క్రైస్తవ, ముస్లిం మతాలు స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులందరికీ మత స్వాతంత్రపు హక్కు ఉందని కేంద్రం గుర్తించాలి.
మతం అంటే వ్యక్తుల లేదా సమాజాల విశ్వాసానికి సంబంధించిన విషయం. దానిని కులంతో ముడి పెట్టడం సరికాదు. పూర్వం నుంచీ కులం వృత్తుల పరంగా ఆపాదించబడింది. ఈ నేపథ్యంలో మతం మారిన వారికి కులం వెనుకబాటు ఆధారంగా వచ్చిన రిజర్వేషన్ ఎలా పోతుంది? వెనుకబడిన కులాల ప్రజలపై వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు, 341 ప్రకారం ఎస్సీలకు, 342 ప్రకారం ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. నేడు దేశంలో మతం మారిన ఓసీ, బీసీ, ఎస్టీ కులాల ప్రజలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అయితే మతం మారిన దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఇవ్వలేమంటున్నది కేంద్ర ప్రభుత్వం. ఇది మత స్వేచ్ఛ విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కాదా? మతం మారిన దళిత క్రైస్తవులకు, ముస్లింలకు ఎస్సీ హోదా తొలగించడం ముమ్మాటిటీ రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది! సిక్కులుగా, బౌద్ధులుగా మతం మారిన వారికి దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగిస్తున్న కేంద్రం క్రైస్తవులుగా, ముస్లింలుగా మారిన దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఇవ్వలేం అనడం ఆయా మతాలపై, దళితులపై చూపుతున్న వివక్షకు నిదర్శనం.
రెండేండ్ల క్రితం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలో మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే విషయాన్ని పరిశీలించమని కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఈ కమిషన్ రిపోర్టు ఇవ్వకముందే కేంద్ర ప్రభుత్వం మతం మారిన దళిత క్రైస్తవులకు, ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వలేమని అఫిడవిట్ సమర్పించింది. ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన వాదనను బలపరచాలని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్పై ఒత్తిడి తెచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. కానీ మతం మారిన దళితులు నేటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని కేంద్రం గుర్తెరగాలి. మతం మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్ తీసివేస్తే వారు మరింత వెనకబడతారని గ్రహించాలి. దళిత క్రైస్తవులు, ముస్లింల అభ్యున్నతికి తోట్పడేలా రిజర్వేషన్లు కల్పించాలి.
-యేకుల సురేష్
99661 02987