ప్రధాని మోదీ మిత్రుడు అదానీ కార్పొరేట్ మోనోపొలీ, దానిలో ఉన్న క్రోనీ క్యాపిటలిజం నిజ స్వరూపాన్ని హిండెన్బర్గ్ నివేదిక బయటపెట్టింది. స్వాతంత్య్రానంతరం దేశంలో జరిగిన అతిపెద్ద ఆర్థిక నేరం నుంచి తనను, తన మిత్రుడిని రక్షించుకోవడం కోసం ప్రధాని మోదీ ప్రజల దృష్టిని మళ్లించారు. ఇందుకోసం తన గుప్పిట్లో ఉన్న సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో దాడులకు తెరలేపారు. అందులో భాగంగానే ఆప్ నేత మనీష్ సిసోడియా అరెస్టు, ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుటుంబంపై సీబీఐ దాడులు, భారత జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది.
మొత్తంగా దేశ బహుళత్వ సాంస్కృతిక వైవిధ్యాలపై, భిన్నత్వంలో ఏకత్వ భావనలపై దాడులు చేస్తూ అసమానతలతో కూడిన జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తున్నది. దీన్ని ప్రజాస్వామ్య ప్రగతిశీల శక్తులు ప్రతిఘటించి, మహోజ్వల భారత పునర్నిర్మాణానికి నడుం బిగించాలి.
కాంగ్రెస్ బలహీనపడిన మాట వాస్తవం. దీంతో 2024 సాధారణ ఎన్నికలు బీజేపీకి నల్లేరుపై నడక వలె కనిపించాయి. అయితే కేసీఆర్ రూపంలో ఆ నమ్మకం ప్రమాదంలో పడింది. తెలంగాణను సాధించి నవ తెలంగాణను నిర్మించిన కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో తనదైన తెలంగాణ మాడల్తో బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం, దాన్ని దేశవ్యాప్తం చేయడం మోదీకి మింగుడు పడటం లేదు. కేసీఆర్కు ఉన్న ఉద్యమ, పరిపాలనానుభవం, రాజకీయ చతురతతో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొస్తుండటంతో బీజేపీలో కలవరం మొదలైంది. అందుకే కేసీఆర్ను తెలంగాణ నుంచి బయటికి కదలనివ్వకుండా ఉంచడం కోసం వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చి, దర్యాప్తు పేరిట వేధిస్తుంది.
బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్కుమార్ బీజేపీ నిజస్వరూపాన్ని గుర్తించి తన పాత మిత్రుడైన లాలూతో కలిశారు. సోషలిస్టులు విడిపోవడం వల్ల ముఖ్యంగా ఓబీసీ ఓట్లలో చీలిక తేవడం ద్వారా బీహార్, యూపీలలో బీజేపీ ఇప్పటివరకు లబ్ధి పొందుతూ వస్తున్నది. లాలూ, నితీష్ల కలయికతో సోషలిస్టులందరూ ఐక్యమైతే, ముఖ్యంగా అది యూపీకి కూడా విస్తరిస్తే అత్యంత ప్రమాదమని మోదీ గుర్తించారు. గతంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ఉద్యోగుల నియామకంలో అవకతవకలు జరిగాయనే నెపంతో లాలూ కుటుంబంపై సీబీఐ దాడులకు పాల్పడుతున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను అరెస్టు చేయడం ద్వారా బీహార్లోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం కేంద్రం చేస్తున్నది. ఇదిలా ఉంటే అదానీ ఆర్థికనేరాలపై దర్యాప్తు చేయమని యావత్ భారతం ముక్తకంఠంతో నినదిస్తున్నది. జేపీసీ వేయమంటే, సెబీతో దర్యాప్తు జరిపించమంటే తేలు కుట్టిన దొంగలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు.
1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించి తన రాజకీయ ప్రత్యర్థులందర్నీ జైళ్లలో బంధించారు. అట్లాగే నేటి ప్రధాని నరేంద్ర మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ ద్వారా తన చెప్పుచేతుల్లో ఉన్న సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను వాడుకొని తన రాజకీయ ప్రత్యర్థులందరిపై అవినీతి ముద్ర వేస్తూ జైళ్లలో బంధిస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల కమిషన్, గవర్నర్ వ్యవస్థలను వాడుకొని ప్రజా ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్నారు.
2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ఒక వ్యూహం ప్రకారం రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద, సమాఖ్య భావనలకు వ్యతిరేకంగా పని చేస్తున్నది.
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయడం ద్వారా తమ దీర్ఘకాలిక అజెండా అయిన ‘ఒక దేశం-ఒక పార్టీ’ అనే లక్ష్యసాధన కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. అందుకే ప్రాంతీయ పార్టీలను కుల, కుటుంబ, అవినీతి పార్టీలుగా ముద్రవేసి వాటిని ప్రజల్లో అవినీతి పార్టీలుగా, ఆ పార్టీల అధినాయకులను అవినీతిపరులుగా ముద్ర వేయడం కోసం మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలను వాడుతున్నది.
భారతదేశంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యర్థులపై అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేస్తున్నది. దానికోసం చరిత్రను కూడా వక్రీకరిస్తున్నది. అది సమకాలీన రాజకీయ ప్రత్యర్థులపైనే కాకుండా జాతి నిర్మాతలైన గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్ల వ్యక్తిత్వాలపైనా దాడిచేసి వారిని అగౌరవ పరుస్తున్నది. సా మ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యస్ఫూర్తికి వ్యతిరేకంగా, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వ భావనలకు వ్యతిరేకంగా తమ అనుకూల మీడియాలో యూట్యూబ్, వా ట్సాప్, ట్విటర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది. దేశంలోని ప్రజలకు ముఖ్యంగా యువతకు రాజ్యాంగం పట్ల విశ్వాసం సన్నగిల్లే లాగా అసహనం, అశాంతి, విభజనవాదం, విద్వేష, మూకవాదనలను ప్రచారం చేస్తున్నది. చట్టాలను, కోర్టులను తమ చేతుల్లోకి తీసుకొని తామే న్యాయం చేసే బుల్డోజర్ బాబాలను గౌరవించడం అనే ఒరవడికి పునాది వేస్తున్నది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భవిష్యత్తు లో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బుల్డోజర్ పాలనను తీసుకొస్తామని బాహాటంగానే ప్రకటించడమే దానికి ఉదాహరణ.
రాజ్యాంగంలోని సామ్యవాద, లౌకిక, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా, సీఏఏ, ఎన్ఆర్సీ, 370 ఆర్టికల్ సవరణ, సమాఖ్యస్ఫూర్తిని దెబ్బతీస్తూ హిందీ భాషను దేశ ప్రజలపై రుద్దడం వంటి చర్యలకు మోదీ సర్కార్ పాల్పడుతున్నది. మొత్తంగా దేశ బహుళత్వ సాంస్కృతిక వైవిధ్యాలపై, భిన్నత్వంలో ఏకత్వ భావనలపై దాడులు చేస్తూ అసమానతలతో కూడిన జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తున్నది. దీన్ని ప్రజాస్వామ్య ప్రగతిశీల శక్తులు ప్రతిఘటించి, మహోజ్వల భారత పునఃనిర్మాణానికి నడుం బిగించాలి.
డి.రాజారాం యాదవ్
97051 31472