‘ఇండియా దటీజ్ భారత్’ అనే వాక్యంతో మన సంవిధానంలోని తొలి అధికరణం ఆరంభమవుతుంది. ‘ఇండియా అంటే భారత్ రాష్ర్టాల సంఘమై ఉంటుంది’ అని అందులో స్పష్టంగా ఉంటుంది.
బ్రిటిష్ ఇండియాలోని తొమ్మిది ప్రావిన్స్లు, స్వతంత్ర రాజ్యాలు, కేంద్రపాలనలో ఉన్న అయిదు రాష్ర్టాలు, అండమాన్ నికోబార్ దీవులు, వాటి పరిధుల గురించి అందులో వివరించారు. ఆ తర్వాతి కాలంలో రాష్ర్టాలను భాషాప్రాతిపదికన పునర్నిర్మించారు. 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇటీవల మనం గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 74 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నాం. 75వ వసంతం వైపునకు పరుగులు పెడుతున్నాం. ఈ సందర్భంగా మన దేశంలో ఉండీ, లేనట్టు.. ఉందా? లేదా? అని ఊగిసలాడుతున్న ‘గణతంత్ర’ గురించి ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
మన భారతం స్వాతంత్య్ర అమృతోత్సవ సంవత్సరాన్ని దాటిపోయిన సందర్భం ఇది. మాయమాటలకు, పనికిరాని ఉచిత కానుకల వాగ్దానాలకు లొంగిపోయి ఐదేండ్ల ఆధిపత్యపు లైసెన్సులను ఓటర్లు సారా చిత్తులో, మతం మత్తులో, ధనం గమ్మత్తులో, ఫేక్ న్యూస్ విజృంభించే వాట్సాప్ గ్రూపుల విపత్తులో పడిపోయి ఓట్ల రూపంలో సమర్పించుకుంటున్న దశ ఇది. 74 ఏండ్లు గణతంత్ర ఫలాలను చవిచూచిన జాతి, దాదాపు ఆ మహాత్యాగాలను, విషమ పోరాట విషయాల్ని మర్చిపోయింది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి మూడు దశాబ్దాలు వివిధ రాజకీయ పార్టీల్లో సేవా దృక్పథం కలవారు, రాజకీయాలను పూర్తికాలపు వృత్తిగా స్వీకరించినవారు పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు. కానీ, ఆర్థిక సంస్కరణల తర్వాత రాజకీయాలు కార్పొరేటీకరణ చెంది, ప్రధాన రాజకీయ పార్టీల్లో కార్పొరేట్ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు చేరి ప్రజా ప్రతినిధులుగా పోటీ చేస్తున్నారు. లోక్సభకు రూ.100 కోట్లు, శాసనసభకు రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేసేవారు మాత్రమే పోటీ చేయాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. గెలుపొందిన వారు వ్యాపారం చేసుకుంటూ తమ పదవిని వ్యాపార ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. దీని వల్ల నిజాయితీపరులు, సామాజికవేత్తలు, వామపక్ష ప్రజా దృక్పథం కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారు.
భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. అన్ని వ్యవస్థలు, సంస్థలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాలి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1949 నవంబర్ 26న కింది విధంగా పేర్కొన్నారు. ‘ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా, గొప్పదైనా కావచ్చు, కానీ దాన్ని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లయితే అది పనిచేయదు’ అని చెప్పారు.
పంద్రాగస్టు నాడు జెండా ఎగరేయడానికి తీరిక చేసుకునే వారికన్నా, జెండా ఎగరేసి నమస్తే పెట్టని వాడెవడో చూసి తీరిగ్గా తన్నేవారు ఎక్కువై, రకరకాల దేశభక్తులు చెలరేగుతున్న అమృత ఘడియలు ఇవి. భారత రాజ్యాంగం చెక్కుచెదరకుండా ఉన్నట్టే ఉంది గానీ, ఆదేశిక సూత్రాలు గాలిలో తేలిపోతున్నాయి. సుపరిపాలన సుడిగాలిలో కొట్టుకుపోతున్నది. పార్లమెంట్ నేల నుంచి సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ దాటి రాష్ట్రపతి భవనం గేటుకు కొట్టుకుని, ఇటు కిందికి కన్యాకుమారి దాకా సంవిధాన నీతి పవనాలు వీచడం లేదు. పెగాసస్ గందరగోళంలో పడి ప్రతిపక్షం గడబిడలో ఉంటే బిల్లులు మాత్రం లోకసభ చిల్లుల్లోంచి బయటపడి చట్టాలవుతున్నాయి.
