భారతీయ అస్తిత్వంలో చేనేత రంగానికి విశిష్ట స్థానం ఉన్నది. జాతీయోద్యమ కాలంలోనూ చేనేత, ఖాదీ వస్ర్తాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇక్కడి నేతన్నల నైపుణ్యం వేనోళ్ల కొనియాడబడింది. దేశ సంస్కృతీ, సంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీకగా నిలుస్తున్నది. దేశ నాగరికతకు చేనేత, ఖాదీ వస్ర్తాలు నిలువెత్తు నిదర్శనం. మనదేశంలో ఉత్పత్తి అయ్యే కంచి, బనారస్, మైసూర్, పోచంపల్లి, ఛందేరి, పైటానా, కశ్మీరీ, బెంగాలీ, ఒడియా, రాజస్థానీ, సంబల్పూర్, చీరాల, మంగళగిరి మొదలైన వస్ర్తాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. నేటికి ముప్పై లక్షల చేనేత మగ్గాల మీద కోటి మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పెంచి మగ్గానికి ఉరి వేయ చూస్తున్నది.
ప్రకృతికి అనుకూలంగా, తక్కువ పెట్టుబడితో, విద్యుత్తు లేకుండా కాటన్, పట్టు దారాలతో బట్టలు తయారు చేసే చేనేతరంగం ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నది. దేశంలోని మొత్తం వస్త్ర పరిశ్రమలో మిల్లులు, మరమగ్గాలు 90 శాతం ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటే చేనేత రంగం వాటా పది శాతమే. అయినా భారత ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయటం లేదు. గడిచిన దశాబ్దకాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల 13 లక్షల చేనేత మగ్గాలు మూతపడ్డాయి. సరైన బడ్జెట్ కేటాయించకపోవటం, 12 శాతం జీఎస్టీ విధించటంతోపాటు కరో నా సంక్షోభంతో చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి.
చేనేత పట్ల మోదీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. బీజేపీ లోకల్ టు గ్లోబల్ అనే నినాదంతో జాతీయ చేనేత దినోత్సవాలు జరుపుతున్నది. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనే తమ లక్ష్యమని చెప్తున్నది. కానీ 2022 జనవరి 1 నుంచి చేనేత వస్ర్తాలపై జీఎస్టీ పన్నును 5 నుంచి 12 శాతానికి పెంచింది. చేనేత రంగానికి ఈ జీఎస్టీ పెంపు అశనిపాతంగా తయారైంది. మిల్లులు, మరమగ్గాల పోటీని తట్టుకొని నిలబడుతున్న చేనేత ఒక కళారంగం. ఒక పోచంపల్లి పట్టుచీర నేయడానికి ఒక కుటుంబం వారం రోజులు శ్రమించాల్సి ఉంటుంది. కానీ మిల్లులు రోజుకు వందలాది చీరలు తయారు చేస్తుండటంతో ఉత్పత్తి ధర తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు రాయితీలు కల్పించాలి. కానీ 2017లో 5 శాతం జీఎస్టీని విధించడంతో వందలాది మంది చేనేత కార్మికులు తమ వృత్తిని వదిలి పట్టణాలకు వలసపోయారు.
చేనేత రంగానికి అవసరమైన నూలు, రంగులు, రసాయనాల ధరలు గతంతో పోలిస్తే 40 శాతం పెరిగాయి. కాటన్, పట్టు దారాల ధరలు 60 శాతం పెరిగాయి. ఈ సందర్భంలో జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాల్సిన కేంద్రం మరింత పెంచి చేనేత పరిశ్రమను సమాధి చేయ జూస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్న చేనేత రంగాన్ని దెబ్బతీయటం అంటే దేశ ఆర్థిక వ్యవస్థను పాతాళంలోకి నెట్టి వేయడమే. మరోవైపు ‘ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు’ రద్దు నిర్ణయంతోనే కేంద్రానికి చేనేత రంగ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్నది.
కేంద్రం చేనేత పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేనేతకు పెద్ద పీట వేస్తున్నది. రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడి చేనేత, మరమగ్గాల రంగం అభివృద్ధి వైపు సాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు సమానంగా రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించడం వల్ల ఈ రంగాలు నిలదొక్కుకున్నాయి.
మగ్గాల లెక్కలను జియోట్యాగ్తో అనుసంధానించి నేతగాళ్లకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఎఫ్, త్రిఫ్ట్ ఫండ్ కం సేవింగ్ పథకాన్ని చేనేత కార్మికులకు అమలు చేస్తున్నది. కార్మికుడు 8 శాతం పొదుపు చేస్తే దానికి 16 శాతం రాష్ట్ర ప్రభుత్వం కలిపి జమ చేస్తున్నది. నూలు సబ్సిడీ పథకాన్ని 40 శాతం ఇస్తూ చేనేత రంగానికి అండగా నిలుస్తున్నది. పాఠశాలల యూనిఫాం దుస్తులు, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల మరమగ్గాల ద్వారా ఏటా రూ. 400 కోట్ల వస్త్ర ఉత్పత్తులను తయారు చేయిస్తున్నది. ఇలా కేసీఆర్ నాయకత్వంలో జౌళిశాఖామంత్రి కేటీఆర్ వస్త్ర పరిశ్రమ పురోభివృద్ధికి నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ముందడుగు వేసింది. చేనేత రంగంపై జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కేంద్రానికి ఇటీవలే లేఖ కూడా రాశారు.
రాష్ట్ర అవతరణ అనంతరం కేసీఆర్ దార్శనికత వల్ల వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి వచ్చాయి. చేనేత మంత్రి కేటీఆర్ పిలుపునందుకున్న యువతరం వారానికొకసారి చేనేత వస్ర్తాలు ధరిస్తూ చేనేత రంగాన్నిప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 20 వేల చేనేత మగ్గాలు, 40 వేల మరమగ్గాల మీద 60 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నాయి. సంవత్సరానికి రూ.2 వేల కోట్ల విలువైన వస్ర్తోత్పత్తి మన రాష్ట్రంలోనే జరుగుతున్నది.. 336 చేనేత సహకార సంఘాలతో పాటు టెస్కో అనే చేనేత మార్కెటింగ్ సంస్థ పని చేస్తున్నది..
సంక్షేమ అభివృద్ధి పథకాలకు లబ్ధిదారుల సంఖ్య ఎంతో అవసరం. ఆ విషయాన్ని గుర్తెరిగి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేత మగ్గాల సంఖ్యను, మరమగ్గాల సంఖ్యను శాస్త్రీయంగా డాక్యుమెంట్ చేసింది. కార్షీ సంస్థ సహకారంతో రాష్ట్రంలోని కార్మికుల ఫొటో వివరాలతో పాటు ప్రతి మగ్గానికి ఒక జియోట్యాగింగ్ చేసింది. ఇది దేశంలోనే తొలిసారి. దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా పనిచేస్తుంది. నెలకు రూ.4 వేలు లబ్ధి చేకూరుతుంది.
చేనేత వస్ర్తోత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రస్తుతం ఉనికిలో ఉన్న టెస్కో స్థానంలో చేనేత కార్పొరేషన్, పవర్లూం కార్పొరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కార్పొరేషన్లు పని ప్రారంభిస్తే నేత కార్మికులకు మరింత నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయి.
(ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం)
-కర్నాటి విద్యాసాగర్
94913 93999