ఉద్యమాల గడ్డ ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చింది. సభకు అతిథులుగా హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ నాయకుడు డి.రాజా కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసించారు. తమ రాష్ర్టాల్లోనూ ‘కంటివెలుగు’ లాంటి మానవీయ పథకాలను అమలుచేస్తామని సభావేదికగా గర్వంగా ప్రకటించారు. ఖమ్మం సభతో తెలంగాణ
మాడల్ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చినట్లే.. రేపు నాందేడ్లో నిర్వహించే భారీ బహిరంగా సభ మరో మైలురాయి అవుతుంది.
తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు ఎక్కువ మంది పేదలకు లబ్ధి చేకూర్చడంతో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు బీఆర్ఎస్ పట్ల విశేషంగా ఆకర్షితులవుతున్నారు. అటు కర్ణాటకలో, ఇటు మహారాష్ట్రలో మొక్కుబడిగా కొన్ని పథకాలున్నా,అవి పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతులకు సరైన ఆదరణ, భరోసా లేదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ‘ఆసరా’ పథకంతో వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతవు లకు, ఒంటరి మహిళలకు ఇట్లా అనేక మందికి భరోసా కల్పిస్తున్నది.
భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 75 ఏండ్లు గడుస్తున్నా.. దేశంలో పేదరికం పూర్తిగా తొలగిపోలేదు. అనేక మంది ప్రజలు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేక నేటికీ ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలోనే మంచి సాగుభూమి, నీరు, వాతావరణం లాంటి సహజ వనరులున్న దేశం మనది. కానీ గత పాలకుల స్వార్థపూరిత విధానాల వల్ల మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నది. ముఖ్యంగా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత దేశం మళ్లీ వెనక్కి వెళ్తున్నది. పేదల బతుకులు మార్చేందుకు, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు, పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించేందుకు ఉన్న అవకాశాలను తుంగలో తొక్కి, కార్పొరేట్లకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నది బీజేపీ ప్రభుత్వం. ప్రజాస్వామ్య, రాజ్యంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నది. అన్యాయం జరుగుతున్నప్పుడు, అణచివేత పెరుగుతున్నప్పుడు, హక్కులను కాలరాస్తున్నప్పుడు వాటిని ప్రశ్నించే నాయకుడొకరు ఉద్భవిస్తాడు. దేశంలో బీజేపీ దుర్మార్గ పాలనను అంతమొందించి అభివృద్ధి దిశగా గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కేసీఆర్ బయల్దేరారు. ఆరు దశాబ్దాల తెలంగాణ కలను నెరవేర్చి జన్మ సార్థకం చేసుకున్న ఆయన, ప్రజలను గెలిపించి, దేశాన్ని నిలబెట్టేందుకు మళ్లీ ముందుకొచ్చారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ను నిలిపేందుకు రేపు నాందేడ్ నుంచి మరో అడుగు ముందుకు వేయనున్నారు.
నాందేడ్ సభకు కొన్ని విశిష్ట లక్షణాలున్నాయి. ఈ సభ ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల కష్టాలను అడ్రస్ చేసే సమావేశం అవు తుంది. 1724-1948 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని నిజాంలు పాలించారు. ప్రస్తుత మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ఉన్న అనేక ప్రాంతాలు తెలంగాణతో కలిసి నిజాం పాలనను పంచుకున్నవే. ఔరంగాబాద్, పర్భణి, నాందేడ్, భిర్, ఉస్మానాబాద్, లాతూర్, బీదర్, గుల్బర్గా, రాయచూర్లు మనతోపాటే నిజాం ఏలుబడిలో ఉండేవి. స్వతంత్ర భారతంలో ఇవి మహారాష్ట్రలో కొన్ని, కర్ణాటకలో కొన్ని కలిశాయి. అయితే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు తెలంగాణ సరిహద్దు జిల్లాలతో సత్సంబంధాలున్నాయి. చుట్టరికాలు, పెండ్లిళ్లు, బంధుత్వాలు కొనసాగుతున్నాయి. నేను పుట్టింది జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోనే అయినప్పటికీ.. నేను చదువుకున్నది మహారాష్ట్రలోనే. గత 30 ఏండ్లుగా నేను ప్రస్తుత మహారాష్ట్ర, కర్ణాటకలోని చాలా ప్రాంతాలను దగ్గరగా చూస్తున్నాను.
