రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే ప్రశ్న కంటే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చే ఎక్కువగా సాగుతున్నది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఏమేం చేయాలనుకుంటున్నారో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ముందుగానే చెప్పేస్తున్నారు. తద్వారా విపక్షాలపై యుద్ధం ప్రకటించి, మానసికంగా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మీకు పెద్ద పని పెట్టబోతున్నాను. సిద్ధంగా ఉండండి’ అని బ్యాంకర్ల సమావేశంలో ప్రధాని ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు ప్రత్యర్థుల మీద తీవ్రంగానే ప్రభావం చూపిస్తాయి. యుద్ధరంగానికి వెళ్లకముందే, యుద్ధం ప్రారంభం కాకముందే ఈ తరహా ప్రకటనలతో ప్రత్యర్థి మీద సగం విజయం సాధించినట్టే అవుతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పదేండ్ల పాలన అంత అద్భుతంగా ఉందా? మూడోసారి విజయం సాధించేంత అద్భుతంగా పాలించారా? ప్రభుత్వంపై వ్యతిరేకత అసలే లేదా? అంటే అలా ఏమీ లేదు. ఈ పదేండ్లలో ఇది సాధించాం అని చెప్పుకోవడానికి బీజేపీ సాధించిన గొప్ప విజయాలేమీ లేవు. అయితే హిందుత్వ, మెజారిటీ వర్గం, దేశ భక్తి, జాతీయ వాదం వంటి అంశాలను బీజేపీ బాగా వాడుకొంటున్నది. ‘నోట్ల రద్దు వల్ల కలిగే ప్రయోజనాల కోసం 50 రోజులు వేచి చూడండి. ఆ తర్వాత ఉరి తీసినా నేను సిద్ధం’ అని మోదీ ప్రకటించారు. కానీ, నోట్ల రద్దుతో ఏం సాధించారనేది పదేండ్ల పాలన ముగుస్తున్న సమయానికి కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. నీళ్లలో తోసేస్తే ప్రాణాలు రక్షించుకోవడానికి ఈత వస్తుంది.. అన్నట్టు నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలు సైతం డిజిటల్ పేమెంట్ చేయగలుగుతున్నారు. ఇది తప్ప నోట్ల రద్దు ద్వారా మోదీ సర్కార్ సాధించిందేమీ లేదు. నోట్ల రద్దు వల్ల ఎంతో మంది చనిపోయారు. దేశాభివృద్ధి కుంటుపడింది. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందనే బలమైన భావనను మోదీ ప్రజల్లోకి చొప్పిస్తున్నారు.
చివరికి బీజేపీ సైతం తమ ప్రచారంలో పదేండ్ల పాలనలో తాము ఏం అభివృద్ధి చేశామో చెప్పడం లేదు. దానికి బదులు హిందుత్వ, రామ మందిరం, జాతీయ వాదం, మెజారిటీ వర్గాన్నే నమ్ముకున్నది. ఈ అంశాల్లో బీజేపీతో పోటీ పడే పార్టీ లేనే లేదు. ఇండియా కూటమి ఏర్పడిన కొత్తలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందేమో అని ఆశలు చిగురించాయి. కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ ఆ ఆశలు కూడా ఆవిరైపోయాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే.. ఇండియా కూటమి అనేది ఒకటుందనే విషయాన్ని కూడా ప్రజలు మరిచిపోయే దుస్థితి ఏర్పడింది. తొలుత ఇండియా కూటమిలో చేరిన ప్రధాన పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చాయి. ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో, హర్యానాలో బలంగా ఉన్న ఆప్ సైతం కాంగ్రెస్తో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్తో పొత్తు లేకుండానే పంజాబ్, హర్యానాలో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. బెంగాల్లో బలంగా ఉన్న టీఎంసీ.. ఇండియా కూటమితో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నది. బీహార్లో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీయేలో చేరిపోయారు. ఈ పరిణామాలతో ఇండియా కూటమి డీలా పడిపోగా.. ఎన్డీయే అంతకంతకు బలాన్ని పెంచుకుంటూ, విశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మూడోసారి పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంటున్నది. ఇప్పటికే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్.. 2024 ఎన్నికల్లోనూ చతికిలపడితే రాహుల్గాంధీ నాయకత్వానికి పెద్దదెబ్బే అవుతుంది. అదే కనుక జరిగితే సొంత పార్టీ నుంచే ఆయన నాయకత్వం పట్ల ధిక్కార స్వరాలు వినిపించే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా? లేదా అనేది దేవుడెరుగు. కనీసం గౌరవప్రదమైన సీట్లు సాధిస్తుందనే విశ్వాసం కూడా కలగడం లేదు. 2019లో కాంగ్రెస్ 44 సీట్లు, 20 శాతం ఓట్లు సాధించింది. కనీసం ఈ స్థాయి ఓట్లు, సీట్లు ఈ సారి సాధించగలదా? అనేది కూడా సందేహమే.
