భూమి రికార్డులను చంకలో, గ్రామాలను గుప్పిట్లో పెట్టుకునే పటేల్, పట్వారీ వ్యవస్థను నాడు ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు ప్రజల్లో హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన జరిగింది. రికార్డుల డిజిటైజేషన్, ధరణి రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రవేశపెట్టడంతో పారదర్శకతతో పాటు వేగం కూడా పెరిగింది. ఈ మార్పుచేర్పులు జనామోదం, ఆదరణ పొందాయి. కానీ నాటి పటేల్, పట్వారీ వ్యవస్థకు అవశేషం లాంటి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) విధానం అనే ఫ్యూడల్ అవశేషం అలాగే ఉండిపోయింది.
మారిన పరిస్థితుల నేపథ్యంలో నిరర్థకంగా తయారైన ఈ వ్యవస్థను ఇప్పుడు కేసీఆర్ రద్దుచేయడం సమయోచిత చర్య. వారికి ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం చిరుద్యోగులకు శుభవార్త. ముందుకు వెళ్లలేక, వెనుకకు మళ్లలేక ఇరుక్కుపోయిన వీఆర్ఏలకు ప్రభుత్వం ఈ చర్యతో విముక్తి ప్రసాదించిట్టయింది. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయబోతున్నది. ఫ్యూడల్ వ్యవస్థ అవశేషంగా కొనసాగుతున్న నియామకాలివి. వీరిని నీరడి, మస్కూర్, లష్కర్, సుంకరి వంటి పేర్లతో పిలుస్తుంటారు. వీరికి గౌరవ వేతనం పేరిట రాజుగారు మెచ్చుకొని ఉల్లిగడ్డ చేతుల వెట్టినట్టు చాలా తక్కువ సొమ్ము ఇస్తారు. ఇప్పుడు వీరంతా గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. సజావైన జీతం అందుకోబోతున్నారు. వేలాది కుటుంబాలకు ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత కల్పించే నిర్ణయమిది.
నీటి నిర్వహణ, గ్రామ పరిపాలనకు అవసరమైన సహాయకులుగా నియమితులైన వారే కాలక్రమంలో వీఆర్ఎఏలుగా గుర్తింపు పొందారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పరిపాలనా సంస్కరణలు తెచ్చింది. ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చింది. అవినీతిరహిత పారదర్శక పాలనకు బాటలు వేసింది. దాంతో గ్రామ పరిపాలనా విధానం మారిపోయింది. ‘కొత్త నీరు వస్తే పాత్త నీరు’ కొట్టుకుపోయినట్టు వీఆర్ఏల అవసరం తీరిపోయింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం గానీ, రాష్ర్టాలు గానీ రద్దయిన వ్యవస్థలకు చెందిన ఉద్యోగులను గాలికివదిలేయడం చూశాం. కానీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే వారి సంక్షేమం గురించి ఆలోచించింది. వీరి సమస్యపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కమిటీ వేసింది. వీఆర్ఏల ఆకాంక్షల మేరకు కమిటీ చేసిన సిఫారసులు ఇప్పుడు ప్రభుత్వ ఆమోదం పొంది ఆచరణలోకి రావడం ముదావహం.
‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్టుగా ఏ మూలకూ సరిపోని గౌరవ వేతనంతో ఏండ్ల తరబడి నిస్వార్థంగా సేవలందించిన వీఆర్ఏల త్యాగనిరతిని గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించడం వైపే మొగ్గింది. నడిసంద్రంలో ఉన్న వీఆర్ఏలను గడ్డకిగ్గింది. వేల కుటుంబాలు వీధినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నది. వ్యవస్థను రద్దుచేసి చేతులు దులుపుకోకుండా వీరిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని, 61 ఏండ్ల లోపు వయసులో ఎవరైనా వీఆర్ఏ మరణిస్తే వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం. తద్వారా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల తనకు గల అంకితభావాన్ని మరోమారు చాటుకున్నది.