బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో నిర్వహించిన మూడు బహిరంగ సభలతో ఒక రహస్యం తిరుగులేని విధంగా వెల్లడైంది. దేశంలో ఒకవైపు సామాన్య ప్రజలకు, మరొకవైపు రాజకీయ పార్టీలు, భద్రలోక్ మేధావులకు మధ్య ఒక స్పష్టమైన అగాధం ఉంది. ప్రజలలో వివిధ పార్టీలు, ప్రభుత్వాల పట్ల తీవ్రమైన అసంతృప్తి ఎప్పటి నుంచో పేరుకుని కొనసాగుతున్నది. ఎవరో ఒకరికి యాంత్రికంగా ఓటైతే వేస్తున్నారుగాని తమను ఉద్ధరించగలరనే నిజమైన నమ్మకం ఎవరిపైనా లేదు. అధికారం కోసం పార్టీలు వారిని ఆశ పెట్టటం మామూలే కాగా, సోకాల్డ్ మేధావులు సైతం రకరకాల వాదనలతో వారిని భ్రమపెడుతున్నారు. ఈ భ్రమలను భంగపరిచేందుకు సామాన్యులు సిద్ధంగా ఉన్నారనే రహస్యాన్ని బీఆర్ఎస్ సభలు స్పష్టం చేశాయి.
తరతరాల భారత ప్రజల ఈ విషాదపు లోతులు, వారి స్పందనలలోని రహస్యాలు, కేవలం ఎన్నికల లెక్కలకు పరిమితమయే రాజకీయ నాయకులకు అర్థమయేవి కావు. పలువురు భద్రలోక్ మేధావులకు కూడా అంతుపడుతున్నట్టు లేవు. వారు కూడా ఎన్నికల కాకిలెక్కల చట్రంలో చిక్కుకుపోయారు.
నాందేడ్, కందార్ లోహా, ఔరంగాబాద్ సభలను ఒకసారి జాగ్రత్తగా సమీక్షించండి. అది మహారాష్ట్ర ప్రాంతం. తెలంగాణతో నిజాం కాలంలో పరిపాలనా సంబంధాలు, కొంత మేర ఆర్థిక, సామాజిక సంబంధాలు ఉండినా, ఆ ప్రాంతం వేరే రాష్ట్రంగా విడిపోయి దాదాపు మూడు తరాలు గడిచాయి. ఈ కాలంలో రెండు ప్రాంతాల మధ్య రాజకీయాలు మొదలుకొని అనేకానేక విషయాలలో అనేక అంతరాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ పట్ల ఎవరూ ఊహించని స్థాయిలో, అందరినీ ఆశ్చర్యపరుస్తూ సామాన్య ప్రజల నుంచి అటువంటి స్పందనలు ఎందువల్ల వచ్చినట్లు?
టీఆర్ఎస్/బీఆర్ఎస్ పార్టీగాని, దాని నాయకుడు కేసీఆర్గాని దశాబ్దాలపాటు తెలంగాణ ఉద్యమాలలో, అభివృద్ధిక్రమంలో భాగమై ఉండటం తప్ప, మహారాష్ట్ర పరిణామాలతో ఎప్పుడూ సంబంధం లేదు. అయినప్పటికీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించినదే తడవు మహారాష్ట్ర ప్రజల నుంచి స్పందన అనూహ్యమైన రీతిలో ఒక వెల్లువలా ఎందుకు ఎగిసిపడుతున్నది? వీరు వారని గాక అన్ని వర్గాల ప్రజలు, ఇది అది అని గాక అన్ని పార్టీల వారు ఎందువల్ల ఒక ప్రవాహంగా మారి బీఆర్ఎస్వైపు కదులుతున్నారు? ఎవరూ అంచనాలు వేయలేని విధంగా? ఈ భద్రలోక్ మేధావులకు, సినిక్స్కు కనీస వివేచన ఉంటే నిజాయితీతో ఆలోచించవలసిన ప్రశ్నలు ఇవి.
తెలంగాణలో అన్ని వర్గాల వారి కోసం, బహుముఖమైన విధంగా, 2014 నుంచి జరుగుతున్న అభివృద్ధి, అందుకు దేశ విదేశాలలో లభిస్తున్న గుర్తింపు మహారాష్ట్ర ప్రజల దృష్టికి కొంతకాలంగా వస్తున్న మాట నిజం. ఆ కారణంగా అక్కడి కొన్ని గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలంటూ తీర్మానాలు చేయటం తెలిసిందే. ఒక స్థాయిలో జరుగుతూనే వస్తున్న ఈ విషయాల గురించి కాదు ఇక్కడ ప్రత్యేకంగా చర్చిస్తున్నది. మహారాష్ట్ర గ్రామస్తుల తీర్మానాలు కేసీఆర్ పార్టీకి సహజంగానే సంతోషాన్ని కలిగించి ఉండవచ్చుగాని, అక్కడి ప్రజలలో ఈ విధమైన కదలికలు ఇంత ఉధృతంగా మారగలవని బీఆర్ఎస్ను స్థాపించినపుడు ఊహించి ఉంటారనేందుకు ఆధారాలు లేవు. కొత్త పార్టీ ఏర్పాటు కావటమే తడవు ఈ కదలికలు ఆ కొద్దిపాటి సరిహద్దు గ్రామాలను మహావేగంగా మించిపోయాయి. మొత్తం మరాఠ్వాడను ముంచెత్తి మధ్య మహారాష్ట్ర వరకు చేరాయి. ఈ స్వచ్ఛందమైన వ్యాప్తితో, వేగంతో అటు అక్కడి ప్రజలు, ఇటు బీఆర్ఎస్ నాయకత్వం ఉక్కిరి బిక్కిరవటం స్పష్టంగా కనిపిస్తున్నది.
