దేశ జనాభాలో యాభై శాతానికి పైగా బీసీ వర్గాల సంఖ్య ఉన్నప్పటికీ, కేంద్రం వారికోసం ఒక మంత్రిత్వ శాఖనూ ఏర్పాటు చేయలేదు. స్వాతంత్య్రానంతరం ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరికి, అణచివేత ధోరణికి ఇది నిదర్శనం. బీసీలకు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నట్టయితే వారి సమస్యలు, పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని బీఆర్ఎస్ మొదటి నుంచి భావిస్తున్నది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తొలి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్ 14న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా కేంద్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అనేది శుష్కనినాదమేనని, బీజేపీ ప్రభుత్వ ఎజెండాలో బీసీ కులాల వికాసం లేనే లేదని స్పష్టంగా తేలిపోయింది. బీజేపీ అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక వైఖరిని దేశంలోని అన్ని వర్గాలూ నిరసిస్తున్నాయి. తమ జనా భాకు అనుగుణంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు బీసీలకు లభించడం లేదు. దీనికి ప్రధా న కారణమేమంటే బీసీ కులాలకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు లేకపోవడమే. ఒక దేశం సామాజిక సమగ్ర స్వరూపాన్ని అవగాహన చేసుకోవడంలో గణాంకాలు కీలకపాత్ర పోషిస్తాయి.
Statistics with out planning has no fruit, planning with out statistics has no root. (ప్రణాళిక లేని గణాంకాలతో ఫలితం ఉండదు, గణాంకాలు లేని ప్రణాళికలతో ప్రయోజనం ఉండదు) అని ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్’గా పేరుగాంచిన మహాలనోబిస్ పేర్కొన్నారు. 1953లో ఏర్పాటుచేసిన కాలేల్కర్ కమిషన్ ఆ తర్వాత వచ్చిన అనేక కమిషన్లు బీసీ వర్గాల జనగణన చేయాలని సిఫారసు చేశాయి. నెహ్రూ నుంచి మోదీ వరకూ ఏ ప్రభుత్వమూ ఆయా కమిషన్ల సిఫారసులను పట్టించుకున్న పాపాన పోలేదు.
దేశంలో మెజారిటీలైన బీసీల జనగణన చేయకుండా, ఆ వర్గాల అభివృద్ధిని పట్టించుకోకుండా కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. కేంద్రం అవలంబిస్తున్న విధానాలతో విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే తగిన వివరాల్లేకుండా ఏ వర్గాన్నైనా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎలా రచిస్తారంటూ సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్న ఆలోచింపదగినది. కచ్చితమైన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికారచన, విధాన నిర్ణయాలు జరగాలనేది ప్రాథమిక అవగాహన. అందుకే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనే సీఎం కేసీఆర్ ‘సమగ్ర కుటుంబ సర్వే’ను విజయవంతంగా జరిపి, రాష్ట్రంలోని ప్రజల మొత్తం వివరాలను ఒకే ఒక్క రోజులో సేకరించటం గమనార్హం. నేడు దేశంలో ఒక్క తెలంగాణలోనే నిర్దిష్ట, సమగ్ర, స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ‘సమగ్ర కుటుంబ సర్వే’ ద్వారా సేకరించిన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికలు రూపకల్పన చేస్తుండటం వల్లనే తెలంగాణ ప్రభు త్వం అట్టడుగుస్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సక్రమంగా అందించగలుగుతున్నది.
తాజాగా రూపొందించిన కచ్చితమైన గణాంకాలతోనే అభివృద్ధి, సంక్షేమంలో బీసీ ప్రజలకు న్యాయమైన వాటా లభిస్తున్నది. కానీ ఈ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలుచేయడంలో దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ విఫలమయ్యాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా 75 ఏండ్లలో దేశంలోని బీసీ వర్గాలకు దక్కాల్సిన ఫలాలు దక్కలేదు. దీనంతటికీ కారణం దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలే. అందుకే, రాబోయేకాలంలో జరపబోయే జనాభా గణనలో కులాలవారీగా, బీసీ వర్గాల జనాభా లెక్కలు సేకరించాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు 2021 అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి మరోసారి పంపింది. అయినా ఈ అంశంపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. నాన్చివేత ధోరణి అవలంబిస్తూ, బీసీ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నది.
బీసీల వివరాల సేకరణ విషయంలో ఇటీవల సుప్రీం ముందు కేంద్రం తన అశక్తతను వ్యక్తం చేసింది. 2011 నాటి జనగణన సందర్భంగా సేకరించిన బీసీల వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇక ముందు ఈ వివరాలను సేకరించలేమని కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. బ్రిటిష్ హయాంలో మన దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఇప్పటికీ అవే లెక్కలపై ఉజ్జాయింపుగా ఆధారపడతామని చెప్పడం శోచనీయం. పరాయి పాలకుల స్థాయిలో కూడా మనం వివరాలు సేకరించుకోలేమా అని సగటు భారతీయుడు ప్రశ్నిస్తున్నాడు? ఈ కీలకమైన అంశంపై బీజేపీ ఎన్నికల ముందు ఒక తీరు, తర్వాత మరో తీరుగా మాట మార్చడం గర్హనీయం.
బీసీ గణన గురించి ఏనాడూ మాట్లాడని నరేంద్ర మోదీ, ఎన్నికలకు ముందు 2018లో బీసీ కులగణన చేపడుతామని, రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని మర్చిపోయారు. కొందరు చెప్తున్నట్టుగా కులాల వివరాలు సేకరిస్తే వైషమ్యాలు పెరుగుతాయనేది అర్థం లేని వాదన. సామాజిక అంతరాలు తొలగించి, సామరస్యం సాధించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడే వైషమ్యాలు చోటుచేసుకుంటాయి. అంతేకానీ గణాంకాలు సేకరించడం వల్ల కాదు. జనగణన అంటే అడవిలో జంతువులను లెక్కించినట్టు కాదు. ప్రజల సమగ్ర వివరాలు విధానకర్తలకు, సామాజిక పరిశోధకులకు ఉపయోగపడాలి. ఏయే ప్రాంతాల్లో, ఏయే వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలువకుండా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడమంటే చీకట్లో బాణం వేయడమే. సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలున్న మన సమాజంలో గణాంకాలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కులాలవారీ జనగణన అవసరాన్ని గుర్తించాలి. లేకుంటే బీసీ వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచి, తక్షణమే బీసీ వర్గాల జనగణనను చేపట్టాలె. బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలె.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
-కర్నాటి విద్యాసాగర్
94913 93999