నీరసించిన సిరిసిల్లను నింగికి ఎగిసేలా పురోగమింపజేసిన కేటీఆర్ తమ గుండెల నిండా ఉన్నాడని సెస్ ఎన్నికల తీర్పుతో మరోసారి తాజాగా చూపెట్టారు స్థానిక విద్యుత్ వినియోగదారులు. కడపటి సమాచారం మేరకు సెస్లోని 15 డైరెక్టర్ స్థానాలకు గాను 14 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులను విజేతలను చేశారు. చైర్మన్ సీటు సునాయాసంగా సొంతం చేశారు. కేటీఆర్ ఒకే ఒక్క టెలికాన్ఫరెన్స్ ప్రభావవంతంగా ఊతమిచ్చింది. రకరకాల భాష్యాలు, ఊహాగానాలకు మళ్ళీ తెరపడింది.
కేసీఆర్ సర్కారుకు, రైతాంగానికి ఉన్న గాఢమైన సంబంధానికి ప్రతీకగా తాజాగా సెస్ ఏకపక్ష తీర్పు ప్రతిఫలించింది. రైతు లోకానికి కేసీఆరే శ్రీరామరక్ష అని అప్ డేటెడ్ జడ్జిమెంట్ ఇచ్చిం ది. రాష్ట్రంలోని సగటు ప్రజల మదికి అద్దం పట్టింది. ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ పగటి కలలను పటాపంచలు చేసింది. తనకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల అంటూ కేటీఆర్ తన అవిభాజ్య ప్రేమ గురించి చెబుతుంటారు. సిరుల సిరిసిల్లగా పేరు నిలబెట్టిన కేటీఆర్కు అండగా అవి ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలు ఏవైనా సింహ భాగం మద్దతుగా నిలుస్తారు స్థానిక ప్రజలు. నాయకుడికి, ప్రజలకు మధ్య ఉండాల్సిన సంబంధ బాంధవ్యాలకు ప్రతీక సిరిసిల్లతో కేటీఆర్, కేటీఆర్తో సిరిసిల్లకు ఉన్న అనుబంధం. తమ బాగోగుల గురించి అనునిత్యం నిత్యనూతనంగా ఆలోచించి అమల్లోకి తెచ్చే కేటీఆర్ వెంటే మేము అని తిరుగులేని కంకణబద్ధమైన నిబద్ధతను నిలబెట్టుకున్నా రు. సిరిసిల్లకు ఇంకా మరేదైనా మేలు చేయగలిగేది కేటీఆర్ మాత్రమేననే గట్టి నమ్మకాన్ని తమ నికార్సయిన జడ్జిమెంట్ ద్వారా నిరూపించారు.
రామన్నతో ఎవరూ వేరుచేయలేని తమ అనుబంధాన్ని ప్రతిబింబించారు. లోకల్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నా, తమకు కావాల్సింది కేటీఆర్ నాయకత్వం, యువ మంత్రి సేవలేనని సెస్పై గులాబీ జెండా రెపరెపల సాక్షిగా గెలుపు సంత కం చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారులను బ్రహ్మాండంగా ఎన్నుకొని, సెస్, చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టారు. టీఆర్ఎస్కు బీఆర్ఎస్గా ఈసీ అధికారిక ఆమోదం తర్వాత ప్రప్రథమంగా నిర్వహించిన సెస్ పాలక వర్గం ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రజామోదం అలవోకగా ప్రస్ఫుటమైంది. సహకార ఉద్యమాల స్ఫూర్తి మాదిరి బీఆర్ఎస్ దేశ వ్యాప్త సేవలకు ప్రేరణ పంచింది. కేసీఆర్ పట్ల తమ మమకారం పెంచింది.
