కేంద్ర ప్రభుత్వాలు బీసీ, ఓబీసీ కులగణన చేయడం లేదు. కాబట్టి, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల రక్షణ, అమలు, జనాభా దామాషా పద్ధతిలో పెంపు కోసం 2023 జనవరి నుంచి కులగణనను చేపట్టింది. ఈ కులగణన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ప్రకారం అధికారం లేదని కొందరు పాట్నా హైకోర్టులో సవాల్ చేశారు. స్పందించిన హైకోర్టు కులగణన ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలని, సేకరించిన సమాచారాన్ని తుది ఉత్తర్వులు వెలువడేదాకా గోప్యంగా భద్రపరచాలని మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. మద్రాస్ హైకోర్టు ధర్మాసనం 2012లో సెన్సస్ కమిషనర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆర్.కృష్ణమూర్తి కేసు తీర్పులో కేంద్ర ప్రభుత్వాన్ని జనాభా లెక్కలతో పాటుగా ఓబీసీ కులగణన జరుపాలని సూచించింది. కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పును 2014లో సుప్రీంకోర్టులో సవాల్ చేసి రద్దు చేయించింది.
ఓబీసీల కులగణన చేసినట్లయితే దేశంలో కులాల మధ్య అసమానతలు, విద్వేషాలు పెరిగి దేశ సమగ్రతకు విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2018లో ఓబీసీ కులగణన 2021 జనాభా లెక్కల్లో తీయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ద్వారా విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించింది.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో వర్ణ వ్యవస్థ ద్వారా నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఏర్పడి, ఆయా కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థిక, సాంస్కృతిక మొదలైన అసమానతలు ఏర్పడ్డాయి. దేశంలో కులాల మధ్య ఏర్పడిన అసమానతలను రూపుమాపాలంటే, కులాలవారీగా జనగణన తప్పనిసరి అని భావించిన నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1872 నుంచి 1931 వరకు కులాలవారీగా జనగణన చేసింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినాక రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమలుల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో బీసీ కులాలను విస్మరించి, పలు అధికరణల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగాలలో, చట్టసభలైన అసెంబ్లీ, లోక్సభలలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. కాబట్టి 1951 నుంచి తీస్తున్న జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ కులాలను లెక్కిస్తూ, మిగతావారిని ఇతరులుగా నమోదు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్-246లో తెలిపినట్లు షెడ్యూల్డ్ 7వ జాబితా 1లోని 69 క్లాజ్ ప్రకారం దేశ జనాభా లెక్కలు, ప్రతీ పదేండ్లకోసారి లెక్కించడానికి సెన్సెస్ చట్టం, 1948 ప్రకారం అధికారాన్ని కలిగి ఉన్నది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జనాభా లెక్కలు లేనందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు, కులాలవారీగా సంక్షేమ పథకాలు అమలుచేయడానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఓబీసీ జనాభా 50 శాతానికి మించి ఉన్నప్పటికీ సామాజిక రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని మండల్ కమిషన్ తీర్పులోని సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కేంద్ర విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లను 27 శాతానికి పరిమితం చేశారు. అదే తీర్పులో ఓబీసీ కులాల ఆమోదయోగ్యమైన జనాభా లెక్కలున్నట్లయితే 50 శాతం రిజర్వేషన్లు మించి అమలు చేసుకోవచ్చని సూచించింది.
కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ, ఇతర పార్టీలు 2011లో తీయబోయే జనాభా లెక్కల్లో ఓబీసీ కులగణన చేయాలని ఆందోళన చేశాయి. అందుకు స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో సమాధానం చెప్తూ, జనాభా లెక్కలకు సంబంధించిన సామగ్రిని అప్పటికే దేశవ్యాప్తంగా పంపించామని ఓబీసీ కులగణన వీలుకాదని తెలుపుతూ, ప్రత్యేకంగా సామాజిక, ఆర్థిక కులగణన చేస్తామని తెలిపింది. అందుకనుగుణంగా 2011లో దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక కులగణన చేపట్టినప్పటికీ నేటికీ ఆ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. నేడు దేశవ్యాప్తంగా ప్రాంతీ య పార్టీలు 2021 జనాభా లెక్కల్లో కులగణన చేయాలని ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ద్వంద్వ వైఖరిని అనుసరిస్తూ కాలయాపన చేస్తున్నాయి.
1953లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కాకా కాలేల్కర్ అధ్యక్షతన నియమించిన మొదటి జాతీయ బీసీ కమిషన్ నుంచి నేటిదాకా అనేక రాష్ట్ర బీసీ కమిషన్లు, హైకోర్టులు, సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల రక్షణ, పెంపుకోసం బీసీల కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాలకు సూచించాయి. ఆమోదించదగిన, అధికారిక ఓబీసీ కులాల గణాంకాలు లేనందున కేంద్ర, రాష్ర్టాల్లోని విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో అమలు కావడం లేదు. ఫలితంగా కేంద్ర ఉద్యోగాల్లో 1993 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతం అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ అన్ని క్యాటగిరిల్లో ప్రాతినిధ్యం 21 శాతానికి మించలేదు. అదేవిధంగా చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు లేనందున లోకసభ, అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం 20 శాతానికి మించడం లేదు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో, నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు తప్పనిసరి అని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. కుల ప్రాతిపదిక రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయరంగాల్లో సమాన అవకాశాలు లభించి, ఆయా కులాలకు సమాజంలో గౌరవం పెరిగి, కులాంతర వివాహాలకు దారితీసి, కులరహిత సమాజం ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 2021 జనగణనలో కులాలవారీగా జనాభా లెక్కలు తీయడానికి రాజ్యాంగ సవరణ ద్వారా చర్యలు తీసుకొని, దేశంలోని 50 శాతానికి పైగా జనసంఖ్య గల ఓబీసీ/ బీసీ కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం)
-కోడెపాక కుమారస్వామి
94909 59625