నాకున్న బంధువులు, మిత్రులు కూడా ఇక్కడినుంచే ఎక్కువున్నారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ భాగస్వామ్యంలోని ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఇటు మరఠ్వాడ సహా అటు కర్ణాటకలోని చాలా ప్రాంతా ల్లో ఏ మాత్రం అభివృద్ధి లేదు. అటు వానలు పడక, పడిన నీటిని ఒడిసిపట్టి సాగునీరుగా వాడుకోలేక ఇక్కడి చాలా ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్నాయి. ఎక్కడైనా కాస్తో కూస్తో పం టలు పండుతున్నాయంటే అవి వర్షాధారమే. అందుకే ఇక్కడ రైతు ఆత్మహత్యలూ ఎక్కువే. తాగునీటికీ కటకటే. గుక్కెడు నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్తుంటారు. కరెంట్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. చదువుకునేందుకు బడులు సరిగా లేవు. కొన్నిచోట్ల ఉన్నా.. వాటిలో సౌకర్యాలుండవు. ఇక్కడ వైద్యం అందుబాటులో లేక ఇప్పటికీ ఈ సరిహద్దు ప్రాంతాల ప్రజలు హైదరాబాద్కు వస్తుంటారు. ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వీరికి తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చిన కేసీఆర్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. కేసీఆర్ పాలన వస్తే.. తమకూ తెలంగాణ తరహా జనరంజక పాలన వస్తుందని ఆశగా చూస్తున్నారు. రేపటి నాందేడ్ సభలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కి ఒక భరోసా కల్పించనున్నారు.
తెలంగాణలో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, కంటివెలుగు, మిషన్ భగీరథ వంటి ఎన్నో పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవు. తెలంగాణలో అమలుచేస్తున్న కొన్ని పథకాలను చాలా ప్రభుత్వాలు కాపీ కొట్టి మరీ తమ రాష్ర్టాల్లో అమలు చేసుకుంటున్నా యి. కేంద్ర ప్రభుత్వమూ నిస్సిగ్గుగా కొన్ని పథకాలను కాపీ కొట్టడం హాస్యాస్పదం. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జహీరాబాద్ ఎంపీగా నేను గత పదేండ్లుగా ఇక్కడి ప్రజలకు సేవలందిస్తున్నాను. పార్లమెంట్లో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతున్నాను. జహీరాబాద్ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నిత్యం కలుస్తుంటారు. అలా కలిసినప్పుడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి చర్చిస్తుంటారు.
‘మీ సీఎం సార్ బాగా చేస్తున్నారు.. ఓ ప్రజాప్రతినిధిగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు మంచి సేవలు అందించగలుగుతున్నారు. మా పరిస్థితి అలా కాదు.
ప్రజలకు తెలంగాణలో ఉన్న పథకాల వంటివి అమలుచేయలేకపోతున్నాం’ అని బాధపడుతుంటారు. ఆ నాయకులు కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత అనేకమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల తదితర స్థానిక సంస్థల నాయకులు బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్లో చేరుతామని, పార్టీ అధినేత కేసీఆర్తో మాట్లాడాలని ఇప్పటికే అనే క మంది నన్ను ఒత్తిడి చేశారు. రేపటి నాందేడ్ సభ అలాంటి వారి చేరికలకు ఓ వేదిక కాబోతున్నది. నాతోపాటు ఇక్కడి సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న మెజారిటీ నాయకులు, ప్రజలు మరాఠీ, హిందీ, కన్నడం, తెలుగు మాట్లాడుతారు. నేనెప్పుడైనా ఇక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్లు వారి కష్టాలను చెప్పుకొనేవారు. మా దగ్గర కూడా అభివృద్ధి చేయాలని, మంచి పథకాలు అమలుచేయాలని కోరేవారు. వారి ఆశ నెరవేరే రోజు రాబోతున్నది.
నాతోపాటు జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో నాందేడ్ సభ ఏర్పాట్ల కోసం గత కొన్నిరోజులుగా కృషి జరిగింది. సీఎం కేసీఆర్, మం త్రులు కేటీఆర్, హరీశ్రావు సూచనల మేరకు పెద్ద సం ఖ్యలో వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రజాస్వామ్యంలో గెలువాల్సింది పార్టీ లు కాదు, ప్రజలు గెలువాలని కేసీఆర్ ఎప్పు డూ చెప్తుంటారు. ప్రజలను గెలిపించినవారే నిజమైన నాయకులు. అలాంటి నాయకత్వం కోసం.. ప్రజలు ఎప్పుడూ ఎదురుచూస్తుంటా రు. నాందేడ్ సభ మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలకు భరోసా ఇవ్వడంతోపాటు బీజేపీ దుర్మార్గ పాలనపై దేశ ప్రజలను ఆలోచింపజేయనున్న ది. ఈ సభ బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో కీలక మైలురాయి కానున్నది.
(వ్యాసకర్త: పార్లమెంట్ సభ్యులు, జహీరాబాద్)
-బీబీ పాటిల్