ఏ దేశానికైనా పల్లెలే పట్టుగొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఈ సంగతి గమనించిన
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధికి విశేష కృషి చేసింది. దీని కారణంగా తెలంగాణ గ్రామీణ, ఆర్థిక జీవనానికి జవసత్వాలు వచ్చాయి. సంపద ఒక్కరి దగ్గరే పోగు కాకుండా ప్రజలందరి చేతుల్లోకి వెళ్లింది. రైతు జీవనభద్రతే జాతి ఆహారభద్రత అని గుర్తెరిగిన పాలకుడు కేసీఆర్.
పాలకుల నిర్లక్ష్యంతో సేద్యం సంక్షోభంలో చిక్కుకుపోయింది. రైతు ప్రయోజనాలను, సేద్య ప్రగతిని, గ్రామీణాభివృద్ధిని వేర్వేరుగా పరిగణించినంత కాలం దేశ ప్రగతి ఎండమావి అని గ్రహించిన కేసీఆర్, రైతు స్వావలంబన కోసం కృషిచేశారు. ఈ కృషి ఫలితంగా భూమి ఉత్పత్తి వనరుగా, భూమే ఆదాయ మార్గంగా నేటి తెలంగాణ పల్లెలు పచ్చని పంటలతో అలరారుతున్నాయి.
రాష్ట్రంలోని 58 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నది. సాగు నీరు, రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోళ్లు, ఉచిత కరెంటుతో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచింది. అంతర్జాతీయ వ్యవసాయ వేదికలపై తెలంగాణ పథకాలు, ప్రగతిపై చర్చ జరుగుతున్నది. ఐరాస సంస్థ ఎఫ్ఏవో (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) గుర్తించిన ప్రపంచ 20 ఉత్తమ పథకాల్లో రైతుబంధు, రైతుబీమా నిలవడం రాష్ర్టానికి గర్వకారణం. అమెరికాలో ఓ అంతర్జాతీయ వేదికపై తెలంగాణ వ్యవసాయ విజయాల గురించి చెప్పమని ఆహ్వానించడం రాష్ట్ర ఖ్యాతిని చాటింది. పత్తిని ప్రోత్సహించడం మూలంగా రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులు 400కు పెరిగాయి. వరి ఉత్పత్తి పెరగడంతో వేల సంఖ్యలో రైస్ మిల్లులు ఏర్పడ్డాయి. పంటల మార్పిడిలో తెలంగాణ రైతాంగం ముందున్నది.
గతంలో 30 వేల ఎకరాలున్న ఆయిల్పామ్ విస్తీర్ణం అతి తక్కువకాలంలో లక్షా 94 వేల ఎకరాలకు చేరింది. విస్తీర్ణంలో తెలంగాణ కన్నా పెద్దగా ఉన్న యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ప్రగతి కోసం పెడుతున్న ఖర్చులో 25 శాతం కూడా పెట్టడం లేదు. రాష్ట్రంలో సహకార రంగంలో రూ.6 వేల కోట్లున్న టర్నోవర్ నేడు రూ.20 వేల కోట్లకు పెరిగింది. వ్యవసాయంలో చెరువుల ప్రాధాన్యాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువుల్లో పూడిక తీసి వాటిని సాగు యోగ్యంగా మార్చింది. ఫలితంగా తెలంగాణలో 2014 నాటికి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం పదేండ్లలో.. 2022-23 నాటి కి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికితోడు ఉద్యానవన పంటలు 11.50 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి.
వ్యవసాయరంగం 81.6 శాతం వృద్ధిని సాధించిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. రాష్ట్ర జీఎస్డీపీ రూ.3.50 లక్షల కోట్ల నుంచి రూ.13.50 లక్షల కోట్లకు పెరిగింది. అందులో వ్యవసాయరంగ వాటా 18.5 శాతం ఉండటం విశేషం.
రైతు ఆత్మహత్యల పీడను తెలంగాణలో లేకుండా చేయాలని, రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ సాకారం కావాలని కేసీఆర్ సంకల్పించారు. ఇందుకు రైతులను రుణ విముక్తులను చేయడమే మార్గమని ఆయన ఆలోచించారు. ఇందుకోసమే పంట రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రూ.లక్ష రుణం గల 40.74 లక్షల మంది రైతులకు చెందిన రూ.17,351 కోట్ల రుణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలో 5.41 లక్షల మంది రైతులకు చెందిన రూ.1,198 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండో విడతలో 22.46 లక్షల మంది రైతులకు చెందిన రుణమాఫీ కోసం రూ.18,242 కోట్లను రైతులకు అందజేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగం అభివృద్ధిపై దృష్టిసారించి దాని బడ్జెట్ను పెంచి విశేష కృషిచేసిన కారణంగా తెలంగాణలో ఐదు విప్లవాలు సాకారమయ్యాయి. అవి గ్రీన్ రెవెల్యూషన్, వైట్ రెవెల్యూషన్, పింక్ రెవెల్యూషన్, బ్లూ రెవెల్యూషన్, ఎల్లో రెవెనల్యూషన్. వీటిలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించింది. స్వరాష్ట్రంలో వరితో పాటు ఇతర పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం వరి సాగు విస్తీర్ణం 121 లక్షల ఎకరాలు కాగా, ధాన్యం ఉత్పత్తి 262 లక్షల టన్నులకు పెరిగింది. 2015-16తో పోల్చితే ధాన్యం ఉత్పత్తి 400 శాతం పెరిగింది. పాడి పరిశ్రమను, పాడి రైతులను ప్రోత్సహించడంతో పాల ఉత్పత్తి భారీగా పెరిగింది. 2014-15లో 42 లక్షల టన్నుల పాలు ఉత్పత్తి కాగా 2023 నాటికి 58 లక్షల టన్నులకు పెరిగి 38 శాతం పెరుగుదల నమోదైంది. పాడి రైతులకు దేశంలో మరెక్కడా లేనివిధంగా లీటర్కు రూ.4 ప్రోత్సాహకం అందించింది. ఈ మేరకు రూ.300 కోట్లు రైతులకు ఇచ్చింది.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం పింక్ రెవెల్యూషన్ను సృష్టించింది. గొర్రెల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1.91 కోట్ల గొర్రెలున్నాయి. ఈ పథకంతో గొర్రెల సంఖ్య 48.51 శాతం పెరిగింది. 10.04 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తితో దేశంలో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీతో రాష్ట్రంలో నీలి విప్లవం ఆవిష్కృతమైంది. చేపల ఉత్పత్తి 2.68 లక్షల టన్నుల నుంచి 3.90 లక్షల టన్నులకు పెరిగింది. చేపల ఉత్పత్తి విలువ రూ.2,637 కోట్ల నుంచి రూ.5,960 కోట్లకు పెరిగింది. ఆయిల్పాం సాగు ఎల్లో విప్లవానికి దారితీసింది. మొత్తం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు కోసం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు 1.94 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతున్నది. ఇలా పలురకాల వ్యవసాయ పథకాలకు రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీరందింది. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణలో 6 జిల్లాల్లోని మరో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. ఇవీ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పట్టుదల రాష్ట్ర వ్యవసాయరంగం దశదిశను మార్చేసింది. రైతుల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును, రాష్ట్ర వ్యవసాయరంగాన్ని ఇలాగే అభివృద్ధి దిశగా పయనింపజేస్తుందా, మళ్లీ మొదటికే తెస్తుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఏదేమైనా రైతాంగం సంబురంగా ఉంటేనే యావత్ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరువరాదు.
కరణం అంబికా కృష్ణ