సిరిసిల్ల సిగలో వెలుగు జిలుగుల నగ.. సహకార విద్యుత్తు సరఫరా సంఘం(సెస్). మిగతా ప్రాంతాలకు భిన్నంగా స్థానికంగా కరెం ట్ సరఫరా, సేవలు అందించే మన రాష్ట్రంలోని ఏకైక సంస్థ. సెస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పూర్తిగా (13 స్థానాలు), మానకొండూరు, చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్లలో పాక్షికంగా (2 స్థానాలు) విస్తరించి ఉన్నది. సెస్ స్థానికంగా ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. వ్యవసాయ క్షేత్రాలు, దాని అనుబంధ రంగాలు, వ్యాపార వాణిజ్య కేంద్రాలు, గృహాలు ఇట్లా విద్యుత్ అవసరం ఉండే ప్రతి ఒక్కరితో సెస్ అనుబంధం దశాబ్దాలుగా పెనవేసుకున్నది. సిరిసిల్ల ప్రత్యేకతలలో ఒకటిగా వినుతికెక్కింది. సహకార ఉద్యమాల స్ఫూర్తికి చిహ్నమైన సెస్ తెలంగాణ ఉద్యమానికీ కాగడా పట్టింది. సెస్ పరిధిలోని వినియోగదారుల కుటుంబాలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మొన్నటి వరకు టీఆర్ఎస్ వెంట నడిచాయి. రైతాంగానికి సేద్యాన్ని పండుగ చేసింది తెలంగాణ. అదే అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు, చిట్ట చివరి పౌరుల దాకా అందాలన్నది కేసీఆర్ ఆలోచన. తెలంగాణ పాలనను దేశానికి విస్తరించడమే ధ్యేయంగా బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ రూపాంతరం చెందింది. అధికారికంగా ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు సెస్కు జరిగాయి.
పార్టీ గుర్తుల రహిత ఎన్నికలు అయినప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బలపరిచిన అభ్యర్థులు ప్రధానంగా పోటీ చేశారు. సాంకేతికంగా పార్టీల పరమైన ఎన్నికలు కాకపోయినప్పటికీ అదే వాతావరణం, అచ్చు అటువంటి పరిస్థితుల మధ్యనే ఎన్నికలు జరిగాయి. సగటు ఓటరు అంతరంగాన్ని ఆవిష్కరించాయి. సాధారణ ఓటర్ల నాడిని వినిపించాయి. 87వేలకు పైగా ఓటర్లు ఉన్న సెస్లో 15 స్థానాలకు గాను 75 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 73వేలమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అన్నం ఉడికినట్టు ఒక మెతుకు నిర్ధారించే పద్ధతిలా రాష్ట్రం మొత్తం మెజారిటీగా బీఆర్ఎస్, కేసీఆర్తోనే ఉన్నట్టు సెస్ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి. అధికారికంగా గుర్తింపు పొందాక తొట్టతొలి ఎన్నికలు బీఆర్ఎస్ కు శుభారంభం పలికాయి. సహకార ఉద్యమాల మోటివేషన్ ప్రాతిపదికన దేశానికీ కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ దిక్సూచిగా నిలవనున్నది. క్షేత్ర స్థాయి నుంచి మీ వెంటే మేమంటూ సెస్ వాడకం దారులైన రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు చాటి చెప్పారు. సిరిసిల్ల స్పెషాలిటీగా రాష్ట్రం, దేశ వ్యాప్తంగా యువ సారథి కేటీఆర్ ప్రాతినిథ్యం శిఖర స్థాయిలో ప్రాచుర్యంలోకి వచ్చింది. కేసీఆర్ సర్కారుకు దృఢమైన స్నేహంగా సెస్ ఎన్నికల్లో పవర్ ఫుల్ తీర్పు సర్వత్రా సెంటరాఫ్ ఎట్రాక్షన్. అభివృద్ధి వెలుగు జిలుగులు విరజిమ్ముతున్న సిరిసిల్లలో సెస్ ఫలితాలు సరికొత్త ఉరిమే ఉత్సాహాన్నిచ్చాయి. కేటీఆర్ ప్రాతినిథ్యం తమ అదృష్టంగా గర్వపడే సిరిసిల్ల సెస్ ఓటర్లు తమ కృతజ్ఞత, అభిమానం, వాత్సల్యాన్ని సార్వత్రిక ఎన్నికల ముందు వెలిబుచ్చడం శుభసూచకం. సిరిసిల్ల-కేటీఆర్ అనుబంధాన్ని మరింత దృఢంగా, మరింత దగ్గరగా, విడదీయలేనంత విశ్వాసం ప్రదర్శించారు. సిరిసిల్ల ప్రజల కోసం నిరంతరం పరితపించే యువ మంత్రి కేటీఆర్ ఆకాంక్ష, నమ్మకాన్ని ప్రతిఫలించారు. రైతాంగానికి వెన్నుదన్నుగా దేశ వ్యాప్తం కాబోతున్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు తొలి అడుగుగా సెస్ జయకేతన ఆత్మీయతను జోడించింది. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్కు, యువ నేత కేటీఆర్కు జేజేలు పలికింది.
– ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384
(వ్యాసకర్త : ఇండిపెండెంట్ జర్నలిస్ట్)