రణరంగం కానిచోటు భూస్థలమంతా వెదికిన దొరకదు
గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్లతో
చల్లారిన సంసారాలూ మరణించిన జనసందోహం
అసహాయుల హాహాకారం చరిత్రలో నిరూపించినవి
ఈ నేరగాళ్ల గురించే శ్రీశ్రీ ఇదే రాస్తున్నాడనిపిస్తుంది కదూ.
నేరగాళ్లు నిండిన చట్టసభల గొంగట్లో సమన్యాయ విలువల కోసం మనం వెతుక్కుంటున్నాం. సీజేఐ అంటే భారత ప్రధాన న్యాయమూర్తి మీద లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన మహిళపైనా, ఆమె బంధువులపైనా పెగాసస్ నిఘా పెట్టి కోర్టు ధిక్కారం కాకుండా న్యాయవ్యవస్థ పరువును జాగ్రత్తగా కాపాడుకున్నాం. దుశ్శాసన సభలో ద్రౌపదీ వస్ర్తాపహరణం కాదు. సర్వోన్నత ధర్మాసన వాకిట్లో న్యాయానికి మానహాని. తర్వాత న్యాయం రాజ్యసభలో ప్రవేశించింది. సభాధ్యక్షుడి కంట కన్నీరై ప్రవహించింది. కోట్ల రూపాయలు చెల్లించి మరీ నిఘా సమాచారాన్ని కొన్నవారికి ఎన్నివేల కోట్ల రూపాయల ప్రయోజనాలో అనడిగితే రాజద్రోహమేనంటారా?
ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కుల సమాహారం అని నవ న్యాయమూర్తిత్వ ధర్మాసనం తీర్పు పౌరహక్కుల్లో సరికొత్త చారిత్రాత్మక విప్లవం అని సంతోషించారే గానీ, అంతటి ప్రైవసీని జాతీయ స్థాయిలో ఒక విదేశీ కార్పొరేట్ శక్తి టోకున బలి చేస్తే, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడమే మా రాజకీయం అని చాటుకుంటుంటే ప్రైవసీ నాశనం అయిందని సంతాప సభలైనా పెట్టారా? బ్రిటిష్ జడ్జి మన మహాత్మాగాంధీ మీద రాజద్రోహం కేసులో శిక్ష వేయవలసి వస్తున్నందుకు బాధపడ్డారట. వేలాది మంది భారతీయుల మీద మన సొంత భారతీయ ప్రభుత్వం 98 శాతం నకిలీ రాజద్రోహం కేసులు పెట్టినందుకు సిగ్గుపడే అర్హతైనా ఉందా? బ్రిటిష్ వాడు కూడా అచ్చెరువందే విధంగా ఆనాటి అరాచకపు దుర్మార్గ చట్టాలను నిస్సిగ్గుగా వాడుకుంటున్నామే. పాపం ఏడీఆర్ లెక్కలు వేయడానికి తప్ప లక్షల మంది అభ్యర్థుల ప్రమాణ పత్రాల వల్ల ఏం ప్రయోజనం? ఓటర్లకు అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత ప్రతి నేరగాడూ, సారీ… ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థీ తన నేరాల చిట్టాలు, స్థిరచరాస్తులు నోట్ల కట్టల కొట్టాలు, చదువుకొన్న (కొనని) పట్టాల వివరాలతో ఇచ్చిన ప్రమాణ పత్రాలు అట్లా పడి ఉన్నాయి. ఓటర్లకూ పట్టవు, రాజకీయ పార్టీలకూ పట్టవు.
