తాను చేపట్టని ప్రాజెక్టులకు, పథకాలకు ప్రారంభోత్సవాలు చేసి వాటిని తన ఘనతలుగా చెప్పుకోవడం ప్రధాని మోదీకి అలవాటుగా మారింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఆ పనే చేస్తున్నారు. తాత్కాలిక పథకాలు, వరాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుదీర్ఘ కాలం సీఎంగా, ప్రధానిగా ఉన్న మోదీ సొంత రాష్ట్రంలో వెలగబెట్టిన ‘అభివృది’్ధ ఏమిటో గుజరాతీలకు బాగా తెలుసు!
‘సర్దార్ సరోవర్ డ్యామ్కు 1961లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుంది’ అని అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ వార్తా ఛానల్ నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఈ విషయాన్ని పేర్కొంటూ రొమ్ము విరిచి, తొడ చరిచినంత పని చేశారు అమిత్ షా! 1990 నుంచి గుజరాత్లో అధికారంలో ఉన్నది బీజేపీనే అన్నది ఆ సమయంలో ఆయన బుర్రకు తట్టనట్టుంది. 1990లో జనతాదళ్ పొత్తుతో గుజరాత్లో కాషాయపార్టీ అధికార ప్రస్థానం మొదలైంది. 1998 నుంచి ఆ రాష్ట్రం పూర్తిస్థాయిలో భారతీయ జనతా పార్టీ పాలనలోనే ఉండిపోయింది. 2001లో ముఖ్యమంత్రిగా ఎంపికైన నాటి నుంచి 2014లో దేశ ప్రధానిగా ఎన్నికయ్యే వరకు గుజరాత్ ఐకాన్గా నరేంద్ర మోదీ తనను తాను ప్రజెంట్ చేసుకున్నారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో ఏదేదో సాధించేసినట్టు అరచేతిలో స్వర్గం చూపించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 13 ఏండ్లలోనూ సర్దార్ సరోవర్ డ్యామ్ పూర్తికాకపోవడం గమనార్హం. 2017లో ప్రధానిగా గుజరాత్ వెళ్లి ఆ ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారు!
సుమారు 324 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రమారమి 56 ఏండ్ల కాలం పట్టింది. అందులో 30 ఏండ్ల పాపం కాంగ్రెస్ ఖాతాలో పడితే, 26 ఏండ్ల వాటా బీజేపీకి చెందుతుంది. భూ సేకరణ, నిర్వాసితులకు నష్టపరిహారం, నర్మదా బచావో ఆందోళనలు, కోర్టు స్టే విధించడంతో చాలా ఏండ్లు ప్రాజెక్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన నిలిచిపోయాయి. కానీ, 2000 సంవత్సరంలో కోర్టు అంగీకారం తెలపడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. న్యాయస్థానం పచ్చజెండా ఊపిన కొన్నాళ్లకే గుజరాత్లో కాషాయ జెండా పట్టుకున్న మోదీ హయాం మొదలైంది. ముచ్చటగా మూడుసార్లు ముఖ్యమంత్రిత్వాన్ని నిర్వహించిన మోదీ పాలనలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడం ఆయన పనితీరుకు గొప్ప నిదర్శనంగా చెప్పవచ్చు. దీన్ని వైఫల్యంగా పరిగణించకుండా ‘సదరు ప్రాజెక్టును మేమే పూర్తి చేశాం’ అని ప్రధాని ప్రియతమ సహచరుడు సొంత డప్పు కొట్టుకోవడం హాస్యాస్పదమే! ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన పలు కాలువలు ఇప్పటికీ ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయాయని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విమర్శిస్తుండటం బీజేపీ పనితీరు ఏపాటిదో చెప్పకనే చెబుతున్నది.
ఒకసారి మన తెలంగాణకు వద్దాం! ఒకే ప్రాజెక్టును దశాబ్దాలు సాగదీస్తూ.. ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకోలేదు కేసీఆర్. పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు మన కండ్లముందు సాక్షాత్కరిస్తున్న మాట నిజం కాదా! ఇప్పుడు తెలంగాణలో బీడువారిన భూముల్లేవు. నెర్రెలు వారిన పొలాల్లేవు! ఒక నదికి ఆనకట్ట కట్టడానికి 27 ఏండ్లు ఆపసోపాలు పడిన గుజరాతీ ద్వయానికి.. మన కాళేశ్వరం ప్రాజెక్టును అద్వితీయమని అనగలిగే ధైర్యం ఉందా? వారి తరపున ఇక్కడ వెర్రికూతలు కూసే వెంగళప్పలకు ఆ ప్రాజెక్టు విలువ తెలుస్తుందా?
రెండేండ్ల కిందట గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సగర్వంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరు ‘కిసాన్ సూర్యోదయ్ యోజన’. స్వయంగా ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. 2023 జనవరి నాటికి 4000 గ్రామాల్లో వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ ఇవ్వడం ఈ ప్రాజెక్టు లక్ష్యం! 2024 చివరి నాటికి రాష్ట్రమంతా దీన్ని విస్తరించాలన్నది తర్వాతి ప్రణాళిక. గుజరాత్ మాడల్ అంటూ ఊదరగొట్టి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న మోదీ.. తిరిగి ఆరేండ్ల తర్వాత అక్కడికే వెళ్లి రైతులకు పగటి పూట విద్యుత్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యకరం. సుమారు పదమూడేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సాధించిందేమిటో అంతుపట్టదు.
రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎదుర్కొన్న బాలారిష్టాల్లో కరెంట్ ఒకటి. దశాబ్దాల అన్యాయం తెలంగాణను చీకట్లోకి నెట్టేసింది. గోరుచుట్టుపై రోకటి పోటులా కుట్ర చేసి తెలంగాణకు చెందాల్సిన సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టిన ఘనత మోదీకే దక్కుతుంది. ఇన్ని సంకటాల్లోనూ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది నెలల్లో గృహావసరాలకు నిరంతర విద్యుత్ను అందించిన ఘనత మన ముఖ్యమంత్రిది. అధికారంలోకి వచ్చిన మూడున్నరేండ్లకే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా మొదలైంది. ప్రతి పొలానికి, ప్రతి బోరుమోటర్కు 24 గంటల కరెంట్ అందిస్తూ కేసీఆర్ సాధించిన విజయం ఇంకా పైలెట్ ప్రాజెక్టుల పేరుతో రైతులను గోస పుచ్చుకునే గుజరాతీ పాలకులకు ఎలా అర్థమవుతుంది. గుజరాత్లో పగటి పూట పవర్ అంటూ ప్రకటించిన ‘కిసాన్ సూర్యోదయ్ యోజన’ మళ్లీ పవర్లోకి వచ్చేందుకు విసిరిన పాచిక. 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న హామీలాగా పగటి పూట విద్యుత్ కూడా పగటి కలగా మిగిలిపో తుందేమో! గుజరాతీలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి. తెలంగాణ ప్రజలు వాస్తవాలు గ్రహించాలి.
– కణ్వస