దీనంతటిలో ఈ వ్యాప్తి, వేగం ఒక విశేషమైతే, పైన అనుకున్నట్లుగా, భిన్న భిన్న వర్గాల ప్రజలూ, వేర్వేరు పార్టీలు అన్నింటికి చెందినవారూ ఆకర్షితులు కావటమన్నది మరింత కీలకమైన విషయం. టీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్గా మారకముందు, సరిహద్దు గ్రామాల రైతులకు, ఇతర గ్రామీణులకు మాత్రం తెలంగాణ అభివృద్ధి పట్ల ఆకర్షణ కలుగుతున్నదని వినేవాళ్లం. వారు ఏ పార్టీల వారనే వివరాలేమీ లేవు. ఆ గ్రామాలకు బయట గల ప్రాంతాలేవీ వార్తల్లోకి రాలేదు. కాని ఆ వార్తలన్ని ఆ కాలంలోనే అనేక జిల్లాలకు, వేర్వేరు వర్గాలకు, అన్ని పార్టీలకు చెందిన లక్షలాదిమంది ప్రజలకు చాప కింద నీరు వలె వ్యాపించిపోయినట్లు ఇపుడు అర్థమవుతున్నది. వరుసగా మూడు సభలు ఒక దానిని మించి ఒకటి విజయవంతం కావటమే ఇందుకు రుజువు. ఈ స్థితికి తగినట్లుగానే మరి అనేక ప్రాంతాల వారు తమ వద్ద సభలు జరపవలసిందిగా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.
ప్రజల నుంచి వస్తున్న ఈ అనూహ్య స్పందనలన్నవి ఈ మూడు సభలు చెప్తున్న ఒక రహస్యమైతే, ఆయా సభలలో కేసీఆర్ ప్రసంగాలకు కనిపించే స్పందనలు మరొక రహస్యం. తన ప్రసంగాలు ఎక్కడ కూడా ఏ దశలోనూ షరా మామూలు విమర్శల వలె, రాజకీయ నాయకుల ప్రసంగాల వలె సాగలేదు.
అటువంటి నాయకులకు భిన్నంగా, వారి పరిపాలనకు భిన్నంగా, తమ జీవితాలకు, సమస్యలకు సంబంధించి ఆ ప్రజలు కేసీఆర్ నుంచి ఏమి వినాలని కోరుకున్నారో, సరిగా ఆ విధంగానే ఉన్నాయి ఆయన మాటలు. సభలు చెప్పిన రహస్యమన్నది ఇంతవరకు చేసిన ఈ చర్చ అంతటిలో ఉన్నది. వాస్తవానికి ఒకవైపు పార్టీలు, భద్రలోక్ మేధావులకు, మరొకవైపు మౌనసముద్రం వంటి సామాన్యులకు మధ్య ఇటువంటి అగాధాలు, బడబాగ్ను లు దేశమంతటా ఉన్నాయి.
మొదట అనుకున్నట్లు ప్రజలలో అన్ని పార్టీల పట్ల, అన్ని ప్రభుత్వాల పట్ల తీవ్రమైన అసంతృప్తి పేరుకుపోయి ఉన్నది. భవిష్యత్తుకు సంబంధించి వీరెవ్వరిపై ఆశాభావాలు లేవు. వాస్తవానికి వారిలోని ఈ అసంతృప్తి భావనలు వెల్లువెత్తటం 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారు ఇరువైయేళ్లకు 1960ల నుంచే మొదలు కావటం తెలిసిందే. వారి అసంతృప్తి ఈ యాభయ్యేళ్లుగా వేర్వేరు వర్గాలలో, వేర్వేరు దశలలో, వేర్వేరు రూపాలలో బయటపడుతుండటం కూడా తెలిసిందే. అది శాంతియుత రూపాలు, హింసాత్మక రూపాలు తీసుకుంది. ఎన్నికలలో ఓడించటాలు చేసింది. కోట్లాదిమంది మౌనంగా పేదరికాన్ని అనుభవిస్తూ ప్రాణాలు విడవటం సైతం ఒక సంఘర్షణా రూపమే అయింది. ఇటువంటి ప్రజానీకమంతా పార్టీలకు బయటి ఉద్యమకారులకు, సంస్కర్తల పిలుపులకు ఎన్నోసార్లు స్పందించింది.
ఈ మహావిషాదాన్నంతా వ్యక్తావ్యక్తమైన సారాంశ రూపంలో ఆ మూడు మహారాష్ట్ర సభలు ప్రకటించాయి. తరతరాల భారత ప్రజల ఈ విషాదపు లోతులు, వారి స్పందనలలోని రహస్యాలు, కేవలం ఎన్నికల లెక్కలకు పరిమితమయే రాజకీయ నాయకులకు అర్థమయేవి కావు. పలువురు భద్రలోక్ మేధావులకు కూడా అంతుపడుతున్నట్లు లేవు. వారు కూడా ఎన్నికల కాకిలెక్కల చట్రంలో చిక్కుకుపోయారు. ఒకపుడు ‘ప్రజలు’ అంటూ ఆలోచించినవారు కూడా ఆ ప్రజల మనోగతాలు, వాటి లోతులు ఇపుడు ఏ విధంగా ఉన్నాయో తరచి చూసే ప్రయత్నం చేయటం లేదు. వారి వద్దకు పోవటం, ఒపెన్మైండ్తో మాట్లాడటం మానివేసారు. తమ స్వీయ వైఫల్యాల నుంచి పుట్టుకు వచ్చే కృత్రిమ సూత్రీకరణలను ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక వారికి ఆ మూడు సభలలోని అనూహ్యమైన వెల్లువ రహస్యాలు అంతుపట్టటం లేదు.
టంకశాల అశోక్