ఇరువై రెండేండ్ల కిందట కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నాయకత్వంలో జలదృశ్యంలో కొద్దిమంది తెలంగాణ అభిమానుల మధ్య పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ప్రయాణాన్ని చూస్తే ఇది నిజమేనా అనిపిస్తున్నది. సచివాలయం ఎదురుగా ఉన్న జలదృశ్యంలో ఎన్నో ఆశలు, అంతకు మించిన సందేహాలతో టీఆర్ఎస్ ఇరువై రెండేండ్ల కిందట ఆవిర్భవించింది.
విద్యుత్, తాగు, సాగునీరు, రోడ్లు, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే దేశం తనవైపు చూసేట్టుగా తెలంగాణ అభివృద్ధి సాధించింది. ఇప్పుడు తెలంగాణ కచ్చితంగా దేశానికి రోల్ మాడల్. తెలంగాణ మొదలుపెట్టిన ‘రైతుబంధు’ పథకాన్ని కొన్ని రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. కేంద్రం సైతం అనుసరిస్తున్నది. అదేవిధంగా తెలంగాణ కంటివెలుగును తమ వద్ద అమలు చేయనున్నట్టు ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాలు ప్రకటించాయి.
ఆ స్థలంలో నిలబడి ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. విదేశాల్లో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రికి రాత్రి జలదృశ్యం నుంచి టీఆర్ఎస్ కార్యాలయాన్ని రోడ్డున పడేయించారు. ఆ జలదృశ్యం స్థలంలో ఇప్పుడు అమరవీరుల స్మారక స్తూపం తలెత్తుకొని నిల్చున్నది. దాని ఎదురుగా తెలంగాణ సచివాలయం. తెలంగాణ ఉద్యోగులను, తెలంగాణ వారిని రెండవ తరగతి పౌరులుగా చూసిన ఆ సచివాలయం స్థానంలో ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అద్భుతంగా కనిపిస్తున్నది కొత్త సచివాలయం. అక్కడే అంబేద్కర్ రాసిన రాజ్యాం గం వల్లనే తెలంగాణ సాకారమైందని చెప్తున్నట్టుగా, ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం. హింసతో ఏమీ సాధించలేరు, అహింసా పోరాటంతోనే తెలంగాణ సాకారమైందని చెప్తున్నట్టుగా పక్కనే బుద్ధుని విగ్రహం.
ఉమ్మడి రాష్ట్రంలో ఏసీలు బంద్ చేయండి, విద్యుత్ను తక్కువగా వాడండని పెద్దపెద్ద హోర్డింగులు కనిపించేవి. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా 24 గంటల విద్యుత్. అప్పుడు పవర్ హాలిడేలపై ఇందిరాపార్క్ వద్ద పారిశ్రామికవేత్తల ధర్నాలు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి.
సినీ నటి లయ పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల హైదరాబాద్ వచ్చాక ఓ ఛానల్ ఇంటర్వ్యూలో హైదరాబాద్ను చూసి అబ్బురపడుతూ హైదరాబాద్ ముందు అమెరికా నగరాలు ఎందుకూ పనికిరావన్నారు. పలుదేశాల పారిశ్రామికవేత్తలు సైతం ఇది హైదరాబాదేనా అని విస్తుపోతున్నారు. హైటెక్ సిటీనో, ఒక్క హైదరాబాద్ నగరమో అభివృద్ధి చెందితే మొత్తం తెలంగాణ అభివృద్ధి చెందినట్టు కాదు. ఆ విషయం తెలంగాణ రాజకీయ నాయకత్వానికి, తెలంగాణవాదులకూ తెలు సు. అందుకే తెలంగాణ ఏర్పడగానే ముందు గా, కొందరిలో నెలకొన్న భయాలను పారదోలేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని ఆంధ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీ కాలుకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా’నని భరోసా ఇచ్చారు. ఈ మాటలు ఆంధ్రుల్లో భరోసా నింపాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్లోని పరిశ్రమలన్నీ ఆంధ్రకు తరలివెళ్తాయని విస్తృతంగా ప్రచారం చేశారు. ఒక్కటీ వెళ్లలేదు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయి. చివరికి ఏపీకి చెందిన ఎంపీ కూడా తెలంగాణలో పరిశ్రమ పెట్టారు. తెలంగాణ రాజకీయ నాయకత్వం భయాలను దూరం చేయడమే కాదు, భరోసా కల్పించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు దారిద్య్రం, ఆకలిచావులు, కరువుకు శాశ్వత నివాసం అన్నట్టుగా ఉండే పాలమూరు జిల్లా ఇప్పుడు వ్యవసాయంలో గోదావరి జిల్లాలతో పోటీ పడేట్టుందంటే ఎలాంటి కృషి లేకుండానే ఇది సాధ్యమైందా?
