మీరు క్షేమమని భావిస్తాను. ఎంతో ఘనచరిత్ర కలిగిన మన దేశంలో మహిళల సమానత్వం, ప్రాతినిధ్యం ఆదర్శాల పట్ల అచంచలమైన, అంకితభావం, తక్షణ స్పందన ఆవశ్యకత గురించి ఈ లేఖ రాస్తున్నాను. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఒక చారిత్రక ముందడుగు సాధించేందుకు మనకు విశిష్టమైన అవకాశం కల్పిస్తున్నాయి. భారత రాజకీయ పార్టీలన్నీ కూడా తమ స్వప్రయోజనాలకు అతీతంగా సమైక్యంగా ముందుకురావాలని, సుదీర్ఘకాలం చట్టపరమైన నిద్రాణస్థితిలో ఉండిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భారతీయ ఆలోచనావిధానంలో మహిళలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. మన దేశ జనాభాలో మహిళలు సుమారు 50 శాతం ఉంటారు. మన సమాజంలోని ప్రతి అంశంలోనూ వారిదే కీలకపాత్ర. కానీ రాష్ర్టాల శాసనసభలు, జాతీయ పార్లమెంటు విషయానికి వచ్చేసరికి వారి ప్రాతినిధ్యం అరకొరగానే ఉండిపోవడం బాధాకరం. ఈ అంతరం మన జాతి పురోగతికి అడ్డుపడుతున్నది. మన గొప్ప దేశానికి ఆధారభూతంగా నిలిచే ప్రజాస్వామిక సూత్రాలను తోసిరాజంటున్నది. చట్టసభల చర్చల్లో మహిళల ప్రాతినిధ్యం వివిధ కారణాల వల్ల అత్యంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది.
సమ్మిళితత్వం: లింగ భేదాలకు అతీతంగా, యావత్తు మంది పౌరుల ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాల గురించిన బాగోగులు చూసుకోవాలంటే మన దేశ జనాభా తీరు తెన్నులను ప్రతిబింబించే వైవిధ్యంతో కూడిన చట్టవ్యవస్థ అవసరం. చట్టసభల్లో మహిళలు లేకపోవడమనేది మన సమాజంలో అసంపూర్ణ, పక్షపాతంతో కూడిన ప్రాతినిధ్యానికి దారితీస్తుంది.
సాధికారత: రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల వారికి సాధికారత లభించడమే కాకుండా దేశంలోని కోట్లాదిమంది యువ మహిళలకు స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది. ఏ స్వప్నమూ సాధించలేనంత పెద్దది కాదని, ఏ అడ్డంకి అధిగమించలేనంత ఎత్తయినది కాదనే శక్తివంతమైన సందేశాన్ని ఇది ఇస్తున్నది.
విధానాలపై ప్రభావం: మహిళలు తరచుగా ప్రత్యేక దృక్కోణాలను, ప్రాధాన్యాలను చర్చకు తేవడం జరుగుతుంటుంది. చట్టసభల చర్చల్లో వారి భాగస్వామ్యం వల్ల విధాన నిర్ణయంలో సమగ్రమైన, సమతూకంతో కూడిన వైఖరికి దారితీస్తుంది. ఫలితంగా మన సమాజం మొత్తంగా లబ్ధి పొందుతుంది.
భావనకు రుజువు: ఈసరికే సుమారు 14 లక్షల మంది మహిళా ప్రతినిధులు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. నాయకత్వం, పరిపాలన సామర్థ్యం తమకున్నాయని చాటుకున్నారు. దీన్ని మనం గుర్తించి, విశాలమైన వేదికపై తమ ప్రతిభను రుజువు చేసుకునేందుకు అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చింది.
దురదృష్టవశాత్తు, మన చట్టసభల్లో మహిళలకు చోటు కల్పించే విషయంలో వివిధ భాగస్వామ్యపక్షాల్లో చిత్తశుద్ధి కొరవడటమనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. లోక్సభలో, రాష్ర్టాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా ఎక్కువకాలం పెండింగులో ఉన్నది. ఈ అంశాన్ని తగినరీతిలో చేపట్టే విషయంలో మన రాజకీయవ్యవస్థ సంసిద్ధత లేమికి సదరు జాప్యం బాధాకరమైన సాక్ష్యంగా నిలుస్తున్నది.
రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మీ పార్టీ మొక్కవోని మద్దతు అందించాలని ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ కీలక చట్టానికి మీ అండదండలు అందించాలని, ఇదేదో ప్రత్యేకమైన అంశం అన్నట్టుగా కాకుండా సమ్మిళిత, సమానత్వ ప్రజాస్వామ్య నిర్మాణం దిశగా వేసిన అడుగుగా భావించాలని కోరుతున్నాను.
నా వినతి కేవలం ఒక పార్టీకి పరిమితం కాదు, అది భారతదేశంలోని నమోదైన, గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఉద్దేశించింది. కనీసం ఒకసారైనా విభేదాలు మరచిపోయి మన దేశం, మన భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఏకతాటి మీదకు వద్దాం.
స్త్రీ, పురుష సమానత్వం, ఇనుమడించిన ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం దిశగా ఒక చారిత్రక ముందడుగు వేద్దాం.