Telangana | తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టి రాష్ర్టాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఒకరకంగా ఇవి దేశానికి ఆదర్శంగా నిలిచాయనటంలో సందేహం లేదు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో అంశాలు తెలంగాణ అన్నిరంగాలు, అన్నివర్గాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. అంతేకాకుండా మ్యానిఫెస్టోలో లేని అనేక పథకాలను, కార్యక్రమాలను కూడా అమలుచేసి తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ తనదైన ముద్ర వేశారు.
దేశంలోనే మొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేశాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రులకు ఆడపిల్లలంటే భారం కాదని, వారి పట్ల సానుకూల దృక్పథం కనబరిచేలా ఈ పథకం ఉపకరించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బాలిక విద్య కోసం ప్రత్యేక గురుకులాలను సైతం ఏర్పాటుచేశారు. తద్వారా అనేకమంది బాలికలు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువులు చదివి రాణిస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు లేని పేద మహిళలకు రూ.3 లక్షలు అందించి వారిని ఓ ఇంటివారిని చేశారు కేసీఆర్. ఇలాంటి మహిళాభ్యున్నతి కార్యక్రమాలు మహిళలను సామాజికంగా, ఆర్థికంగా ముందు వరసలో నిలబెట్టడానికి దోహదం చేస్తున్నాయి. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘనత అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
పలురంగాల్లో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్న మహిళల స్వావలంబన, సాధికారత కోసం సీఎం కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వా ల పాలనలో మహిళలు అనుకున్నంత పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ మహిళల కోసం స్వ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. గత తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మహిళల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలు మహిళా సంక్షేమంతో పాటు సాధికారతపై ప్రత్యేక దృష్టిసారించాయి. ముఖ్యం గా ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళ, షీ టీమ్స్, వీ హబ్, ప్రసూతి సెలవులు వంటి అనేక పథకా లు మహిళల సాధికారతకు దోహదం చేస్తున్నాయి. ఈ పథకాలు మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యంతో పాటు, మహిళల ఆత్మగౌరవానికి ఆలంబనగా నిలుస్తున్నాయి.
2023 బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని మహిళలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను పరిశీలిస్తే… స్వశక్తి మహిళా గ్రూపులకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలోని 46 లక్షల మంది మహిళలు స్వశక్తి మహిళా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. పక్కా భవనాలు లేని గ్రూపులకు ప్రభుత్వమే విడతల వారీగా భవనాలు కట్టిస్తామని హామీ ఇచ్చింది. ఇది మహిళా చైతన్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నది. పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందివ్వనున్నారు. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు, గ్యాస్ ధరలు తగ్గినా కేం ద్ర ప్రభుత్వం ప్రజలపై అడ్డగోలు భారం మోపుతున్నది. దీంతో దేశంలో చాలామంది గ్యాస్స్టవ్లు మానేసి మళ్లీ కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. ఈ బాధలు పోగొట్టడానికి అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామనటం హర్షణీయం. మహిళా అభ్యున్నతికి మణిహారం లాంటి పథకం ‘సౌభాగ్యలక్ష్మి’. దీనిద్వారా బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు రూ.3 వేల గౌరవ భృతి చెల్లించనున్నారు. ఇది ఒకరకంగా మహిళలు ఆత్మ గౌరవంతో బతుకడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ పథకాలతో మరోసారి మహిళలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతున్నారు. ఆ నీరాజనాలే ఓటు రూపంలో ముచ్చటగా మూడోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయడానికి ఆశీర్వాదాలు కానున్నాయి. తద్వారా భవిష్యత్తు తెలంగాణ మహిళాలోకం అవకాశాలను అందిపుచ్చుకొని మరిం త ముందుకెళ్లనున్నది.
(వ్యాసకర్త : సామాజిక విశ్లేషకురాలు)
-ఎస్.శ్యామల మహారాణి
80085 39905