Chandrababu | 2002లో దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయం. ఎన్డీయే తరఫున భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను నిలబెట్టారు. వామపక్షాల తరపున సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్య్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరి కెప్టెన్గా పోరాడి, 1971లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై, 1998లో పద్మ విభూషణ్ పురస్కారం పొందిన లక్ష్మీ సెహ్గల్ను నిలబెట్టారు.
వనరులు ఒకచోట ఉంటాయి, ఒక చోట ఉండవు. కానీ వాటన్నింటినీ హేతుబద్ధం చేసి ప్రజలకు ఉపాధినివ్వాలి. బతుకుదెరువును ఇవ్వాలి. ప్రపంచానికి అన్నం పెట్టాలన్న దృక్పథం ఉన్న దూరదృష్టి గల నేత కేసీఆర్. ఈ దిశగా ఒక్కనాడు కూడా ఆలోచన చేయని, ఆలోచన కూడా రాని చంద్రబాబు ఒక దార్శనికుడిగా భ్రమింపజేసింది, భ్రమింపజేస్తున్నది ఆయన అనుకూల పచ్చ మీడియా.
లక్ష్మీ సెహ్గల్ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడంపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ‘నేను రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఆమె ఎవరో నాకు తెలియదు. వామపక్షాల నిర్ణయం పట్ల పశ్చాత్తాప పడుతున్నాను’ అన్నారు. వెంటనే అక్కడ ఉన్న జర్నలిస్టులు ఆశ్చర్యపోయి చంద్రబాబుకు లక్ష్మీ సెహ్గల్ చరిత్ర, గొప్పతనం వినిపించారు. చంద్రబాబుకు చరిత్ర, గొప్పగొప్ప వాళ్ల గురించి తెలియకపోతే, తెలుసుకోవాలన్న ఆలోచన లేకపోతే అతనిది అజ్ఞానం. కానీ తనకు తెలియదు కాబట్టి ఎవరికీ తెలియదనుకోవడం మూర్ఖత్వం. ఏమీ తెలియని చంద్రబాబును దార్శనికుడిగా భ్రమింపజేసింది, భ్రమింపజేస్తున్నది అతని అనుకూల మీడియా. తాజాగా మరోసారి టీడీపీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం మూలంగానే ఇక్కడి ప్రజలు అన్నం తింటున్నారు. అంతకుముందు జొన్నలు, రాగులు, సజ్జలే తినేవారు అనడం బాబు అజ్ఞానానికి పరాకాష్ట.
11వ శతాబ్దం కాకతీయుల పాలనలో తెలంగాణ అంతటా చెరువులు, కుంటలను నిర్మించారు. బావులను తవ్వించారు. ఊరికి దిగువన చెరువు, చెరువుకు దిగువన వ్యవసాయ భూములుండేలా జాగ్రత్తపడ్డారు. దీంతో ఊరిలో కురిసిన వాననీరు చెరువులకు చేరేది. వరదలు గ్రామాలను ముంచెత్తేవి కావు. మూసీ నది నుంచి మూసేటి కాలువ, రావిపాటి కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమ గండకాలువ, ఉటుం కాలువ, చింతకాలువ, దుందుభి నదీతీరాన ఉన్న గండకాలువ వంటివి కాకతీయులకాలంలో ఉండేవని శాసనాధారాలున్నాయి. చెరువులు, కాలువల నిర్వహణకు ప్రత్యేకంగా వ్యక్తులను నియమించి, వారి పోషణకు భూములు, పుట్టికి కుంచం చొప్పున వారికి జీతమిచ్చేవారు. గణపతిదేవుని పాలనలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం ఉధృతంగా నడిచింది.
అప్పట్లో ప్రధానంగా వరి, గోధుమలు, కొర్రలు, పెసలు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు లాంటివి పండించేవారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులే కాలక్రమంలో తెలంగాణ వ్యవసాయానికి ప్రధాన సాగునీటి వనరులయ్యాయి. ఆ తర్వాత నిజాం పరిపాలనలో 58 టీఎంసీల సామర్థ్యంతో 2.75 లక్షల ఎకరాలకు సాగు నీరందించడం లక్ష్యంగా నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం 1923లో ప్రారంభించి 1931లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ సమయంలోనే పోచారం ప్రాజెక్టు, ఆ తర్వాత అప్పర్ మానేరు ప్రాజెక్టు, డిండి రిజర్వాయర్, మంజీరా నదిపై ఘణపురం ఆనకట్ట, ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్, కోయిల్సాగర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిర్మించారు. హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో విలీనమయ్యే నాటికి 1,20,000 చెరువులు, కుంటలు ఉండేవని రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి.
