2009 నవంబర్ 29న కేసీఆర్ మొదలుపెట్టిన ఆమరణ దీక్షతో దిగొచ్చిన కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కానీ సీమాంధ్ర నాయకుల ఒత్తిడి కారణంగా కొన్నేండ్లు ఆ ప్రక్రియను పక్కనపెట్టింది. అయితే 2011 నుంచి తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రి మండలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించింది.
భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటులో భాగంగా 1956లో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు, ఆంధ్ర రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. వరంగల్ నుంచి కొంత ప్రాంతాన్ని, గోదావరి జిల్లాల నుంచి భద్రాచలాన్ని, దండకారణ్యం ప్రాంతాన్ని కలిపి ఖమ్మం జిల్లాను ఏర్పరచారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మొదలైంది. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉద్ధృత రూపం దాల్చింది. 1979లో హైదరాబాదు జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని వేరు చేసి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటుచేశారు. 2001, ఏప్రిల్ 27న కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ మొదలుపెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచింది. ఢిల్లీ పాలకులు స్పందించి రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు మూలమైన నేపథ్యం, నివేదిక ఇచ్చాయి. 2009 డిసెంబర్ 9న కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అయితే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఒత్తిడి తేవడంతో కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పక్కన పెట్టింది. ఈ ఆలస్యం తెలంగాణ ఉద్యమకారుల్లో మరింత ఉద్రేకాన్ని రగిల్చింది. ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. దీంతో కేంద్రంలో కదలిక వచ్చింది. 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్సభ, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించాయి. 2014 జూన్ 2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ తొలి, మలి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తున్నది.
-రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494