జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి
తెలంగాణ ఆత్మ బలిదానాలు ప్రపంచ చరిత్రలోనే ఓ మరచిపోలేని విషాదం. బతుకుదెరువుకు వచ్చి, స్థానికుల బతుకులనే బజారుపాలు చేసిన దౌర్భాగ్యపు స్థితిని కూడా దశాబ్దాలుగా భరించిన ఘనచరిత్ర ఈ ప్రాంతానిది. సొంతింట్లోనే కిరాయి డబ్బులు చెల్లిస్తూ బతుకులు వెల్లదీసిన దుస్థితి ఇక్కడి ప్రజలది. తమకు పట్టిన గతి మరెవరికి పట్టొద్దని ‘తామెలాగు జీవితాలను బుగ్గిపాలు చేసుకున్నాం, కనీసం పిల్లల బతుకులైనా బాగుండాలని మా ప్రాంతాన్ని మాకు వదిలేయండి, మా బతుకులేవో మేం బతుకుతాం’ అని సామరస్యంగా పోరాటాలు సాగించిన నేల ఇది. న్యాయ సమ్మతమైన కోరికను ఏ మాత్రం రక్తపాతానికి అవకాశం లేకుండా సాగించారే తప్ప ఎక్కడా ఎరుపెక్కించలేదు. ఆ మాటకొస్తే వాళ్లను వాళ్లు ఆత్మార్పణ చేసుకున్నారే గానీ, ఎదుటి పక్షంపై కనీసం కర్ర కూడా ఎత్తిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించవు.
ఎవరో చేసిన నిర్లక్ష్యానికి గాల్లో కలిసిన ప్రాణాలెన్నో. మొదట 369, రెండో దఫా 1200 పైచిలుకు జీవాలు పిట్టల్లా రాలాయి. శతాబ్దపు ఆరంభంలో మొదలై దశాబ్దంన్నర పాటు సాగిన మలిదశ పోరులో ఒక్కసారైనా రక్తం పారిన సందర్భం లేదు. నచ్చకున్నా భరించిన సమాజమిది. చెప్తే వినేవారు లేకపోతే తమను తాము నిందించుకున్న ఔదార్యం ఇక్కడిది. రోజురోజుకు పెరుగుతున్న అంతర్గత ఆందోళనలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాక, ఎవరిని నిందించాలో తెలియని గందరగోళంలో తమను తాము అర్పించుకున్న మహోన్నత అమరమూర్తులు నడిచిన నేల ఇది. త్యాగానికి పర్యాయంగా నిలిచి, తమ ప్రాణాలే ఫలహారంగా సమర్పించారే గానీ, తమను కట్టుబానిసల్లా చూస్తూ కవ్వింపునకు దిగుతున్నా ఈ నేల ఎక్కడా కట్టుతప్పలేదు. ఎవరిపైనా కత్తులు నూరలేదు.
నచ్చిన వాటికోసం బలీయంగా నిలబడటం ఇష్టమనిపించుకుంటుంది, నచ్చని వాటిని సమూలంగా తుంచేయాలనుకోవడం ఇబ్బందిగా మారుతుంది. స్వేచ్ఛను తెలియజేయడానికి ఎంతగా సంతోషిస్తామో.. సంయమనంగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు అంతకుమించిన ఓర్పుతో సాగితేనే మర్యాద అనిపించుకుంటుంది. లేదంటే, ఓ గొప్పాయన చెప్పినట్టుగా హక్కులంటే ఆనందంగా.., బాధ్యతలు అంటే భారంగా వెళ్లదీసేవి అనే భావించాల్సి ఉంటుంది. ఏ విషయమైనా నచ్చడం, నచ్చకపోవడం వారి వారి వ్యక్తిగతాన్ని బట్టే ఉంటుంది. వ్యక్తిస్వామ్యాన్ని డామినేట్ చేసే నచ్చడాలు, నచ్చకపోవడాలు ఇతరులకు ఇబ్బందిగా మార్చితే ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుంది. హద్దులు ఎరిగి మసులుకుంటే ఇష్టాయిష్టాలు వాటి వాటి పరిధుల్లోనే రాజ్యమేలుతాయి. రాజ్యమూ పదికాలాలు సుభిక్షంగా నిలుస్తుంది. కాదని కత్తులు దూసినా, నెత్తురు చూసినా పాలనే ప్రశ్నార్థకమవుతుంది. పెద్దరికం పరిహాసమవుతుంది.