ఇవే కాకుండా నిజాం ప్రభుత్వం మరిన్ని భారీ ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసింది. గోదావరిపై 400 టీఎంసీల పోచంపాడు (కుస్తాపురమ్) ప్రాజెక్టును, 350 టీఎంసీల ఇచ్చంపల్లి ప్రాజెక్టును, మంజీరా నదిపై 38 టీఎంసీల దేవనూరు ప్రాజెక్టును, కృష్ణానదిపై 132 టీఎంసీల నందికొండ ప్రాజెక్టును, 54.4 టీఎంసీల అప్పర్ కృష్ణా ప్రాజెక్టును, తుంగభద్ర నదిపై 65 టీఎంసీల తుంగభద్ర ఎడమ కాలువ, రాజోలిబండ మళ్లింపు పథకం, భీమానదిపై 100 టీఎంసీల బీమా ప్రాజెక్టును, పెండ్లిపాకల జలాశయం, మూసీ నదిపై మూసీ ప్రాజెక్టు, మరఠ్వాడాలో పూర్ణా, పెన్గంగ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. మొత్తంగా తెలంగాణలో 1365 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకునేందుకు ప్రతిపాదనలున్నాయి. రాష్టాల పునర్వ్యవస్థీకరణ జరిగి 1956లో ఏపీ రాష్ట్రం ఏర్పడటంతో కొన్ని ప్రాజెక్టులను లిస్టులోంచి తొలగించారు. కొన్నింటి సామర్థ్యాన్ని కుదించారు. మరికొన్నింటిని సుప్తావస్థలో ఉంచారు. 1956లో తెలంగాణ ఆంధ్రలో విలీనమయ్యే నాటికి తెలంగాణ సాగునీటి రంగం పటిష్ఠంగా ఉండేది. తెలంగాణ, ఆంధ్ర విలీనమై ఏపీగా అవతరించాకనే తెలంగాణ రైతాంగానికి కష్టాలు మొదలయ్యాయి.
ఏపీ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల నిర్మాణ స్థలాలు మారిపోవడం, అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. తెలంగాణ చిన్న నీటి వనరులు చెరువులు, కుంటలను ప్రణాళికాబద్ధంగా ధ్వంసం చేశారు. తెలంగాణలో చెరువులు పటిష్టంగా ఉండి వాగులు, వంకలలో పారిన నీరు చెరువులు, కుంటలలో చేరితే దిగువన ఉన్న ఆంధ్రాకు నీటికొరత వస్తుందన్న ఉద్దేశంతో వాటిని నీరుగార్చారు. సాగునీటి వనరులు ధ్వంసమై, ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందక, సాగునీటి ప్రాజెక్టులు ప్రతిపాదించినా వాటి నిర్మాణం దశాబ్దాల పాటు పూర్తికాకుండా నిధుల కేటాయింపులో తీవ్ర వివక్షకు గురిచేశారు. చెరువులు, కుంటల కింద సాఫీగా సాగిన తెలంగాణ వ్యవసాయం బోరుబావుల మీద ఆధారపడే స్థితికి చేరింది. క్రమంగా వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగి, దిగుమతులు రాక అప్పులపాలై వ్యవసాయాన్ని వీడి రైతులు ఇతరరంగాల్లో ఉపాధి వెతుక్కుంటూ వలసల బాటపట్టారు.
తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనకబడేయబడ్డ ప్రాంతం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పదేపదే చెప్పిన వాస్తవం ఇది. తెలంగాణ భూములను ఎండబెట్టి ఆంధ్రలో గోదావరి, డెల్టా ప్రాంతాల కింద పండిన పంటలకు ప్రభుత్వ ఉచిత మార్కెట్ ఏర్పాటుచేసి సబ్సిడీ బియ్యం తెలంగాణ, తెలంగాణ వంటి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి ప్రజలను ఆదుకున్నట్లు ప్రచారం చేసుకున్నారు. అందరికీ అన్నం పెట్టిన నేల తెలంగాణ.
సమైక్య పాలనలో సృష్టించిన కృత్రిమ కరువు, కృత్రిమ క్షామం మూలంగా తెలంగాణ నష్టపోయింది. తెలంగాణ ఉద్యమంలో నీటి దోపిడీ, వివక్ష ప్రధాన అంశంగా ముందుకువచ్చింది. గోదావరి, కృష్ణా నదులు పారుతున్నా తెలంగాణకు ఈ నీటి గోస ఎందుకు? అన్న ప్రశ్న గ్రామీణ ప్రజలను తట్టిలేపింది. సుదీర్ఘ ఉద్యమంతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.
తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి, కేవలం మూడేండ్లలో కాళేశ్వరం వంటి అతిపెద్ద ఎత్తిపోతలను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. సమైక్య పాలనలో సాగు నష్టాలను భరించలేక వలసబాట పట్టిన రైతన్నలను తిరిగి వ్యవసాయం వైపు మళ్లించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు సాగునీరు అందివ్వడమే గాక రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేల చొప్పున పలు విడతల్లో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.