విద్యుత్, తాగు, సాగునీరు, రోడ్లు, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల వంటి వాటికి ప్రా ధాన్యం ఇవ్వడం వల్లనే దేశం తనవైపు చూసేట్టుగా తెలంగాణ అభివృద్ధి సాధించింది. ఇప్పు డు తెలంగాణ కచ్చితంగా దేశానికి రోల్ మాడ ల్. తెలంగాణ మొదలుపెట్టిన ‘రైతుబంధు’ పథకాన్ని కొన్ని రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. కేంద్రం సైతం అనుసరిస్తున్నది. అదేవిధంగా తెలంగాణ కంటివెలుగును తమ వద్ద అమలు చేయనున్నట్టు ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాలు ప్రకటించాయి. ఆరు దశాబ్దాలు పాలించినా ఉమ్మడి పాలకులు తాగునీళ్లు, విద్యుత్ వంటి కనీస అవసరాలను తీర్చలేదు. కానీ, ఈ తొమ్మిదేండ్ల స్వల్పవ్యవధిలోనే, ప్రజాసంక్షేమం విషయం లో తెలంగాణ దేశంలోనే సగర్వంగా తలెత్తుకొని నిలబడింది.
ఇరువై రెండేండ్ల ప్రస్థానంలో టీఆర్ఎస్ సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. సాధించినవే కాదు, సాధించాల్సినవీ ఉన్నాయి. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితబంధు, మూడెకరాలు రాలేదనే విమర్శ ఉంటుంది. ప్రాధాన్య క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఆదాయం పెరుగుతున్నా కొద్ది ఇలాంటి పథకాలు మరింత మందికి అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం సమయంలో కేసీఆర్ రాజీనామాతో సిద్దిపేట ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలి ఎన్నికల గుర్తు నాగలి పట్టిన రైతు. ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారిన తర్వాత దేశవ్యాప్తంగా నినాదం ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’.
ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ దేశవ్యాప్తంగా ఉద్యమించి అన్ని పార్టీలను కలిపి జనతా పార్టీని ఏర్పాటు చేశారు. జనతా పార్టీ గుర్తు నాగలి పట్టిన రైతు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా రైతు కేంద్రం గా రాజకీయాలు సాగాలని కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినాదం ఇచ్చారు. ఎన్నికలకు మరో ఏడాది గడువుంది. ఏడాదిలో ఏమైనా జరగవచ్చు. అయితే అభివృద్ధి రాజకీయాలకు ఏడాది తక్కువ సమయం. అదే మతం పేరుతో ఎన్నికలు జరిగితే పోలింగ్కు ఒక్కరోజు ముందు జరిగే మత రాజకీయాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి.
అదే సమయంలో ఇంత సువిశాల దేశాన్ని అభివృద్ధి పేరుతో కాకుండా మతం పేరుతో పాలించాలని ప్రయత్నిస్తే ఏ పార్టీ మౌనంగా ఉన్నా ఆ పార్టీ ఈ దేశానికి అన్యాయం చేస్తున్నట్టే. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు తెలంగాణ ఎప్పుడు వస్తుందో అప్పుడెవరూ ఊహించలేదు. ఇప్పుడూ అంతే బీఆర్ఎస్ ప్రభావం వెంటనే కనిపిస్తుందని కాదు. కాలం పట్టవచ్చు, కానీ ప్రభావం చూపుతుంది. మతం పేరుతో ఎల్లకాలం అధికారం చెలాయించలేరు. జనాభాలో చైనాను దాటి ప్రపంచంలో నంబర్ వన్గా నిలిచాం. జన సంఖ్యలోనే కాదు, ఆలోచనలో కూడా మన దేశం నంబర్ వన్గా నిలవాలి.
ప్రతి పార్టీ అధికారం కోసం ప్రయత్నిస్తుం ది. తెలంగాణలో సైతం అన్నిపక్షాలు అధికారం మాదంటే మాదే అనడమే కాదు, దానికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అంతిమంగా అన్ని రాజకీయపక్షాల లక్ష్యం తెలంగాణ అభివృద్ధి కావాలి. సాయుధ పోరాటం, నక్సలిజం, వివక్ష వీటన్నింటితో దశాబ్దాల తరబడి వెనుకబాటుతనం అనే శాపంతో కొట్టుమిట్టాడిన తెలంగాణ తొమ్మిదేండ్ల నుంచి తనను తాను పాలించుకుంటున్నది. ఈ తొమ్మిదేండ్లలో గణనీయ అభివృద్ధి ఒక వాస్తవం. ఇంకా అభివృద్ధి సాధించాలని కోరుకోవడం న్యాయమే. జాతీయపార్టీలు కావచ్చు, ప్రాంతీయపార్టీలు కావ చ్చు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది అన్ని పార్టీల మొదటి అజెండా కావాలి.
బుద్దా మురళి
98499 98087