి పెద్దపీట వేశారు. సింగరేణిని ప్రైవేట్పరం చేసే కేంద్రం కుట్రలను తిప్పికొట్టారు. శతాబ్దికి మించిన సింగరేణి చరిత్రలో గత దశాబ్ది సింగరేణి ఆకాశమే హద్దుగా అభివృద్ధిలో దూసుకువెళ్లేలా అవకాశాలు కల్పిస్తున్నారు. ఆర్థిక పరిపుష్ఠతలోనే కాదు, కార్మికుల సంక్షేమంలోనూ సింగరేణిది గత పదేండ్లుగా సువర్ణ అధ్యాయమే. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషిస్తున్నది సింగరేణి సంస్థ.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంపూర్ణ సహకారం, దార్శనికతతో బంగారు తెలంగాణ ఆశయసాధనలో సింగరేణి తనదైన పాత్ర పోషిస్త్తున్నది తెలంగాణ కొంగు బంగారంగా ముందుకు సాగుతున్నది.నా తల్లి సింగరేణి నీకు ఉద్యమాభివందనాలు..
సింగరేణి గత చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విజయాలు, అంతకుమించి ప్రమాదాలు. ఇప్పుడు అభివృద్ధి ఫలాలు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ సంస్థగా ప్రారంభమైన తర్వాత డెక్కన్ సంస్థగా రూపాంతరం చెందింది. స్వతంత్ర భారతావనిలో దేశ ఆర్థికాభివృద్ధిలో భాగంగా పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాలో ముఖ్య భూమిక పోషించింది. హైదరాబాద్ రాష్ట్రంలో ఆ తర్వాత, ఉమ్మడి ఏపీలో బొగ్గు ఉత్పత్తి సంస్థగా పయనం ప్రారంభించిన సింగరేణి.. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతే ఆర్థికాభివృద్ధి సాధించింది. ఒక దశలో మూసివేతకు సిద్ధమైన ఈ సంస్థను అప్పటి సింగరేణి యాజమాన్యం ఉద్యోగులు, సమష్టి కృషితో లాభాల బాట పట్టించగా గత పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆర్థిక పరిపుష్ఠత సాధించింది.
ఉత్పత్తి, రవాణా, ఆదాయంలో అభివృద్ధి: తెలంగాణ ఏర్పాటుకు పూర్వం నామమాత్రంగా ఉన్న బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఆదాయంలో సింగరేణి.. గత పదేండ్ల స్వపరిపాలనలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. 2013-14లో బొగ్గు ఉత్పత్తి 504 లక్షల టన్నులు కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి అది 33 శాతం వృద్ధితో 671 లక్షల టన్నులకు చేరింది. ఉత్పత్తిలోనే కాదు, బొగ్గు రవాణాలో సైతం 2014కు ముందు 479 లక్షల టన్నుల నుంచి 39 శాతం వృద్ధితో 2022-23లో 667 లక్షల టన్నులకు చేరింది.
పెరిగిన ఉత్పత్తి, రవాణాల ద్వారా సంస్థకు ఏటా లభించే ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2013-2014 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, పలు పరిశ్రమలకు సరఫరా చేసిన బొగ్గు ఆధారంగా 11,928 కోట్లు ఆదాయం రాగా, గత పదేండ్లలో ఏకంగా 176 శాతం అధికంగా 33,978 కోట్లు టర్నోవర్తో అల్టైం రికార్డు సృష్టించింది.
వేల నుంచి లక్షల్లోకి లాభాల పంపిణీ: తెలంగాణ ఏర్పాటుకు పూర్వంతో పోల్చితే సింగరేణి లాభాలు గత తొమ్మిదేండ్లలో గణనీయంగా పెరిగాయి. 2013-14లో సంస్థ లాభాలు రూ.419 కోట్లు మాత్రమే కాగా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏటా రెట్టింపు స్థాయిలో పెంచుకుంటూ, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 421 శాతం వృద్ధితో రూ.2184 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. లాభాల ఆర్జనలో కీలక భూమిక పోషించే ఉద్యోగులకు ఏటా చెల్లించే లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో వేలల్లో ఉండగా, ప్రస్తుతం లక్షలకు పెరిగింది. 2014లో లాభాల్లో 18 శాతాన్ని ఉద్యోగులకు బోనస్ ఇవ్వగా గతేడాది దాదాపుగా రెట్టింపుస్థాయిలో 30 శాతం బోనస్ చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఒక్కో ఉద్యోగికి సగటున రూ.89,634ల బోనస్ రూపంలో చెల్లింపయింది. మెజారిటీ ఉద్యోగులకు వారి మస్టర్ ఆధారంగా లక్షకు పైగానే చెల్లింపు జరిగినట్టు సమాచారం. 2014లో సగటున ఒక ఉద్యోగికి రూ.17,252, మెజారిటీ ఉద్యోగులు 50 వేలకు పైగా బోనస్, అత్యధికంగా ఒక ఉద్యోగి రూ.65,752ల లాభాల బోనస్ పొందారు. 2022లో అది కనీసం రూ.89,634 వేలు, ఎక్కువమంది ఉద్యోగులు లక్షకు పైగానే పొందారు. అత్యధికంగా ఒక ఉద్యోగి రూ.1,66,334లు బోనస్ పొందారు. ఇక ఏటా చెల్లించే దీపావళి బోనస్ సైతం తెలంగాణ ఏర్పాటు తర్వాత భారీగా పెరిగింది.
వేలాదిగా ఉద్యోగాల కల్పన: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగరేణి ఉద్యోగుల కోసం సీఎం కేసీఆర్ ఎంతకైనా సిద్ధమని నిరూపించింది కారుణ్య నియామకాల ప్రక్రియ. తన హామీ మేరకు డిపెండెంట్ ఉద్యోగాల కల్పనకు కోర్టు తీర్పు అడ్డుగా మారినా, నిబంధనలకు లోబడి తీర్పుననుసరించి మెడికల్ ఇన్వాలిడేషన్ పద్ధతిలో నిరంతర ప్రక్రియలా ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 2014కు ముందు పదేండ్లలో సింగరేణిలో కేవలం 6 వేల ఉద్యోగాల భర్తీ జరుగగా, 2014 తర్వాత 2022 వరకు 19,463 మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో డిపెండెంట్, కారుణ్య నియామక పద్ధతిలో 15,356 మందికి, నోటిఫికేషన్ల ద్వారా 4 వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. మరో 3 వేల మందికి ఇంటర్నల్ ప్రమోషన్లు అందజేశారు. కారుణ్య నియామకాల్లో మహిళలకు సైతం అవకాశం కల్పించడం, ముఖ్యంగా ఒంటరి మహిళలలు, అవివాహిత మహిళలకు సైతం వెసులుబాటు కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ సహకారం, దార్శనికతతో బంగారు తెలంగాణ ఆశయసాధనలో సింగరేణి తనదైన పాత్ర పోషిస్తున్నది. తెలంగాణ కొంగు బంగారంగా ముందుకు సాగుతున్నది. నా తల్లి సింగరేణీ! నీకు ఉద్యమాభివందనాలు.
ప్రదీప్రావు ఎరబెల్లి
99660 89696