‘మార్పు కావాలి- కాంగ్రెస్ రావాలి’ అనే మోసపూరిత నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. అందుకే గత పదేండ్లుగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన బీఆర్ఎస్ను కాదని, ప్రజలు కాంగ్రెస్కు పట్టం గట్టారు. అయితే ఆ పార్టీ మూడు నెలల పాలనను చూసిన ప్రజలు ‘ఇలాంటి మార్పును ఎందుకు కోరుకున్నామా’ అని ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. ‘ఇలాంటి మార్పేనా మీరు కోరుకున్నది’ అని ప్రజలను ప్రశ్నిస్తే.. కాదంటే కాదని, ఇప్పుడు పెదవి విరుస్తుండటం కాంగ్రెస్ పాలనకు నిదర్శనం.
మార్పు.. మార్పు..’ అన్న ప్రజల అభిప్రాయాల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. నాటి రోజులను తల్చుకొని ప్రజలు బాధపడుతుండటం చూస్తుంటే మనసు కకావికలమవుతున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. నేడు ప్రజల ముఖాల్లో నవ్వులు విరబూసేవి. ఎండకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకేవి. రైతులు దుక్కిదున్ని, నాటు వేసుకోవడం లాంటి పనుల్లో నిమగ్నమయ్యేవారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని కిలోమీటర్ల మేర నడిచి వెళ్లేవాళ్లు. అలాంటి రోజులు మన ఆడబిడ్డలకు మళ్లా రావొద్దని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. అందుకే ఏండ్ల తరబడి చేసిన మేధోమథనంతో ప్రజల సమస్యలు, అవసరాలను గుర్తించి వారికి విముక్తి కల్పించింది. తాగునీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట వేసింది. నాటి ప్రతిపక్షాలు ఎన్నో వంకర మాటలు మాట్లాడినా పట్టించుకోలేదు. ప్రజా సంక్షేమమే తమ కర్తవ్యమని చాటిచెప్పింది. ఆ దిశగానే అడుగులు వేసింది. ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికీ నీళ్లందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మహిళ మొహంలో ఆనందం చిగురించేలా చేసింది. ఇలా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ సర్కార్ అనేక ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. గత పదేండ్లుగా ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన బీఆర్ఎస్ సర్కార్ స్వల్ప సీట్ల తేడాతో ప్రతిపక్షంలో కూర్చున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తుందని ఊహించిన ప్రజలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అందుకే తాము కోరుకున్నది ఇలాంటి మార్పు కాదని బల్లగుద్ది మరీ చెప్తున్నారు.
ఇదిలా ఉంటే.. దేశంలోని ఏ ప్రభుత్వమైనా పెద్ద పెద్ద బరాజ్లు, ఆనకట్టలు కట్టేటప్పుడు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుంది. కాంట్రాక్టర్ల పుణ్యమాని కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ఏదైనా పొరపాటు జరిగి నష్టం వాటిల్లితే దానికి పరిష్కార మార్గాలు కనుగొని మళ్లీ ప్రభుత్వమే సరిచేయాలి. అంతేకానీ, ఆ తప్పును గత ప్రభుత్వం మీద తోసేసి ప్రజలకు నష్టం చేకూరే విధంగా వ్యవహరించడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదు.
ఇతోధిక అభివృద్ధి వైపు ‘మార్పు’ ఉండాలి. కానీ, అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే రాష్ర్టాన్ని పదేండ్ల వెనక్కి తీసుకుపోయింది. రాష్ట్రంలో తాగునీటి కోసం ధర్నాలు ప్రారంభమయ్యాయి. మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డెక్కుతున్నారు. ఓ వైపు పొలాలు ఎండిపోతుంటే, వాటిని సూడలేక రైతులు సాగునీటి కోసం విన్నపాలు ఇచ్చే దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ఇంతటి మార్పు చూస్తామనుకోలేదని ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తేరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజల బాగోగులకు ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగించాలి. ఆ దిశగా పాలకులకు సద్బుద్ధి కలగాలని ఆకాంక్షిద్దాం.
-డాక్టర్ మాచెర్ల వాణీమనోహర్