సాధారణంగా రెండు పార్టీల విధానం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పక్షంపై వ్యతిరేకత ఏర్పడితే.. ఆ ఓట్లు మరో పార్టీకి పడతాయి. అయితే మన దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏదో ఒక పార్టీకి కాకుండా, అనేక పార్టీల మధ్య చీలుతున్నాయి. ఈ చీలిక అధికార పక్షమైన బీజేపీకి ఉపయోగపడుతున్నది.
రాహుల్గాంధీ నాయకత్వంలో వరుసగా మూడోసారి కాంగ్రెస్ ఓడిపోతే రాహుల్గాంధీ పార్టీకి రాజీనామా చేయడమే సబబు అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచించారు. కాంగ్రెస్కు పరోక్షంగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రాహుల్గాంధీ పని తీరు ఎలా ఉందనేది కాదు, మూడోసారి కూడా ఓడిపోతే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలనేది ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం. మండల్ ఉద్యమం నుంచి క్రమంగా బీజేపీ ఎదుగుతుంటే అంత కన్నా వేగంగా కాంగ్రెస్ పతనం మొదలైంది. మండల్ కమిషన్ను వీపీ సింగ్ తెరపైకి తీసుకువస్తే తమకు మరో గత్యంతరం లేదని ఎల్కే అద్వానీ రథయాత్రకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో వివిధ రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. ప్రాంతీయ పార్టీల విజృంభణ కాంగ్రెస్ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. బీజేపీ రథయాత్ర, మండల్ ఈ రెండూ కాంగ్రెస్ను క్రమంగా నిర్వీర్యం చేశాయి.
కాంగ్రెస్ను ఆప్ అనేక రాష్ర్టాల్లో చావుదెబ్బ కొట్టింది. బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ నాయకురాలు మమతా బెన ర్జీ ఒకప్పుడు కాంగ్రెస్ నాయకురాలే. ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఇమేజ్తో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏపీ లో ప్రస్తుతం అధికారంలో ఉన్నది. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఏపీలో జగన్ విజృంభించడంతో ఆ పార్టీ అడ్రస్ లేకుండాపోయింది. ఒడిషా, బీహార్, బెంగాల్, ఏపీ, తెలంగా ణ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీ లు కాంగ్రెస్ను చావుదెబ్బ తీశాయి. ప్రాంతీయ పార్టీల కారణం గా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడా కాంగ్రెస్కు అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో ఎలాంటి సస్పెన్స్ లేదు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, గత ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన 44 సీట్లను ఆ పార్టీ నిలబెట్టుకుంటుందా? లేదా అనేది తేలాల్సి ఉన్నది. ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒకవేళ మూడోసారి కూడా కాంగ్రెస్ ఓటమిపాలైతే రాహుల్గాంధీ నాయకత్వానికి సవాళ్లు ఎదురవుతాయి. పరోక్షంగా కాంగ్రెస్ను నడిపిస్తున్న రాహుల్గాంధీని తప్పిస్తారా? అధ్యక్షున్ని మారుస్తారా? ఇప్పటి వరకు నమ్ముకున్న సిద్ధాంతాలు ఉపయోగపడలేదని కాంగ్రెస్ తన విధానాలను మార్చుకుంటుందా? అనే విషయం ఫలితాల తర్వాతనే తేలనున్నది.
బుద్దా మురళి
98499 98087