నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బహుముఖాలుగా నడిచింది. అపారమైన మేధస్సుతో పాటు అద్భుతమైన వాగ్ధాటి, తెలంగాణకు సేవ చేయాలన్న తపన, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష గల ఒకే ఒక్కడి కోసం అరువై ఏండ్లు ఎదురుచూసిందీ గడ్డ. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రజల ఎజెండాగా 2001 మే 17న ‘సింహగర్జన’ పేరుతో కరీంనగర్ జిల్లాలో తొలి బహిరంగ సభ నిర్వహించింది. 200 వాహనాలతో ఉదయం 10 గంటలకు ప్రారంభమై 8 గంటల పాటు జరిగిన కేసీఆర్ ర్యాలీకి దారిపొడుగునా మంగళహారతులు పట్టారు జనం. అడుగడుగునా ‘జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. అప్పటికే సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబూ సొరేన్ జన సందోహాన్ని చూసి తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా పునరుద్ధరిస్తున్నారంటూ కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. అదే స్ఫూర్తితో ఒక్క నెలలోనే మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ బహిరంగసభలు నిర్వహించి ఉద్యమంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీచేసి, అసంతృప్తితో రగులుతున్న తెలంగాణ ప్రజలను రాష్ట్రఏర్పాటు దిశగా నడిపించింది టీఆర్ఎస్. అనతికాలంలో జూలైలో వచ్చిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో 1040 ఎంపీటీసీలు, 85 జడ్పీటీసీలు గెలుపొందడం రెండు జిల్లా పరిషత్లు, 87 మండల పరిషత్లు కైవసం చేసుకోవడంతో ఎన్నో ఏండ్ల నుంచి తెలంగాణ పడుతున్న బాధలకు, కన్నీళ్ళకు ప్రతీకలుగా నిలబడ్డ సబ్బండవర్గాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు.
అదో విజయగర్వ యాత్ర. అదొక పోరాట ప్రతీక. అదొక బలమైన అస్తిత్వ ప్రతీక. అదొక జన సంగీత సామూహిక స్వరం. గుండె మండిన తెలంగాణ గుర్తులు. నెత్తుటి మరకలు. ఆదో ప్రయాస… ఎవ్వరినీ మన్నించే విధంగా లేరంటే అతిశయోక్తి కాదేమో. భరతమాత కంటి‘తడిని’ మంటి తడిగా మార్చేందుకు హృదయతడిని పెంచుతున్న కేసీఆర్ గుండెచప్పుడు కోట్లాది రైతన్నలకు తెలుసు.
ఆరు దశాబ్దాల తెలంగాణ చరిత్ర పరిశీలిస్తే ఒక్కటి మాత్రం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. తెలంగాణ కోసం నిజాయితీగా నినాదాలు వచ్చినప్పుడల్లా.. ఈ నేల హారతి పట్టింది. అయినప్ప టికీ, స్వరాష్ట్ర సాధన సాధ్యం కాలేదు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఈ భూమి నెత్తురొడ్డినదో? ఈ భూమి ఎన్ని కన్నీళ్లు పెట్టిందో తెలియదా? కానీ, తెలంగాణకు ఒక లక్షణం ఉంది.. పడినప్పుడల్లా లేచి నిలబడ్డది. గాయపడినప్పుడల్లా నెత్తుటి కోలాటమాడింది. అటువంటి తెలంగాణకు ఆశాకిరణం అయ్యారు కేసీఆర్. ఉద్యమనేతగా అద్భుతమైన ఆవిష్కరణలు చేసి తనకు సాటిలేరని నిరూపించుకున్నారు.
‘ఒకసారి మోసపోయి 60 ఏండ్లు దగాపడ్డాం, 1969లో అమలైన కుట్రలకు మళ్లీ బలికావొద్దు. ఒక్కసారి ఓడిపోతే అనుభవాలను క్రోడీకరించి మళ్లీ గెలువచ్చు కానీ, ఉద్యమ పథం వీడితే కొట్టిచంపండి’ అని జ్ఞాన కొలిమినే రాజేశారు కేసీఆర్. తెగదెంపుల సంగ్రామంలో ముందుకు ఉరుకుతున్న స్వరాలవి. తెలంగాణ విషయంలో రెండు నాల్కలతో మాట్లాడేవారిని వదలలేదు. రాజకీయ నాయకులు ఆడే దొంగ నాటకాలను సహించలేదు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న మొండితనం పట్టుదల గమ్యాన్ని ముద్దాడింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ ప్రతిరూపం ‘బీఆర్ఎస్’ స్థాపనతో మరో కొత్త అంకానికి తెర లేచింది.
దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టి, బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోస్తూ, సమాఖ్యస్ఫూర్తికి భంగం కలిగిస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. దేశాన్ని అస్థిరపర్చే ప్రయత్నంగా ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నది. ఎనిమిదేండ్లుగా ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి కేసీఅరే ప్రత్యామ్నాయం. దేశంలో గుణాత్మక మార్పు తేవాలని, దేశానికి తెలంగాణ మాడల్ను విస్తరించాలని, ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలనే కుతూహలంతో బక్క పలుచని వీరుడు కేసీఆర్ వజ్ర సంకల్పంతో 2022 అక్టోబర్ 5న విజయదశమి రోజు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతూ తీర్మానం చేశారు. జనం పటాకులు పేల్చి పండుగ జరుపుకొన్నారు.
2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష కోసం వెళుతున్న తెలంగాణ రథసారధి కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టిన ‘ఆక్టోపస్’ సాక్షిగా ‘తెలంగాణ జైత్ర యాత్రో .. కేసీఆర్ శవయాత్రో’ అని నినదించిన గడ్డ నుంచే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ను దేశవ్యాప్తంగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరి సాక్షిగా నాలుగు రాష్ర్టాలకు కూతవేటు దూరంలో ‘జంగ్ సైరన్’ మొదలైంది. చైతన్యానికి ప్రతీక, ఉద్యమాలకు నెలవైన కమ్యూనిస్టుల ఖిల్లాలో, సాయుధ రైతాంగ పోరాటానికి కాకలుదీరిన యోధులను అందించిన ఖమ్మం జిల్లాలో ఈ నెల 18న బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగసభకు శ్రీకారం చుట్టి అపూర్వఘట్టానికి తెరలేపింది బీఆర్ఎస్. కేంద్రంలోని రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని శపథం చేయడానికి సిద్ధమైంది.
కేసీఆర్ వ్యూహాన్ని చూసి మొండిరోగానికి ఔషధం కనుగొన్నంత ఆనందం దేశంలో విరాజిల్లుతున్నది. దేశంలో మితిమీరుతున్న మత విద్వేష రాజకీయాలకు, ఆశ్రిత పెట్టుబడిదారీవిధానానికి వ్యతిరేకంగా 140 కోట్ల మంది జాగృతమవుతున్నారు.75 ఏండ్ల అమృత మహోత్సవంలో బీఆర్ఎస్ ఆవిర్భావం ప్రజల ఆకాంక్షను తెలియజేసే ప్రభంజనంతో కశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు గులాబీ దండులో క్యూ కట్టడం ఖాయం. ఖమ్మం జిల్లా బహిరంగసభ బీఆర్ఎస్ తొలిపొద్దు.
(వ్యాసకర్త: డాక్టర్ సంగని మల్లేశ్వర్ , 98662 55355, జర్నలిజం శాఖ విభాగాధిపతి, కేయూ)