అందరికీ అన్నం పెట్టే రైతుకు ఆపద వస్తే ఆ కుటుంబం ఎవరిముందు చేయి చాచకుండా ధైర్యంగా ఉండాల్నని రైతు ఏ కారణం చేత మరణించినా 10 రోజుల్లోపు రూ.5 లక్షలు ఆ కుటుంబానికి అందేలా రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికింద ఇప్పటివరకు దాదాపు 97,913 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4895.65 కోట్ల పరిహారం అందాయి.
సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాల వల్ల 2014 నాటికి కోటీ 31 లక్షల ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2021 నాటికి అది 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014-15 నాటికి 68 లక్షల టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది. అన్ని పంటల ఉత్పత్తి కలిపి 4.04 కోట్ల టన్నులకు చేరుకోవడం విశేషం. ఈ యాసంగిలో తెలంగాణలో ఇప్పటివరకు 55.51 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయడం గమనార్హం.
2014-15లో ఏపీలో వానకాలం, యాసంగి కలిపి 59.16 లక్షల ఎకరాల్లో సాగయింది. 2022-23లో వానకాలం, యాసంగి కలిపి 55.60 లక్షల ఎకరాలే కావడం గమనార్హం. ఒక్క యాసంగిలో తెలంగాణలో సాగవుతున్న మొత్తం ఆంధ్రలో వానకాలం, యాసంగిలలో కలిపి కావడం లేదు. గత తొమ్మిదేండ్లలో వ్యవసాయరంగంలో అద్వితీయ ప్రగతి సాధించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
అనాలోచిత విధానాలతో నేల విడిచి సాము చేసి వ్యవసాయరంగాన్ని భ్రష్టుపట్టించిన చంద్రబాబు నాడు ‘వ్యవసాయం దండుగ’న్నారు. ఐటీ రంగం నా వల్లనే వచ్చింది. నేను ఐటీ తేవడం వల్లనే సత్య నాదెళ్ల మైక్రో సాఫ్ట్ సీఈఓ అయ్యాడని, హైదరాబాద్ నేనే ప్రపంచపటంలో పెట్టానని నోటికొచ్చిన మాటలన్నీ పలు సందర్భాల్లో అన్నాడు. అదే క్రమంలో ఆయన తాజాగా ‘1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 2 రూపాయల కిలో బియ్యం మూలంగానే అన్నం తింటున్నారని, అంతవరకు జొన్నలు, సజ్జలు, రాగులే వారి ప్రధాన ఆహారమని’ చెప్పడం ఆయన అవివేకం, అజ్ఞానానికి పరాకాష్ట.
‘జొన్నకలి, జొన్నయంబలి
జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్’
అని మహాకవి శ్రీనాథుడు (1365 – 1441) ఆరు శతాబ్దాల కిందటే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారు. గత శతాబ్దాల చరిత్ర గమనించినా తెలంగాణ ప్రాంతం అన్ని పంటలకూ అనుకూలమని, కేవలం సమైక్య రాష్ట్రంలో పాలకుల వివక్ష మూలంగా నిరాదరణకు గురై నష్టపోయిన ప్రాంతమే తప్ప వనరులు లేక కాదన్నది సుస్పష్టంగా తేలిపోతున్నది. తెలంగాణతో పోల్చుతూ ఆంధ్రా ప్రాంతాన్ని, ప్రజలను చిన్నగ చేయాలన్నది మా ఉద్దేశం కాదు, అలాంటి ఆలోచన మాకెన్నడూ లేదు. కానీ చారిత్రక వాస్తవాలను అర్థం చేసుకోకుండా, అజ్ఞానం, అహంకారంతో వ్యవహరిస్తూ మేమే గొప్పోళ్లం అనే చంద్రబాబు వ్యాఖ్యల్లో ఎంత మూర్ఖత్వం ఉన్నదో ప్రపంచానికి చాటిచెప్పడమే మా ఉద్దేశం.
వనరులు ఒకచోట ఉంటాయి, ఒక చోట ఉండవు. కానీ వాటన్నింటినీ హేతుబద్ధం చేసి ప్రజలకు ఉపాధినివ్వాలి. బతుకుదెరువును ఇవ్వాలి. ప్రపంచానికి అన్నం పెట్టాలన్న దృక్పథం ఉన్న దూరదృష్టి గల నేత కేసీఆర్. ఈ దిశగా ఒక్కనాడు కూడా ఆలోచన చేయని, ఆలోచన కూడా రాని చంద్రబాబు ఒక దార్శనికుడిగా భ్రమింపజేసింది, భ్రమింపజేస్తున్నది ఆయన అనుకూల పచ్చ మీడియా. నదుల నీళ్లు సముద్రాల పాలు కావద్దు. ఇక్కడి బీళ్లను తడపాలన్నది కేసీఆర్ ఆలోచన. ప్రపంచానికి అన్నం పెట్టే శక్తి భారతదేశానికి ఉన్నది. అది సద్వినియోగం చేసుకుంటామని చెప్తున్నాం. అందుకే ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అంటున్నాం.
(వ్యాసకర్త: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు)