పద్నాలుగేండ్లు జరిగిన తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనితరసాధ్యమైనది. ఉద్యమ సారథి
కేసీఆర్ బాటలో పయనించిన న్యాయవాదులకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాద సమాజానికి భరోసా కల్పిస్తున్నది. ఆపద సమయంలో అండగా ఉంటూ పెద్ద మనసుతో ముందుకువెళ్తూ దశాబ్ది సంబురాలు జరుపుకొంటున్నది తెలంగాణ రాష్ట్రం.
న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతను ప్రోత్సహించడం కోసం జూనియర్ న్యాయవాదులకు నల్సార్ యూనివర్సిటీలో వృత్తిపరమైనటువంటి మెలకువలు నేర్పే శిక్షణను ఏర్పాటుచేశారు. శిక్షణకాలంలో వారికి రూ.5000 స్కాలర్షిప్ను కూడా అందిస్తున్నది ప్రభుత్వం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అనేకమందిని రాష్ట్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, బీసీ కమిషన్ సభ్యులుగా అవకాశం కల్పించారు.
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా ముందుకుసాగుతున్నది. ఈ క్రమంలో ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించిన న్యాయవాద సమాజాన్ని ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ న్యాయవాద సంక్షేమ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రస్ట్కు రూ.100 కోట్లను కేటాయించారు. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీతో తెలంగాణ న్యాయవాదులకు మెడికల్ రీయింబర్స్మెంట్ పాలసీని ఏర్పాటుచేసింది ప్రభుత్వం. తద్వారా న్యాయవాదే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా సంవత్సరానికి రెండు లక్షల బీమా గ్యారెంటీని ఇప్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. 2017లో సంక్షేమ ట్రస్ట్ను ఏర్పాటుచేస్తే 2018-2019లో 18,405 మంది న్యాయవాదులకు బీమా చేశారు. అందులో 1,098 మంది మెడికల్ రీయింబర్స్మెంట్ పొందారు. రూ.5 కోట్ల ఒక లక్ష వరకు బాధిత న్యాయవాదులకు సాయంగా అందింది. 2019-20లో రూ.8 కోట్ల 52 లక్షలు, 2020-21 రూ.10 కోట్ల 2 లక్షలు, 2021 22లో రూ.9 కోట్ల 81 లక్షలు అందించింది. 2022-23లో 20,769 మంది న్యాయవాదులకు రూ.3.45 లక్షల సాయం అందింది. ఇలా ఐదేండ్లలో రూ.36 కోట్ల 17 లక్షల సాయం న్యాయవాదులు, వారి కుటుంబసభ్యులకు అందింది. ఇలాంటి సంక్షేమ పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదంటే అతిశయోక్తికాదు.
కరోనా సమయంలో వ్యాధి సోకి చికిత్స చేయించుకొన్నవారికి కూడా రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిద్వారా తెలంగాణవారే కాకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనేకమంది పేద న్యాయవాదులు కూడా వైద్యాన్ని పొంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న 15 వేల మంది న్యాయవాదులకు ఒక్కొక్కరికీ రూ.16 వేలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి హైకోర్టును విభజించకుండా రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టు రాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుపడిన సందర్భంలోనూ సీఎం కేసీఆర్ ముందునిలిచి హైకోర్టును సాధించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖమంత్రులను కలిసి హైకోర్టు అవసరాన్ని తెలియజెప్పారు. అలాగే పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ వాయిస్ను వినిపించి ప్రత్యేక హైకోర్టును సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. హైకోర్టులో 24 జడ్జి పోస్టులు మాత్రమే ఉంటే కేసీఆర్ దార్శనికతతో హైకోర్టులో నేడు 42 జడ్జి పోస్టులు రావడానికి కృషిచేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేకమంది న్యాయవాదులకు సామాజిక సమతుల్యతను పాటిస్తూ అధికారాలను కల్పించారు. జడ్జిలుగా, అడ్వకేట్ జనరల్గా, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్స్గా, జీపీలుగా, ఏజీపీలుగా, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా అనేకమందికి అవకాశాలు కల్పించారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్లీడర్లకు చాలీచాలని జీతాలుంటే నేడు రెట్టింపు జీతాలను పొందుతున్నారు.
న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతను ప్రోత్సహించడం కోసం జూనియర్ న్యాయవాదులకు నల్సార్ యూనివర్సిటీలో వృత్తిపరమైనటువంటి మెలకువలు నేర్పే శిక్షణను ఏర్పాటుచేశారు. శిక్షణకాలంలో వారికి రూ.5000 స్కాలర్షిప్ను కూడా అందిస్తున్నది ప్రభుత్వం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అనేకమందిని రాష్ట్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, బీసీ కమిషన్ సభ్యులుగా అవకాశం కల్పించారు. ఉన్నచోటనే వారికి పదవులు ఇవ్వడం తెలంగాణ న్యాయవాద సమాజానికి దక్కిన గౌరవంగా భావించవచ్చు. అదేవిధంగా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటైనటువంటి 33 జిల్లాలలో జిల్లా కోర్టులను ఏర్పాటు చేస్తూ ఒక్కో జిల్లా కోర్టుకు ఐదు నుంచి పదెకరాల వరకు భూమిని కేటాయించింది. చాలామంది పేద న్యాయవాదులు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అందుకున్నారు. న్యాయవాదుల పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతూ ప్రభుత్వ విద్య, వైద్య సదుపాయాలు పొందుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి తమ జీవితాలను, తమ వృత్తిని, పణంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ బాటలో నడిచిన వారిని కేసీఆర్ ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకుంటున్నది.
పోరాటంలో ముందున్న న్యాయవాదులకు ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో మరిన్ని సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టడానికి ఏమాత్రం వెనుకంజ వేయదని దశాబ్ది ఉత్సవాల సాక్షిగా ఆశిద్దాం. ఇలాంటి న్యాయవాద సంక్షేమ పథకాలు తెలంగాణలోనే కాకుండా భారత దేశం లో కూడా కేసీఆర్ నాయకత్వంలో పేద న్యాయవాదులకు అందాలని కోరుకుంటున్నాం.
శ్రీరంగారావు తన్నీరు
న్యాయవాది, ఈఆర్సీ చైర్మన్
సీహెచ్ ఉపేంద్ర
న్యాయవాది, బీసీ కమిషన్ సభ్యులు