పార్లమెంటులోనైనా, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలోనైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ హక్కులు, వాటా,నిధుల కోసం పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఇందుకు ఎన్నో చారిత్రక ఆధారాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ తెలంగాణను దేశంలోని 29 రాష్ర్టాల్లో కేవలం ఒక రాష్ట్రంగా పరిగణిస్తే బీఆర్ఎస్ మాత్రం పదేండ్లలో తెలంగాణ హక్కుల కోసం, రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా మోదీ సర్కారును నిలేసింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు రాష్ర్టానికి సాధించింది శూన్యం. అందుకే నేనంటున్నా తెలంగాణ బలం, గళం, దళం బీఆర్ఎస్సేనని.
BRS | కొండంత నమ్మకంతో రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీగా గతంలో గెలిపిస్తే రాష్ర్టానికి హామీ ఇచ్చిన నిధులేవీ తీసుకురాలేకపోయారు. ఆ పార్టీలోని మిగతా ఇద్దరు ఎంపీల సంగతి సరేసరి. కానీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు రాకపోవడం పట్ల బాధ పడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదన్నది ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలపై నాలుగు రోజులు ఆగితే ప్రజలే ఆ పార్టీని కడిగి పారేస్తారు. ఇక గత రెండు పార్లమెంట్ ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ దాదాపు 10 శాతం ఓట్లను ఎక్కువగా పొందింది. రాష్ట్రంలోని మొత్తం 120 మున్సిపాలిటీల్లో 105 బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. ఆరు కార్పొరేషన్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి.
తెలంగాణ ఉద్యమమైనా, రాష్ట్ర పరిపాలన అయినా వాటిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్క్ను ఎవరూ చెరిపేయలేరు. తెలంగాణ అంటే దేశంలో ఎక్కడైనా గుర్తుకు వచ్చే ఏకైక పేరు కేసీఆర్ మాత్రమే! కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ర్టానికి అస్తిత్వం, ఆత్మగౌరవం వచ్చాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే తెలంగాణ వాణిని గురించి ఢిల్లీలో బలంగా వినిపించాలన్నా, తెలంగాణకు ప్రయోజనాలు కలగాలన్నా బీఆర్ఎస్ దండు పార్లమెంటులో ఉండాల్సిందే. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు ఏనాడూ తెలంగాణ ప్రయోజనాలు గుర్తుకురావు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు కదలాల్సిన అవసరం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉన్నది. రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చింది. అధికారం వచ్చిన తర్వాత హామీలు ఎగ్గొట్టేందుకు శ్వేత పత్రాల పేరుతో ప్రజల దృష్టి మళ్లించే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 420 హామీలను పక్కనపెట్టి డ్రామాలాడుతున్నది. కాంగెస్ ప్రభుత్వం ఇప్పటికీ రైతుబంధు డబ్బులు పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవటంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఆ పార్టీ వ్యవహరిస్తున్నది. అబద్ధాలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, అదే ప్రచారాన్ని మరోసారి ప్రయోగించాలని చూస్తున్నది. ఆ పార్టీ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలను ఓట్లు అడుగుదాం. లోక్సభ ఎన్నికల్లో మాత్రమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ను సమాయత్తం చేద్దాం. బీఆర్ఎస్కు ఉద్యమాలు, పోరాటాలు కొత్త కాదని, ప్రతిపక్షంలో మన పార్టీ ఎలా బాధ్యతాయుతంగా ఉంటుందో గతంలోమాదిరి ఇప్పుడూ చూపిద్దాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఏమాత్రం వెనుకాడినా వారి తరఫున కొట్లాడి అవసరమైతే జైలుకు వెళ్లడానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.5 వేల కోట్ల టెండర్లను రద్దు చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్లోని హేమాహేమీ నాయకులను కూడా బీఆర్ఎస్ మట్టి కరిపించింది. బడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతర కృషి చేస్తున్నది. అందుకే ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయలో పడకుండా బీఆర్ఎస్కు మద్దతు పలకాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు)
-పలుగుచెరువు మహేశ్