అహో మన మహాభారతం. అసెంబ్లీ నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా నేర చరితుల సంఖ్య దండిగానే ఉంటుంది. ఏ నేరం చేయని వాడైతే ఎన్నికలో గెలిచే అవకాశాలు 4.7 శాతమేనట. అదే నేరచరిత్ర గలఅభ్యర్థికి మాత్రం ఎన్నికల్లో గెలిచే అవకాశాలు 15.5 శాతమట. ఇదీ మన ఓటర్ల రీతి, నీతి. ఎవరు సిగ్గుపడాలి? ఎక్కడ సిగ్గు పడాలి? ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు, నేరగాళ్లకు టికెట్ ఇవ్వని పార్టీయే లేదు మన దేశంలో. ఆర్టికల్ 14 కింద అంతా సమానమే అంటే ఇదేనేమో.చిల్లర దొంగతనం చేసిన వారి కేసులను సత్వరం విచారణ చేయనవసరం లేదట. పాతికేండ్ల పడుచును మొగుడు మోసం చేస్తే విడాకుల కేసు వినడానికి 30 ఏండ్లు వాయిదా వేస్తే దేశానికి ఏమీ నష్టం లేదట. ఆమె రెండో పెండ్లి సంగతి దేశానికేం పట్టింది. కానీ, 43 శాతం ప్రజాప్రతినిధుల మీద ఉన్న తీవ్రనేరాలను త్వరగా విచారణ జరపకపోతే మనదేశ రాజ్యాంగ సంవిధాన సుపరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోతుందట.
కనుక సత్వర విచారణ హక్కును నేరగాళ్లయిన చట్టసభ్యులకు మాత్రమే తొలుత ఇస్తాం. అరవై ఏండ్లు దాటిన వాడికి ముందు కరోనా టీకా వేసినట్టు, లాక్డౌన్ మినహాయింపు సారా బ్రాందీషాపులు తెరవడంతో మొదలైనట్టు, ముందు ప్రజాప్రతినిధులపై ప్రత్యేక కోర్టులు రోజువారీ కేసులు విని వారికి ఆర్టికల్ 21 కింద సత్వర న్యాయం హక్కును అందేట్టు చూస్తారు. ఇతర కోట్లాది నేరస్తులకు సత్వర నిర్ధారణ హక్కుకు తొందరెందుకండీ.
నిజంగా సుప్రీంకోర్టు కనుసన్నల్లో, హైకోర్టు ధర్మాసనం పర్యవేక్షణలో ప్రత్యేక కోర్టులన్నీ శరవేగంగా పనిచేసి, తమ మీద తమ కేసులను తామే ఉపసంహరించుకోకుండా హైకోర్టు కొరడా పట్టుకుని చూస్తుండగా, లోకసభలో 233 మందితో పాటు అనేకానేక శాసనసభల్లో వేలాదిమంది ప్రజాప్రతినిధుల్లోని సగం మంది నేరగాళ్లే అని రుజువైపోయి జైళ్లకు వెళ్లిపోతే ఈ దేశం ఏమైపోతుంది? చట్టసభలన్నీ ఖాళీ అయిపోవూ. జైళ్లలో శీతాకాల సమావేశాలు జరుపుతారా? నేరం రుజువైతే జీవితకాలం నిషేధం విధించాలని అధికార పార్టీ నాయకుడొకాయన పిల్లో కోరుతున్నారు. అదే జరిగితే రాజకీయ పార్టీల గతేమిటి? కొత్త నేరగాళ్లు తొందరగా దొరుకుతారా? లేకపోతే ఎవరు పోటీచేస్తారు? కొంపదీసి మేం ఏ నేరమూ చేయలేదనే ప్రమాణ పత్రాలే వస్తాయా? అప్పుడు ఏడీఆర్ బతుకు ఎడారేనా? నేరగాళ్లకే ఓట్లేసే అలవాటున్న ఓటర్లంతా ఏమైపోవాలి? ఓ అమృత వత్సర స్వతంత్ర భారతదేశమా చెప్పు. అచ్చమైన జనంతో స్వచ్ఛమైన భారతం ఎప్పుడొస్తుందో.
మాడభూషి శ్రీధర్