తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి ఐలమ్మ. విసునూరు దొరను ధైర్యంగా ప్రతిఘటించి ప్రజలను ఉద్యమ బాట పట్టించిన చైతన్య దీప్తి ఆమె. దొర దాడిలో అయినవాళ్లను, ఆస్తులను పోగొట్టుకున్నా వెనకడుగు వేయకుండా పోరాటం సాగించిన యోధురాలు ఐలమ్మ. ఆమె జీవితమంతా పోరాటమే. అలాంటి ఆదర్శమూర్తి జయంతి, వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ సముచిత గౌరవం ఇస్తుండటం అభినందనీయం.
ఉమ్మడి రాష్ట్రంలో మరుగునపడిన తెలంగాణ వైతాళికులు, పోరాట యోధులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం లభిస్తున్నది. ఇప్పటికే అనేకమంది కవులు, పోరాట యోధుల జయంతి, వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటంలో వీర వనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం తెలంగాణ వాషర్మ్యాన్ కో-ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.10 లక్షల నిధులు మంజూరు చేసింది. బీసీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఐలమ్మ పోరాటం గురించి గానీ, ఆమెపై దొరలు చేసిన పాశవిక దాడుల గురించి గానీ నేటి యువతరానికి అంతగా తెలియదు. ఆమె గురించి ఉమ్మడి రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా ప్రస్తావన లేదు. నిస్వార్థ త్యాగానికి ప్రతీకైన ఆమె ప్రతిమకు టాంక్ బండ్పై స్థానం దక్కలేదు.
భారత దేశానికి పర పీడన పాలన నుంచి విముక్తి కోసం సాగిన స్వాతంత్య్ర పోరాటం, నిజాం పాలనలో రజాకార్ల బాధలను అంతమొందించేందుకు సాగిన మహోజ్వల వీర తెలంగాణ సాయుధ పోరాటం ఒకే కోవకు చెందినవి. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేందుకు సాగిన వీరోచిత పోరాటంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతోమంది పాల్గొని అమరులయ్యారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ సంస్థానంలో సంస్కరణ ఉద్యమాలు మొదలయ్యాయి. ఆంధ్ర జనసంఘం ఆధ్వర్యంలో 1921 నుంచి ఉద్యమాలు మొదలయ్యాయి. ఆ సంఘమే ఆ తర్వాత ఆంధ్ర మహాసభగా మా ర్పు చెందింది. కౌలు రైతులను వెళ్లగొట్టే బేదఖల్ను భూస్వాములు మొదలుపెడితే జనం ప్రతిఘటించారు. ఆంధ్ర మహాసభ ‘సంఘం’ పేరు తో కార్యక్రమాలు నిర్వహించింది.
నల్లగొండ జిల్లా పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ కార్యదర్శి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో జనం విసునూరు దొర గూండాలను అడ్డుకున్నారు. గూండాలను అడ్డుకున్న వారిలో చాకలి ఐలమ్మ, ఆమె భర్త నర్సయ్య, ఇద్దరు కొడుకులు లచ్చయ్య, సోమయ్య కూడా ఉన్నారు. తన గూండాలను అడ్డుకొన్నారన్న కోపంతో విసునూరు దొర రామచంద్రారెడ్డి ఐలమ్మ ఇంటి మీద దాడులు చేయించాడు.
రజాకార్లు కూడా ఐలమ్మ ఇంటి మీద దాడులు చేశారు. అయినా ఐలమ్మ ధైర్యంగా వారికి ఎదురు నిలబడింది. ఈ పోరాటంలో ఐలమ్మ భర్త చనిపోయారు. ఐలమ్మ కుటుం బం సర్వస్వం కోల్పోయింది. 40 ఊళ్ల మీద పెత్తనం చేసే విసునూరు దొరను ఎదిరించిన ఐలమ్మ పోరాటం ప్రజలకు ప్రేరణ కలిగించింది. తెలంగాణ గడ్డ మీద నడిచిన ఇంతటి ఉజ్వల పోరాటాన్ని ఆంధ్రా కమ్యూనిస్టులు హైజాక్ చేశా రు! ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనని ఆంధ్రా నాయకులు అనుభవాల పేరుతో కట్టల కొద్దీ పుస్తకాలు రాశారు.
ఐలమ్మ జీవితమంతా పోరాటమే. తొలి రోజుల్లో ఆమె భూమి కోసం పోరాడారు. కడుపు నిండా తినలేదు. కంటి నిండా నిద్రపోలేదు. ఆమె కుటుంబం చెట్టుపుట్టల పాలైంది. ఐలమ్మకు స్వాతంత్య్ర సమరయోధుల పింఛను రాలేదు. పోరాటయోధురాలిగా గుర్తింపు దక్కలేదు. కౌలుకు చేసిన భూమి దక్కలేదు. కనీసం కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల పలకరింపునకు కూడా ఆమె నోచుకోలేదు. అవసాన దశలో ఆమె పేదరికంతో బాధ పడ్డారు. పట్టించుకునే నాథుడు లేక అష్టకష్టాలు పడి చివరికి 1985, సెప్టెంబర్ 10న తుదిశ్వాస విడిచారు. ఆమె వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజలు ఆమెకు నివా ళులు అర్పిస్తున్నారు.
(వ్యాసకర్త: విశ్రాంత ప్రధానాచార్యులు)
(ఈ నెల10న చాకలి ఐలమ్మ వర్ధంతి)
– సీవీవీ ప్రసాద్ 80196 08475