అంతిమంగా పార్టీల మధ్య వైరాలు కత్తులు నూరుకునేంత దూరం వెళ్లడం, ఆ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్న నేత తీరుఅతి హేయం. పాలించాల్సిన వారు రక్తాలు చిందించేలా ప్రేరేపించడం ఓటు విలువను తగ్గించడమే.
ముందు నడిచేవాడు నాయకుడనిపించుకోడు. వెనకుండి నడిపించేవాడు అసలుసిసలు నేతగా కీర్తింపబడతారు. నడిచేవిధానం నచ్చితే వద్దన్నా జనమే అనుసరిస్తారు. నడవడిక తీరు బాగోకుంటే ఉండమని బతిమిలాడినా వీడివెళ్తారు. తెలంగాణ ఉద్యమవేళ ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో సమస్త సమాజానికి తెలుసు. రాష్ట్రసాధన పోరాటంలో ఎవరి పాత్ర ఎంతెంత ఘనమో ఇక్కడి ప్రతి పౌరుడికీ అనుభవమే. ఆ వేళ పరాయి పంచన ఉండి, ప్రాణాలను పణంగా పెట్టిన వారిని పరిహసించిన వారిని ప్రజలు ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతారు. అప్పుడు మనస్సుల్లో కోల్పోయిన స్థానాలను రాబట్టుకోవడం కోసం ఎత్తులు, జిత్తులు వేయడం ఓ మార్గమే కావొచ్చు గానీ, కత్తులు, కటారాలు నూరడం సంస్కృతి అనిపించుకోదు. నాయకులు పార్టీలు మారుతారు. పార్టీలు ప్రభుత్వాలను మారుస్తాయి, ప్రభుత్వాలు అల్టిమేట్గా ప్రజలకు సాగిలపడాల్సిందే తప్ప వారినే ఏమార్చుతామనుకుంటే చరిత్రహీనులవడం ఖాయం.
ఉద్యమనేత ఒంటరిగా మొదలుపెట్టిన పోరుయాత్రను చూసి, సమస్త తెలంగాణ సమాజం ఒకేతాటిపైకి వచ్చి అనుసరించిందే గానీ భయంతోనో, మరిదేనితోనో బలవంతంగా తెచ్చుకున్నది కాదు. చావు నోట్లో తలపెట్టి అనుకున్నవి సాధించిన వేళ సంబురాలు చేసుకున్న సమాజమే, సల్లగా పాలించమని దీవించిన విషయం తెలిసిందే. మొదటి పర్యాయం మసులుకున్న తీరు, తీర్చిదిద్దిన వైనం నచ్చి మరోమారు కూడా ‘మా రేడు’వు నువ్వేనని గద్దె అప్పగించిండ్రు. తాజాగా మూడో పర్యాయం మళ్లీ వాళ్ల ముందుకెళ్లి నిలిచిన సందర్భం. రెండు పర్యాయాలు పాలన సాగించిన వారు ఓ వైపు, పాలన మార్పే లక్ష్యంగా జనాల్లో గడుపుతున్న ‘ఆ రెండు పక్షాలు’ చెరో దిక్కు అన్నట్టుగా చోటుచేసుకున్న పరిణామాలు ఎంతో ఉత్కంఠకు దారితీస్తున్న సమయం.
అసహనం సహజమే. చూపడానికి మార్గాలనేకం ఉంటాయి. నిందితుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న వేళ నెపం నెట్టాలనే ప్రయత్నమే బాధాకరం. పక్కన నిలబడి, మన బలగంలో కలగాపులగంగా తిరిగినప్పుడే మనోడు, బలహీన క్షణాలను జయించలేక, బహిరంగంగా దాడులతో విరుచుకుపడే వేళ మాత్రం పరాయి.. అనే ధోరణి సాగిస్తున్న నాయకుల తీరు హాస్యాస్పదం. ఏ పార్టీ నాయకుడిపైన జరిగినా దాడి దాడే. ఖండించాల్సిన వేళ కత్తితో చేశారా, కక్షతో చేశారా, సానబట్టినదేనా, చాకచక్యంగానేనా, అనే తీరు విషాదకరం. ఫొటోలు దిగడానికి పోటీపడే ఆరాటం, పోటుపడిన వేళ మాత్రం నెపాన్ని పక్కకు నెట్టేందుకు చేసే యత్నమే విడ్డూరం. తమవాడు కాదని కమలదళం, వాళ్లోడే అని హస్తగళం, ఇలా ప్రత్యక్షంగా దొరికిన ఆధారాలను కూడా పచ్చి అబద్ధంగా మార్చేందుకు యత్నించడం బాధాకరం. నేతలు కదనరంగంలో వైరిపక్షాన్ని ఎదుర్కోవడానికి పన్నాగాలు రచించుకోవాలి. ఎత్తులు పైఎత్తులు వేసుకోవాలి గానీ, నెత్తుటి రాజకీయాలతో నెట్టుకొచ్చే సంస్కృతికి మాత్రం తెరలు తీయడం దిగజారుడుతనమే. అయినా ప్రజలెప్పుడూ వివేకవంతులే. వారి ఆలోచనెప్పుడూ పది తరాల ముందే ఉంటుంది. తమకు ఏ విధానం కావాలో స్పష్టమైన విజన్ ఉన్నవారిని మోసం చేయాలనుకోవడం అత్యాశే. గెలుపోటములను నిర్దయగా వెల్లడించే కీలక ఓటు అస్త్రంతో కాచుక్కూర్చున్న మహాశయులను మోసం చేసే దిశగా ఆలోచనలుంటే ఆ నేతలు ఎప్పటికైనా మట్టి కొట్టుకుపోవాల్సిందే. అలాంటి చరిత్ర ఎవరు లిఖించినా చిరిగిపోవాల్సిందే.
అంతిమంగా పార్టీల మధ్య వైరాలు కత్తులు నూరుకునేంత దూరం వెళ్లడం, ఆ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్న నేత తీరు అతి హేయం. పాలించాల్సిన వారు రక్తాలు చిందించేలా ప్రేరేపిం చడం ఓటు విలువను తగ్గించడమే. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఖద్దరు బట్టల పెద్దలు కమురు వాసనతో తిరుగుతామంటే ప్రజలు మాత్రం ఎందుకు ఉపేక్షిస్తారు. ఏ మాటకామాటే నెత్తికెక్కించుకోవాలో, మట్టిలోనే కలుపాలో ఆ ఓటరు మహాశయుడికి పూర్తి స్పష్టత ఉంది. పోట్లతో వాటిని తారుమారు చేసేతీరుకు తెరతీస్తుంటే గమనిస్తూ ఊరుకుంటాడనుకుంటే మూర్ఖత్వమే. సమయం వచ్చినప్పుడు ఓటు పోటు ను ఎవరికి దింపాలో వారికి దింపి, మిగతా వారిని ముల్లే మూట సర్దుకోమని చెప్పే లౌక్యం ఆయనకు కూడా తెలుసు. చూస్తున్నారు కదా అని ఎలాపడితే అలా ఆడితే ఆటకట్టించి ‘చేతులు’ చుట్టేసే రోజు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పటివరకు నేతలంతా పార్టీల ప్రతిష్టలు మరింత దిగజారకుం డా, జనాల్లో ఇంకా చులకన కాకుండా ప్రవర్తిస్తే ఆ కాస్త సింపథీ అయినా ఉంటుందేమో ఆలోచన చెయ్యాలే!
రాజేంద్రప్రసాద్ చేలిక
99858 35601